Friday, 16 May 2025

తేలిక తాలూకు మహిమ


నాథే యాతే మధుపుర మతి
       క్షోభ విభ్రష్టచిత్తా
గోపీ కాచిత్కలయతి సఖీ
      రంతరంగాః సమీపే 
ప్రాణత్యాగాదతి గురుతరే 
      తస్యబంధోర్వియోగే
కేన స్థేయం ముహురిత వచో
       వ్యాకులా స్తా బభాషే. 

Sunday, 11 May 2025

వేమన గురువు చెప్పిన విముక్తివిద్య


 "తునాతున్క లగుచున్న 'కడిద'ము అను నల్లని రంగుపూత గల కాగితముపై పిండిబలపముతో వ్రాయబడియున్న యీ పద్యము లొక ప్రాచీన శతకములోనివి" అన్న గగుర్పాటు కలిగించే వాక్యంతో భారతి పత్రిక 1930 వ సంవత్సరం మార్చి సంచికలో "వటమూలమందిరా!" అన్న శీర్షికతో ఈ ఐదు పద్యాలు అచ్చయ్యాయి.

Tuesday, 6 May 2025

శైవశతకరత్నాలు

తెలుగు చాటుసాహిత్యంలోని శైవకవితలు నా మనసుని మహదానందంలో ముంచివేసాయి. శివభక్తి, శరణాగతి వంటి ఉత్తమగుణాలతో పాటు ప్రాకృతసాహిత్యంలో మాత్రమే దొరికే దగ్గరితనం, దేశీయత తెలుగులో శైవసాహిత్యంలో నాకు దొరికింది. 

Monday, 28 April 2025

పాఠకాభిగమనం


పుట్టపర్తి వారి జగద్విదితమైన కావ్యం “శివతాండవము” నకు వాగ్దేవి నా ద్వారా వ్రాయించుకున్న “సహాయవల్లి” వ్యాఖ్య నాకు ఎంతో ప్రత్యేకమైన రచన. దీనికి ముందుమాటలు గానూ, ఈ కృతి ఆవిష్కార సమయంలో స్పందనలు గానూ ఎందరో పెద్దలు, పండితులూ చల్లని పలుకులను ఈ రచనపై కురిపించారు. రచనను చదివి మరికొందరు తమ సహృదయస్పందనలను అందించారు. వారందరికీ ప్రత్యేకకృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇప్పటికి కలిగింది.

Thursday, 27 March 2025

మణిపూసలు: 5 - రంగనాథుని శివకవిత

రగడ శివకవుల సొత్తు. ఈ ఛందోరూపం తెలుగునేలపై శివకవుల చేతులలో పడి యెన్ని వయ్యారాలు పోవాలో అన్నీ పోయింది. ఈ ఛందస్సు పద్యకవితలలోని ఆవృత్తి ధర్మాన్నీ, జానపదాలలోని సంగీత ధర్మాన్నీ తనలో కలుపుకున్న అతి తక్కువ ఛందస్సులలో ఒకటి. దేశీయ ఛందస్సులకున్న ఈ లక్షణమే శివకవులని ఆకర్షించిందనుకుంటాను. రగడ, ద్విపద వంటి దేశీయ ఛందస్సులు కాస్త పాటల రూపం వైపు ఒగ్గినా, వీటి నిర్మాణానికి అనన్యసామాన్యమైన ధార కావాలి.

Wednesday, 26 March 2025

మణిపూసలు: 4 - అపూర్వాంధ్రశివకవి చక్రపాణి రంగనాథుడు

తెలుగుదేశంలో శివకవియుగం భక్తితో ప్రజల జీవనాన్ని సుసంపన్నం చేయడంతో పాటుగా తెలుగుభాషకూ ఎనలేని సేవ చేసింది. ఆ యుగంలో కవిత్రయం పాలుకురికి సోమనాథుడు, పండితారాధ్యులు, నన్నెచోడుడు తెలుగు దేశీయతకి ఒక కొత్త వేదికని నిర్మాణం కావించారు. ఈ యుగంలోనే తెలుగునేలమీద ఉదయించిన ఒక విలక్షణ కవి రంగనాథుడు.

Sunday, 23 March 2025

తల్లీకూతుళ్ల విద్యావాల్లభ్యం

          

17వ శతాబ్దపు తంజావూరు విద్యకు జీవగర్ర. ముఖ్యంగా ఆనాటి దీక్షితుల నట్టిళ్లు పాండిత్యానీకీ కవిత్వానికీ పుట్టిళ్లు. అచ్చన్న దీక్షితులు, రంగరాజాధ్వరి, అప్పయదీక్షితులు, రత్నఖేట శ్రీనివాస దీక్షితులు, సమరపుంగవ దీక్షితులు, యజ్ఞనారాయణ దీక్షితులు, రామభద్ర దీక్షితులు, నీలకంఠ దీక్షితులు, గోవింద దీక్షితులు - ఒక్కొక్కరూ ఒక్కొక మహామేరువు. ఈ కవుల పేర్లు తలచుకుంటేనే, వారి కృతులను గుర్తుచేసుకుంటేనే, వారి ఊపిరి వెనుక ఆదర్శాలను స్మరించుకుంటేనే మేను పులకాంకురితమౌతుంది.

Saturday, 22 March 2025

గురుమూర్తిర్గుణనిధిః

    


2020 వ సంవత్సరంలో నేను మిడిమిడి జ్ఞానంతో సంస్కృతశ్లోకాలకు వ్యాఖ్య వ్రాస్తూ ఫేస్ బుక్ లో ప్రచురిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఒకరోజు అనుకోకుండా నాకు ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ఒక మందారపు మొక్క కుండీ ఛాయాచిత్రం. రెండు విచ్చిన పన్నీరుపూవు రంగు మందారపూవులు, పక్కనే జీవాన్ని నింపుకుని ఉబ్బి ఉన్న మందారమొగ్గఒకటి, భగవంతుని అరచేతులలాంటి పచ్చని ఆకులు. బ్రతుకుకాంతిని ఒకలబోస్తున్న ఆ కుండీ బొమ్మను చూస్తూ దానితో పాటు ఉన్న మహార్ఘమైన శ్లోకాన్ని కాసేపు చూడనేలేదు -

Wednesday, 29 January 2025

మణిపూసలు:3 - భ్రమరాంబామల్లీశ్వర సంవాదము

కొన్ని యోజనాలదూరంలో ఉన్న వస్తువునైనా మనసుకి తెచ్చుకోగలగడం మనకి మాత్రమే సాధ్యపడిన విద్య. భగవదుపాసన సహజంగా భారతదేశమనే పొదకి పుష్పించిన పూవు. భారతజాతి తాను ఉపాసించే దైవమనే వస్తువుకి తన సర్వమూ అర్పణ చేసింది. కటిక ఉపవాసాది ఆచారాలతో భౌతిక సుఖాలని తెంపుకుంది. యెనలేని బలంతో మనసుని తన దేవత ముందు పెట్టింది. దాని ఫలితంగా వేరెవ్వరూ ఊహించని భగవత్సుఖంలో తేలియాడగలిగింది. లౌకికసుఖాలని కొనగోరుతో నేలరాయగలిగింది.

Saturday, 25 January 2025

మణిపూసలు – 2 : చాటువులలో శివుడు

ఈ దేశంలో భగవంతుడు కవితకి యెప్పుడో దాసోహమన్నాడు. కవిత్వపు సామాగ్రి ఏదైనా సరే, అది భగవంతుడికి అన్వయింపబడనిది, ఈ దేశపు వాఙ్మయంలో అసలు కనిపించదు. భగవత్తత్త్వాన్ని ప్రతిపాదించే భాషతో పాటుగా, లౌకికమైన భావాలలోనూ భగవంతుడు అంతే అందంగా ఇమిడిపోయాడు. ఆయన ఉదాత్తతని యేమాత్రమూ తగ్గించకుండా నింద చేసి ఆయనను తగ్గించి, అదీ 'అంతే అందంగా ఉందే' అని అనిపించుకోగలిగిన బుద్ధి భారతీయుడిది. సంస్కృతంలో భవగంతుడిని చమత్కారంలో ప్రతిబింబింపచేసే ఒక విస్తారమైన సాంప్రదాయమే కవికులంలో ఉంది. తెలుగులోకూడా అది అంతే అందంగా ఉంది.

Wednesday, 22 January 2025

కీర్తనీయచరితుడు


తురుష్కో నిష్కాశిః తురగఖుర కుద్దాల దళిత
క్షమా ధూళీపాళీ చుళుకిత చతుస్సిన్ధుసలిలః
స్వదోర్లీలా భగ్న ప్రతిభట వధూటీ పరికరః
ప్రతస్థే కార్తాన్తీం దిశమితి హి వార్తా సమజని.

అపరశివావతారమైన అప్పయ్యదీక్షితుల వారు ఉపాసనలో ఉన్నారు. వీధిబైట ఏదో కలకలం. ఏం జరుగుతుందో చూసిరమ్మని కూతురిని పంపారు. ఆమె బైటకు పోయి వచ్చి ఆయనతో ఆశువుగా పై శ్లోకం చెప్పిందట!"

Wednesday, 15 January 2025

కాంతిపాతం -2



జూలై 1895 న న్యూయార్కు థౌజండ్ ఐల్యాండ్ పార్కులో స్వామి వివేకానంద తాను జీవించి ఉండగానే ఒక కవితావతారంగా పునర్భవించారు. THE SONG OF THE SANNYÂSIN అనే ఈ కవిత స్వామి తనకు తానే తీసుకున్న ఒక ఛాయాచిత్రం. తన మేనికి రాసుకున్న పసుపును ముద్దచేసి పార్వతీదేవి గణపతిని సృజించినట్లుగా, తన మస్తిష్కాన్నంటిన పదాలను ఒలిచి, ముద్దచేసి ఈ కవితగా ప్రాణం పోశారు స్వామి వివేకానంద. ఈ కవిత తన నుండి పుడుతున్న క్షణాలలో ఆయన ఒక కాంతివాహిక. ఒక మంత్రద్రష్ట. ఒక ఋషి. ఒక కవి.

Monday, 13 January 2025

కాంతిపాతం -1



గత కొన్ని రోజులుగా నన్ను స్వామి వివేకానంద కవిత్వం వీడిపోని సాయంఫుల్ల మల్లీపరిమళంలా అల్లుకుని ఉంది. ఇదివరకు ఆయనపై వ్రాసిన అనేకాలైన కవితలు చదువుతూ ఉన్నపుడు తెలుగు కవులు, ముఖ్యంగా పద్యకవులు ఆయన్ను నెత్తినకెత్తుకున్న సంగతి నాకు గుర్తులేకపోలేదు. కడియాల సుబ్బన్నశాస్త్రిగారి వివేకానంద గీతావలి, సన్నిధానం సూర్యనారాయణశాస్త్రిగారి వివేకానందము నుండి, ముదిగొండ వీరభద్రమూర్తి గారి వందేమాతరం కావ్యంలో వివేకానందఖండం, ఎస్.టి.జ్ఞానానందకవి గారి వివేకానంద సింహగర్జన మొదలుగా తిలక్ పద్యాల వరకూ వివేకానందుడు తెలుగుపద్యాలలో పొడగట్టిన రీతి మధురాతిమధురం.

Saturday, 11 January 2025

మణిపూసలు -1: తెలుగులో విరహకవితలు

వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తెలుగు భాషకి చేసిన ఉపకారం అన్యదూరమైనది. ప్రజల జీవితంలోకి చొచ్చుకొని, వారి నోళ్లలో నానుతూ ఉన్న మహోదాత్తమైన కవితాసంపదని ముద్రాపించి, మన ముందు తరాలవారి హృదయాలలోతులని మనకందించారు. వీరి చాటుపద్య మణిమంజరి తెలుగువాడి జీవితానికి నిలువుటద్దం.

Wednesday, 8 January 2025

శుక్లాంబరధరం విష్ణుం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే॥

అన్న శ్లోకం కొన్ని వందల యేళ్లనుండీ భారతీయుల నోళ్లల్లో నానుతూ వస్తోంది. అయినా, ఏ మాత్రమూ తన తీపిని కోలుపోలేదు. ఈ శ్లోకం ప్రతిపాదించే దేవత ఎవరు అని చాలామందికి ఉన్న ప్రశ్న. దీని అర్థాన్ని నిర్ణయించే ముందు, ఈ శ్లోకం వాఙ్మయంలో ఎక్కడెక్కడ ఉందో పరిశీలిద్దాం.

Tuesday, 7 January 2025

దివ్యజీవితాల విజయవైభవం

                       
     ఏదీ నా హృదయమ్ము? చిక్కుకొని రాదే! యాంధ్రభోజుండు ఘో
      రోదారక్రమనైపుణీ సమధృతాస్యుద్భాసియౌ పాణి నే
      దో దామోదర దత్తశాసన మిషాయోగాన సంధించి నా
      పై దారల్ వలె వోసినట్టి తన కావ్యాబద్ధవర్ణాళిలోన్.

Sunday, 5 January 2025

కిసలయించిన ముసలం


మహాకవి గంభీరుడు. ఒక్కోసారి చిక్కడు. తన మనసులో జనించే ఆనందభావాలలో తేలియాడుతూ స్వర్గమర్త్యపాతాళాల నడుమన ఉన్న భేదరేఖలను చెరిపేస్తూ ఆ ఎత్తులలో సంచరిస్తాడు. మరి అటువంటి కవి దగ్గరకు మనలని తీసుకునివెళ్లేదెవరు అంటే దానికి సమాధానం గురువు. ఆయన నిరంతర సాధన చేత కావ్యంలోని ఆనందాలను పాలలోనుండి వెన్నని తీసినట్లు వెలికితీసి మనకోసమందించే దయాపరుడు. సంస్కృతసాహిత్యంలో ఈ ఆనందమథనాన్ని సుళువు చేసి, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సాహిత్యాధ్యయనం చేసే కొన్ని లక్షలమంది గురువులకూ శిష్యులకూ మేలు చేసిన ఆప్తుడు మన తెలుగువాడైన మల్లినాథసూరి.

Friday, 3 January 2025

పదిలక్షలు

 
మా ఇంట్లో కొన్ని ముందు పేజీలూ, కొన్ని వెనకపేజీలూ పోయినటువంటి ప్రతాపరుద్రీయమనే ఒక తెలుగు నాటకం పాత ప్రతి ఒకటి ఉంది. చిన్నతనంలో ఆ పుస్తకాన్ని చదివినపుడు, ద్వితీయాంకంలో వచ్చిన విద్యానాథుడి పాత్ర నా మనసులో ముద్రించుకునిపోయింది. అందులో ముస్లిం రాజుల చెంత బందీగా ఉన్న ప్రతాపరుద్రుడికి అనుకోకుండా విద్యానాథుడు తారసపడి అతడెవరో తెలీయకుండా ప్రతాపరుద్రుడిమీద వ్రాసిన తన కావ్యాన్ని అతనికే వినిపించడమూ, అది విని ఉప్పొంగిన ప్రతాపరుద్రుడు అతడికి ఒక ఉంగరాన్ని ఇవ్వడమూ, దానిమీద "ప్రతాపరుద్రమహారాజు" అన్న ముద్రను చూసి, మహరాజును గుర్తుపట్టి, ఆశువుగా విద్యానాథుడు పద్యాలు చెప్పడమూ ఒక అందమైన సన్నివేశం. (ఈ నాటకాన్ని వ్రాసింది సోమరాజు రామానుజరావు గారు. ఆర్కైవులో అందుబాటులో ఉంది)

Thursday, 2 January 2025

భాషాకుమారుడు



నాలుగు రోజుల క్రిందట డిసెంబరు 28న సంస్కృత ప్రొఫెసర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పియరీ సిల్వియన్ ఫిలియోజాట్ (89) ఈ లోకాన్ని విడిచివెళ్లారన్న వార్త అనుకోకుండా నిన్న నా కంటపడింది. ఆ బాధాకరమైన వార్తను చదువుతూ ఉండగానే వారి వాఙ్మయ స్వరూపం నా కందోయి ఎదుట కదలాడింది. శుభ్రమనస్కుడైన భాషాకుమారుడు ఆయన. గీర్వాణవాణి వాత్సల్యపూరితంగా తన హస్తాన్ని అగోచరంగా చాచి, విశ్వం మొత్తాన్నీ ఇప్పటికీ పొదువుకునే ఉందనే సత్యానికి సాక్షి ఆయన.

Wednesday, 1 January 2025

ఉమాసహస్రంలో అమ్మనవ్వు

మహేంద్రనాధ గుప్త (మ) రామకృష్ణుల పంచన చేరిన తొలినాళ్లవి. ఒకరోజు సత్సంగం జరుగుతోంది. నరేంద్రుడు పాడుతున్నాడు –

మనసా చేయుము మాధవు ధ్యానము
నిత్యనిరంజను నిర్మలాత్ముని
ఎంత నిరుపమంబాతని తేజము
ఎంతమోహనంబాతని రూపము
ఎంత చేరువో ఎల్ల భక్తులకు
ఎంత ప్రియతముండతడో వారికి
విమలవికాసము చెందు ప్రేమలో
కోటిచంద్రనిభ తేరుగేరుచు
మెరపు తీగవలె మెరయు రూపప్రభ
గగురుపాటుతో గూర్చు సౌఖ్యమును.