నాథే యాతే మధుపుర మతి
క్షోభ విభ్రష్టచిత్తా
గోపీ కాచిత్కలయతి సఖీ
రంతరంగాః సమీపే
ప్రాణత్యాగాదతి గురుతరే
తస్యబంధోర్వియోగే
కేన స్థేయం ముహురిత వచో
వ్యాకులా స్తా బభాషే.
వాన వెలిసిన వేసవి కాలపు పొద్దులో తేమ గురుతులు చెరిగిపోక ముందే హృదయాన్ని అల్లరిపెట్టే ఇటువంటి కవిత ఎప్పుడూ అపురూపమే. ఒక మహార్ణవానికి ఎదురుగా నిలబడి, చింతాకుల లాంటి కళ్లతో చూస్తూ మొత్తంగా లోతుపాతులతో కలుపుకొని దానిని పూర్తిగా కొలిచివేసినట్లు కొద్దిసేపు కలిగే మిథ్యాభ్రమ వెనువెంటనే తెలివి కలిగి పటాపంచలు అయినట్లుగా, మానవజీవితంలో ప్రేమ అనే వస్తువు మొత్తంగా మనకు స్వాధీనమైపోయిందనీ దానిపై స్వారీ చేయవచ్చనీ చిన్ని అహంకారం అప్పుడప్పుడూ మొలుస్తూ ఉంటుంది. దానిని తొలగించే గంభీరవిద్య కృష్ణుడు.
కృష్ణప్రేమ ఎటువంటి గురువంటే, ఆ గురువు పొదువుకునే విధానానికి నిలువెల్లా వణికిపోతాం. ఆ సాంగత్యం నిరుపమానం. కృష్ణుడి దాకా అక్కరలేదు, ఆ మధురమూర్తి భక్తుల మనోగతాలలో ఏ ఒక్కటి రవంతగా తాకినా, మనస్తలం తాలూకు వ్యాధులు దూదిపింజల్లా ఎగిరిపోతాయి. ఈ మందు హితవైనదీ, మనోహరమైనది కూడా. శిథిలపడిన ఒక్కో భావాన్నీ ఈ ప్రేమ ఎంత లేతగా బ్రతికిస్తుందని! పరమ భాగవతమూర్తులు శ్రీ మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి గారు తమ సాధనోష్ణంతో వెలుగొందే కళ్లతో "వందే నందవ్రజస్త్రీణాం పాదరేణుం అభీక్ష్ణశః" అని అంటూ దానిని భాషలోని విశేషాలతో కలిపి వ్యాఖ్యానం చేస్తున్నపుడు వారి మాటలలో స్రవించే తీపికి ఎంత శక్తి ఉందో ఒక్కోసారి చెప్పడం కష్టం.
అదుగో, సనాతనమైన నిత్యనూతనమైన ఆ మాధుర్యాన్ని మనసుతో దొరకబుచ్చుకొని ఒక మనోహరమైన దూతకావ్యాన్ని వ్రాసాడొక కవి. పేరు త్రిలోచనుడు. బెంగాలుప్రాంతంలో పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రతికిన వాడు. సుమారు 1730 ప్రాంతంలో ఈ కావ్యం అల్లబడిందని చరిత్రకారులు ఊహిస్తున్నారు. బెంగాలు గాలులే చాలు, కళాత్మకు ఊపిరిపోయటానికి. ఎందరు కళాకారులు! ఎన్నెన్ని కళాముఖాలు! దూతకావ్యజగత్తులోనే బెంగాలు స్థానం మరువలేనిది. కర్తఎవరో తెలియని మనోదూతము, చైతన్యప్రభువు మేనమామ అయిన విష్ణుదాసుడు వెలయించిన మనోదూతము, ఆ విష్ణుదాసుడి వంశంలోని వాడైన రామశర్మ వ్రాసిన మరొక మనోదూతము, మాధవకవీంద్రస్వామి వ్రాసిన ఉద్ధవదూతము, అజ్ఞాతకవి యొక్క హంసదూతము, కృష్ణనాథ సార్వభౌముడు వ్రాసిన పాదాంకదూతము, లంబోదర వైద్యకవి వ్రాసిన గోపీదూతము, గంగాతికూరి భోలానాథుడు కూర్చిన పాంథదూతము వంటి కావ్యాలు అనేకాలు ఉన్నాయి.
అంటువంటి కావ్యాలలో రత్నం లాంటిది త్రిలోచనకవి అల్లిన ఈ తులసీదూతము. 55 శ్లోకాలున్న ఈ కావ్యం గురించిన వ్యాసాలు, సమీక్షలే కానీ, పూర్తిప్రతి ఉపలభ్యంగా లేదు. లభిస్తున్న వివరాలే అందంగా ఉన్నాయి.
కృష్ణుడు మధురానగరానికి వెళ్లిన సమయమది. అంతవరకూ తమ కనులముందరే ఉండి, తటాలున అదృశ్యమైపోయిన అరచేతి మాణిక్యం కృష్ణుడిని తల్చుకుంటూ విరహవేదనలో విహ్వలలైన గోపికల మనస్సు ఈ కావ్యంలో వర్ణించాడు కవి. కృష్ణబంధుని వియోగం ప్రాణత్యాగం కన్నా గురుతరం, ఆ గోపికలకు. పెనుబాధ చుట్టుముట్టిన మొదట్లో, మనసు దానిని నమ్మదు కొద్దిసేపు. కొందరు గోపికలు క్షోభపడుతూ ఉండగా, కొందరు మబ్బుదొంతరల లాంటి కాంతిగల కృష్ణుడు తమ ప్రేమాబ్ధిని దాటుకొని మధురకు వెళ్లాడనే సంగతిని నమ్మడం లేదు -
మనోఽస్మాకం జ్ఞాతుం నిబిడగహనే
నూనమధునా
వసత్యేకో నాథః స ఘనవృంద
ద్యుతిధరః
న చాస్మాత్ ప్రేమాబ్ధిం మధుపురమగాత్
జాతు సహసా
సముల్లంఘ్య ప్రాణప్రియతమవిభుః
పీతవసనః.
కొందరు గోపికలు కలవరపడుతూ బృందారణ్యంలో అహరహం విహరిస్తున్నారు. స్థైర్యం లేక కుంగిపోయిన చిత్తవృత్తి వారిది. కొందరైతే, ఆ నిస్సీమవియోగంలో తమతో అబద్ధాలాడిన కృష్ణుడిని నిందించడం మొదలుపెట్టారు. ఒకామె అన్నది కదా, "కృష్ణుడెవరినైతే తనకు బాగా సన్నిహితులని పలుకుతాడో, ఆ మాటలన్నీ వట్టి అబద్ధం. అందువల్లనే సజ్జనులకు ఆతని మాటలలో ప్రామాణ్యత అగుపట్టదు" అని.
నాస్తే కించిత్ ప్రియతమధవే
గుప్తమేతత్ త్వదగ్రే
వ్యక్తం చైతన్మమ తు భవతా
బంధునా పూర్వముక్తమ్
గుప్త్వాత్మానం వచనమధునాకారి
మిథ్యా స్వకీయం
ప్రామాణ్యం తే వచసి న పునః
జాయతే సజ్జనానామ్.
మరొక గోపిక సహించలేని తనంతో మరికొంత ముందుకు వెళ్లి అన్నది కదా, కొంతమందికి వేదంపై ప్రమాణబుద్ధి కలగకపోవడానికి కారణం ఆ వాక్కులు ఈ మృషావాది ముఖం నుండి వెలివడడమేనని. వేదం పరమాత్మ నిశ్వసితం అని కదూ. అందుకే పాపం, వారందరికీ ఏదో వేరే దృష్టాంతం తాత్కాలికంగా కనిపించి, నమ్మబుద్ధైపోయాక ఊర్ధ్వలోకాలకు వెళ్లే అవకాశం ఎక్కడుంటుంది గనుక? ఇంతటి తగని పని చేసినవాడిని మనసులో నిలుపుకోకుండా ఉండలేకపోవటమే విచిత్రం.
అప్రామాణ్యం శ్రుతిషు బహుభిః
మోఘతే త్వద్వచస్త్వా
దాప్తై, రంత ర్వితథవచనే
వీక్ష్య దృష్టాంతరం చ
పశ్చాత్ కేషాం కథమపి జానా-
నా మపి స్వర్గహేతౌ
యాగే వృత్తి ర్నభవతి జరా-
న్నాథ, నైతత్సుయుక్తమ్
ఇలా మథనపడుతూ, మన్మథుడికే మనస్సును చలింపజేసే సౌందర్యలహరి అయిన కన్నయ్య గురించిన తలపోతలతో (సాక్షాన్మన్మథ మన్మథః), ఆ బృందావనపు గుబురు పొదరిళ్ల మధ్య, వృక్షాలమధ్య, లతల మధ్య తిరుగాడుతున్న వారికి ఒక తులసి మొక్క కనిపించింది. తమ బాధను పలుకులలో పెట్టి, తమ స్వామికి చేరవేయటానికి ఇంతకంటే గొప్ప ప్రియతమ వేరెవరున్నారు? తులసి అంటే స్వామికి ఎంత ప్రియమో! అదేమిటో, సంస్కృతభాషలో కొన్ని వందల చెట్లకూ మొక్కలకూ కొన్ని వందల పేళ్ళు, పర్యాపపదాలున్నా ఏ ఒక్కదానికీ ఇటువంటి పేరు లేదు. తులసి - తులాం సాదృశ్యం స్యతి నాశయతీతి తులసీ. తనకు సాటిదనాన్ని ఏ మాత్రం సహించలేదేమో అన్నట్లు నాశనం చేసే పాదపం, వేరే ఏ జీవమూ తనతో సాటిరాలేని గుణాలనునింపుకున్న పాదపం, స్వామి నిత్యసాన్నిధ్యభోగాన్ని నుదురునిండా ప్రారబ్ధంగా పులుముకుని పుట్టిన పాదపం, స్వామిని నిలువెల్లా తేలిక చేసి తూచే బరువైన పాదపం -- ఇప్పటికి గోపికల విరహాబ్ధిని దాటించే నావ.
లక్ష్మీ దేవి కంటే తులసి అంటేనే స్వామికి ఇష్టం కనుక ఆమెను మధురానగరానికి వెళ్లమని అర్థిస్తే, తన స్త్రీస్వభావికమైన జాలిగుండెతో ఆమె అంగీకరించగలదని వారనుకున్నారు.
త్వం చాధిక ప్రియతమా తులసి! శ్రియోఽపి
జానీమ ఏవ కిల బంధుజనస్య తస్య
తస్మాదితి ప్రియకరీ భవతీ సఖీ నో
నూనం త్వయా మధుపురీగమనం విధేయమ్
అంటూ,గోపికలందరూ ఆ తులసిని దూతిని చేసారు. ఒంటరిగా తోడులేకుండా తులసిని దూరం పంపడానికి ఆ మృదుమంజులహృదయ లకు మనసొప్పలేదు. చందనగంధాన్నీ, తమ భక్తినీ తోడుగా యిచ్చి మరీ పంపారట.
యాస్యామి నైవ పరిహాయ
వదేద్ యదీతి
వృందావనం పునరపి
త్వయి తన్న యుక్తమ్
వృందావనం నిగదితం
కవిభిస్తదేవ
యత్రాస్తి తే నివసతిః
భువనేషు వృందే.
అంతే కాదు, తమ సందేశాన్ని కృష్ణుని వద్దకే జాగ్రత్తగా తీసుకుని వెళ్లమనీ, మధ్యలో ఎక్కడా ఎవరికీ చెప్పవద్దనీ, రహస్యంగా చేరవేయమనీ జాగ్రత్తలు చెబుతారు.
ఏతేన త్వం యదిహ మనసా శంకసే కిం మనాంసి
దౌత్యే యుక్తాన్యపి వయమహో ప్రేరయామః స్మ నైవమ్
కిం వాస్మాభిః ప్రహితగమనాన్యాగతానీతి నైవం
చోరే నీతే విరమతి యతః సత్త్యమేతత్ నిరస్తమ్
ఆస్తే భూరి ప్రియతమ పదశ్చిహ్నమేతద్ వనాంతే
దౌత్యేఽస్మాభిః న హి సఖి! వరే కింప్రయుక్తం ప్రయుక్తమ్
ఆశంకేయం న పునరుచితా జ్ఞానవత్యా భవత్యా
వృత్తాంతః కిం రహసి జనితో బంధుజన్యే న గోప్యః.
ఇలా మనోహరమైన లలితలలిత పదబంధాలతో సాగిపోయే మనోహరమైన రచన ఇది అని లభించిన శ్లోకాలవల్ల తెలుస్తోంది. చింతశరణ్ చక్రవర్తి అనే పండితుడు తులసీదూతమనే కావ్యం 1706లో విద్యానాథ భట్టాచార్య అనే కవి చేత వ్రాయబడ్డదనీ, కలకత్తా సంస్కృతసాహిత్యపరిషత్తులో ఒక వ్రాతప్రతి ఉన్నదనీ వ్రాసాడు కానీ, మిగతా పండితులు, సత్యవ్రతశాస్త్రి ప్రభృతులు ఈ తులసీదూత కావ్యం త్రిలోచనుడిదనీ 1730 ప్రాంతంలో వ్రాయబడిందనీ చెప్పారు. విద్యానాథ భట్టాచార్య కావ్యం వేరేదేమో పరిశీలింపవలసి ఉంది. ఈ తులసీ దూతము నేటికీ ముద్రణకు వచ్చినట్లు ఆధారాలు లభింపలేదు. దొరికిన ఈ కాసిని శ్లోకాలే గోపీజన హృదయ సామ్రాజ్య రాజ్యాంగాన్ని ఎదుటపెట్టేంత మనోహరంగా ఉన్నాయి. ఈ శ్లోకాలను ఎత్తి వ్రాసే క్రమంలో కొన్ని పొరపాట్లు దొర్లడం తెలుస్తోంది. అయినా, కావ్యతీర్థ జితేంద్ర విమల్ చౌదరి గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి, వీటిని ఇలా అందించినందుకు.
*
చాలా మనోహరమైన సంగతి!
ReplyDeleteకృతజ్ఞతలు!
Deleteమధురం! మధురాధిపతేరఖిలం మధురం అంటే అర్థం తెలిపేట్లుంది మీ పరిచయం
ReplyDeleteకృతజ్ఞతలు!
Delete