Tuesday, 6 May 2025

శైవశతకరత్నాలు

తెలుగు చాటుసాహిత్యంలోని శైవకవితలు నా మనసుని మహదానందంలో ముంచివేసాయి. శివభక్తి, శరణాగతి వంటి ఉత్తమగుణాలతో పాటు ప్రాకృతసాహిత్యంలో మాత్రమే దొరికే దగ్గరితనం, దేశీయత తెలుగులో శైవసాహిత్యంలో నాకు దొరికింది. 

శివయుగంలోని కవులు మొదట తెలుగు వాళ్లు, తరువాత శైవులేమో అనిపిస్తుంది. వాళ్ల మనసు తెలుగు. భక్తి తెలుగు. శరణాగతి తెలుగు. వ్యక్తీకరణ తెలుగు. వారి దైవమైన శివుడు తెలుగు. అందుకేనేమో వీళ్ల కవితలలోని తీపిని రుచిచూసి ఉత్తరదిగగ్రాన హిమాద్రితుంగశృంగాలలో తిరుగాడే శివుడు సకుటుంబంగా తెలుగు నేలమీదకి వచ్చాడు. వెనుకకి వెళ్లనని ఇక్కడే శాశ్వతంగా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆయన శిరసుమీద ఉండే గంగలోని పరవళ్లు, చంద్రుడిలోని చల్లతనం, నొసలు మీద ఉన్న నిప్పులోని పవిత్రత, డమరులోని శబ్దసౌందర్యం, త్రిశూలంలోని వంపులు, పార్వతిలోని ప్రకృతి, జింకలోని తుళ్లింతలు, యేనుగులోని ఠీవి అన్నీ ఆయనకి శివకవుల తెలుగులో దొరికాయి.

వేటూరి వారు చాటుపద్యమణిమంజరిలో కొన్ని శైవశతకాలలోని పద్యాలని శతకరత్నాలు అన్న శీర్షికన ఉంచారు. వాటిలోని కొన్ని పద్యాలని ఇక్కడ చూపుతున్నాను. 

1

కరులు హరుల్ చమూవరులు గాటపు మేల్నగరుల్ కడాని బం
గరులు సరుల్ తలోదరులు గంధమిలన్మృగనాభిచందనా
గరులు విరుల్ జగాసిరులు గల్గి సుఖింత్రు త్వదీయులౌ నరుల్
చిర విభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!

శివా! యేనుగులు, గుర్రాలు, పరివారజనం, పెద్దపెద్ద పట్టణాలూ, అపరంజి బంగారపు హారాలూ, మోహనాంగులూ, సుగంధాలని వెదజల్లే చందనాగరులూ, పూవులూ, సకల సంపదలూ కలిగి నీ వాళ్లైన వారందరూ సుఖిస్తారు.

శివభక్తులు ముక్తి సుఖంతో పాటుగా లౌకిక సుఖాలనీ పొందుతారని కవ్యుక్తి. ఇక్కడ ముఖ్యమైన మాట 'త్వదీయులు ' అన్నది. అంటే శివుడివాళ్లవడమన్నది. ఇదే కుచేలుడు అనుభవించిన స్థితి. యే మాత్రమూ లౌకిక సుఖానుభవం లేకముందే అతను కృష్ణుడివాడైయాడు. అతనికి అపేక్ష లేకపోయినా, వాటంతటవే సకలభోగాలూ కుచేలుడిని అనుసరించాయి.  

ఈ పద్యం మకుటం చాలా అందమైనది. చిరవిభవా అన్నది మొదటి మాట. ఈ మాటకు అర్థం చిరకాలం సంపద కలవాడని. అందుచేత తనవాళ్లకు భోగభాగ్యాలనీయగల సమర్థుడు. రెండవమాట భవా అని. అంటే పుట్టుక లేదా సంసారం తానైన వాడు. విశ్వవ్యాపకుడు. తరువాత కవి విజితచిత్తభవా అన్నాడు. అంటే మన్మథుడిని జయించినవాడని. తరువాత అభవా, మహాభవా అన్న మాటలకు పుట్టుక లేనివాడనీ, అతిపెద్దపుట్టుక కలవాడనీ అర్థాలు. ఆది లేని లేని వాడై ప్రతిక్షణమూ పుడుతున్న అన్ని పుట్టుకలకీ మూలమైన వాడు

ఈ పాదానికి మధురమైన అన్వయం చెప్పవచ్చు. శివభక్తి మనసులో రాజుకుంటే ఆయనే సకలభోగాలనూ ఇచ్చి, తన విశ్వవ్యాపకమైన నిజస్వరూపాన్ని పరిచయం చేస్తాడు. తరువాత మనసులో జనించే కోరికలని జయింపచేస్తాడు. తరువాత పుట్టుక లేనితనమూ, సర్వం వ్యాపించిన పుట్టుకతనమూ తానే అనే మహాజ్ఞానాన్ని కలుగజేస్తాడు. 

ఇది ధూర్జటి రాసిన శతకంలోని పద్యమని వేటూరి వారు వ్రాసారు. ఈ కృతి మొత్తంగా దొరకనిదై ఉండాలి. ఇందులో ఇలాంటి వజ్రాలు ఇంకెన్ని ఉండి ఉంటాయో.

2

లోకములెల్ల నీతనువులోనివ నీవట యెంతగల్గుదో
నాకపపద్మసంభవజనార్దనులాదిగ నెల్లవారలన్ నీ
కొలఁదింతయంత యననేరక మ్రొక్కఁ దొడంగి రన్న ని
న్నేకరణిన్ నుతింతుఁ బరమేశ్వర! శ్రీగిరిమల్లికార్జునా!

శ్రీశైలశివా! ఈ లోకాలన్నీ నీ శరీరంలోనివే. నీవు ఎంతటివాడవో! ఎప్పటివాడవో! నీవు ఇంతవాడివనీ అంతవాడివనీ అనలేక ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి మొదలైన దేవతలంతా నీకు నమస్కారాలు చేస్తారంటే నేను నిన్నేవిధంగా స్తుతి చేయగలను?!

ఈ పద్యం పండితారాధ్యులు చేసిన శివతత్త్వసారమన్న కృతిలోది. 

3

ధరలో నుద్ధురలోభులన్ ధనముచింతం గాంచి కాసంత వే
సరితిం గేసరి తీవ్రరోగహతి నష్టంబైనరీతిన్ మదు
ద్ధరణం బాదరణంబునన్నిలుపవే తాపత్రయాగ్నిస్ఫుర
ద్గరిమార్చిన్ బరిమార్చి భక్తసులభా గౌరీమనోవల్లభా.

ఈ భూమిమీద ధనం మీదనే తమ ఆలోచనలన్నీ చేసి చివరకి పెద్ద సింహం రోగానపడి దెబ్బతిన్నట్టు తినడం చూసి వేసారాను. అంచేత గౌరీవల్లభా! తాపత్రయాగ్ని కీలలని నాశనం చేసి నన్ను ఉద్ధరించడమనే పనిని మన్నింపుగా నిలుపుకో. 

ఈ పద్యం గౌరీమనోవల్లభ శతకంలోనిది. 

4

సాగిన కోపవహ్ని నిజశాంతిజలంబునఁ జల్లనార్చి యా
శాగిరులన్ నివృత్తికులిశాహతి నుగ్గుగఁ జేసి యత్తమో
నాగవిభున్ వివేకమృగనాయకుచే నణగించి లోన సం
యోగవియోగముల్ విడువ యోగియగున్ వటమూలమందిరా!

వటమూలాన్ని మందిరంగా చేసుకున్న దక్షిణామూర్తీ! మనసులో రేగిన కోపమన్న నిప్పుని తన శాంతిజలాలచేత చల్లార్చి, ఆశా పర్వతాలని ముముక్ష అనే వజ్రాయుధపు దెబ్బతో నుగ్గునుగ్గు చేసి, అజ్ఞానమనే ఏనుగుని వివేకమన్న సింహంతో అణగగొట్టి, అంతరాళములో సంయోగవియోగాలని విడిచినవాడే యోగి అనబడతాడు.

5

వాలిన యింద్రియంపుఁ బెనువాతులకున్ మృదుగానమంద వా
తూల విలాసినీ కుసుమ తోయగుణంబులు వచ్చి చొచ్చినన్ గ్రో
లఁగనీక నెమ్మనము కుత్తుక పట్టి నినుం దలంచి యీఁ
జాలిన గాక మాటలఁ బ్రసాదములే వటమూల మందిరా. 

వటమూలమందిరా! మీద పడిన ఇంద్రియాలనే పెద్దపెద్ద గాలులకి మృదువైన సంగీతాలూ పిల్ల గాలులతో, విలాసినులు, పూవులు, పన్నీరులు వంటివి యెగురుతూ వచ్చి మీదపడితే వాటిని గ్రోలకుండా నా మనసు కుత్తుకని పట్టి, నిన్ను స్మరించి నీకు అర్పించగలగాలి కానీ, మిగిలినవన్నీ కేవలం తీపి మాటలే. 

ఈ రెండు పద్యాలూ 'వటమూలమందిరా' అన్న కవితలోనివి. ఈ కవిత సంస్కృతంలోని దక్షిణామూర్తి స్తోత్రానికి దీటు. వ్యాఖ్యకి సరిపోనన్న చిన్నతనంతో  భావం అందించి విడిచిపెడుతున్నాను.

ఈ వ్యాసంతో చాటుపద్యమణిమంజరిలోని శైవకవిత్వంతో నా ప్రయాణం ముగిసింది. 

8 comments:

  1. మీ శివతాండవ సహాయవల్లి ఏ షాపులో దొరుకుతుందో చెప్పండి 🙏

    ReplyDelete
    Replies
    1. నమస్తే. మీ చిరునామాను నాకు ఈమెయిల్ చెయ్యండి. ఒక కాపీ పంపగలను. ramanath@outlook.in

      Delete
  2. శాంతి ప్రియ దినవహి7 May 2025 at 20:11

    నమస్కారములు

    ReplyDelete
  3. నమస్తే అండి చిరునామా mail చేశానండి
    మీ facebook account లో 3 8 ఇలా ఏంటో numbers పెట్టారు దాని అర్థం ఏంటో తెలుస్కోవచ్చా అండి

    ReplyDelete
    Replies
    1. పరాశ్రీ గారూ, నమస్తే.

      . 3 8 10 10 14 8 16 OOO 444 -- ఈ అంకెల వరుస శ్రీచక్రానికి సంకేతం. గమనించినందుకు ధన్యవాదాలు

      Delete
  4. చాలా సంతోషం!

    ReplyDelete