Thursday, 27 March 2025

మణిపూసలు: 5 - రంగనాథుని శివకవిత

రగడ శివకవుల సొత్తు. ఈ ఛందోరూపం తెలుగునేలపై శివకవుల చేతులలో పడి యెన్ని వయ్యారాలు పోవాలో అన్నీ పోయింది. ఈ ఛందస్సు పద్యకవితలలోని ఆవృత్తి ధర్మాన్నీ, జానపదాలలోని సంగీత ధర్మాన్నీ తనలో కలుపుకున్న అతి తక్కువ ఛందస్సులలో ఒకటి. దేశీయ ఛందస్సులకున్న ఈ లక్షణమే శివకవులని ఆకర్షించిందనుకుంటాను. రగడ, ద్విపద వంటి దేశీయ ఛందస్సులు కాస్త పాటల రూపం వైపు ఒగ్గినా, వీటి నిర్మాణానికి అనన్యసామాన్యమైన ధార కావాలి.

తెలుగులో ఉన్న భారతభాగవతాది రచనలలో ధార అన్నలక్షణానికి కొన్నిచోటులలో తెంపు ఉంటుంది కానీ శైవకావ్యాలని చూసినప్పుడు యెక్కడా ఆగని ఈ ధార మన మనసులని ఆశ్చర్యంతో నింపివేస్తుంది. ఉదాహరణకి, పండితారాధ్య చరిత్ర అన్న గ్రంథం మొదలు నుంచి చివరిదాకా అల్లబడిన ఒకే ఒక అప్రతిహతమైన గంగాప్రవాహం. అన్ని వేల ద్విపద దళాలు ఒక్క చోటులో కూడా తెగకుండా ఒకే ధారతో రచించబడటానికి ఆ కవి మనసు ఇంకెంత గొప్పదై ఉండాలో అన్నది తలుచుకుంటే ఒళ్లు గగుర్పాటుకి లోనౌతుంది.

ముందు వ్యాసంలో చెప్పినట్లు, చక్రపాణి రంగనాథుడు విస్తారమైన శైవవాఙ్మయాన్ని సృజన చేసాడు. అతని కవిత్వంలోని తీపికి యెల్లలు లేవు. దొరికిన రచనలు లేశమాత్రమే అయినా, వాటిలోని లోతూ, బరువూ మన మనసుని తాకి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

రంగనాథుడు వైష్ణవుడిగా పుట్టినవాడు. మనుషులకి సహజమైన పరపక్ష, స్వపక్షాల ద్వంద్వంలో తన చూపుని మలినపరుచుకున్నవాడు. తరువాత ఆ చూపుని పోగొట్టుకున్నవాడు. ఉచ్చనీచలనే చట్రంలో ఇరుక్కొని ఉన్నా, దైవాన్ని నమ్ముకున్న కారణంగా దాని నుంచి బయటపడగలిగాడు.


ఆ విషయాన్నే అతను ఇలా చెప్పుకొన్నాడు -

శ్రీపార్వతీశుఁ జూడక
పాపాత్ముఁడనగుచుఁ బోవఁ బథమునఁ జక్షుల్
దీపించు దృష్టి తొలఁగిన
శ్రీపతినడుగంగఁ గర్త శివుడని చెప్పెన్.

నరసింహస్వామి బోధ జరగడమే రంగనాథుడికి తిరిగివచ్చిన స్వచ్ఛమైన చూపు. ఆ చూపు దొరకగానే అతడు మహాకవిగా పునర్జన్మ యెత్తాడు. ఆ చూపుతో ఆయన యెవరికీ సాధ్యపడని ఒక ఘనమైన అంతర్యుద్ధాన్ని జయించాడు. ఆ గుణపాఠం, ఆ అహంకారసంబంధితమైన వాదపరాజయం, ఆ భౌతిక సంబంధమైన దృష్టిహాని అతనికే తెలియకుండా ఆయుధాలై అతనికి సాయపడ్డాయి. ద్వంద్వబుద్ధి పోయింది. ఒకే శివస్వరూపం అతని ముందు పొరలుకట్టి పరుచుకుంది. దానితో అంతకు ముందు లేని ఒక దివ్యమైన ధార అతని బుద్ధిలో ఊపిరి తీసుకుంది. కవిత్వం పొంగి వచ్చింది.

చూపు తిరిగివచ్చిన దివ్యానుభూతిలో మునిగిన రంగనాథుడు తెలుగు సాహిత్యంలోనే ఒక అమూల్యమైన రగడకి ప్రాణం పోసాడు. దీనికి నయన రగడ అని పేరు. శివభక్తిదీపిక అని నామాంతరం. ఈ రగడలోని వస్తువు ఆతని చూపే. అతను కనుగొన్నటువంటి శ్రీశైలశిఖరంపై వెలసిన దివ్యత్వానికి ఒక రూపాన్ని ఇచ్చిన రచన ఇది. దీనిలోని ధార, మధురిమ, యెరుక లాంటి లక్షణాలు చాలా అరుదుగా దొరికేవి. ఈ రచనలో ప్రతీ పాదంలోనూ నాలుగు పంచమాత్రల గణాలు ఉంటాయి. 'కంటి ' అన్న పదం అంత్యప్రాసలో వస్తుంది. మనకి దొరుకుతున్నంత వరకూ ఈ రగడ చూచాయగా మూడువందలయాభై పంక్తులతో ఉంది.కొన్ని పంక్తులు లుప్తమయ్యాయనడానికి గుర్తుగా ఖాళీలు కనిపిస్తున్నాయి. మొత్తం రచనలో అందమైన పంక్తులని యేరడం కష్టమైనా, ఇబ్బంది పడుతూనే కొన్నిటిని ఇక్కడ చూపుతున్నాను -

శ్రీశైలశివవర్ణన చేసిన పంక్తులు -

శ్రీశైల వల్లభుని శిఖరంబుఁ బొడగంటి
కాశీ పురాధీశు గౌరీశుఁ బొడగంటి
సర్వలోకేశ్వరుని సర్వేశుఁ బొడగంటి
సర్వసంరక్షకుని సర్వంబుఁ బొడగంటి
పరమాత్ము నీశానుఁ బరమేశుఁ బొడగంటి
పరమ యోగీంద్ర హృత్పదనిలయుఁ బొడగంటి
చంద్రార్క శతకోటి సంకాశుఁ బొడగంటి
చంద్రార్క శిఖినేత్రు శంకరునిఁ బొడగంటి
రూపింపఁ బ్రకటస్వరూపంబుఁ బొడగంటి
నాపరంజ్యోతియై యమరుదేవునిఁ గంటి
వేదంబు లీశ్వరుని వినుతింపఁ బొడగంటి
నాదిదేవుఁడు రుద్రుఁడని శ్రుతులఁ బొడగంటి

(శ్రీశైల శిఖరాన్ని చూసాను. కాశీపురాధీశుడైన గౌరీపతిని చూసాను. పరమాత్ముడైన, యోగుల హృదయాలలో నివాసముండే, కొన్నికోట్ల సూర్యచంద్రులకాంతితో సమానమైన, పరంజ్యోతియైన ఆ అమరదేవుడిని చూసాను. వేదాలు పొగడేది ఆ ఈశ్వరుడినే అని చూసాను. ఆదిదేవుడు రుద్రుడని వేదాలు చెప్పడం చూసాను.)
భక్తి మహిమని మనోహరంగా వర్ణిస్తున్నాడు -

భక్తు లప్రతిహత ప్రధితమతులని కంటి
భక్తులకుఁ బ్రత్యర్థి పరులు లేరని కంటి
భక్తులకు నెందు నాపదలు లేవని కంటి
భక్తులాపదలచేఁ బట్టువడరని కంటి
భక్తు లహి కేయూర పదబద్ధులని కంటి
భక్తులతి నిర్వాణ పదసిద్ధులని కంటి
భక్తులు జగత్ప్రాణ పదలోలు రని కంటి
భక్తులు సదానంద పదశీలురని కంటి
భక్తు లేపదవులును బడయ నొల్లమిఁ గంటి
భక్తులకు నేరుచుల్‌ భక్తిఁ బోలమిఁ గంటి
భక్తులద్భుత కర్మ పారీణులని కంటి
భక్తులద్భుత పుణ్య ఫలభాగులని కంటి
భక్తుల కుమాభర్త ప్రాణంబులని కంటి
భక్తులుద్భట దోషభవ ముక్తులని కంటి

(భక్తులు అడ్డులేని గొప్ప బుద్దికలవారని చూసాను (తెలుసుకున్నాను). భక్తులకి తనవారు, ప్రత్యర్థులు లేరనీ, భక్తులకి ఆపదలు లేవని, భక్తులు ముక్తిసుఖాన్ని అనుభవించేవారనీ, భక్తులు సదానందులనీ, భక్తులు పదవులమీద అనాసక్తులనీ, భక్తులు కర్మపారీణులనీ, భక్తులు గొప్ప పుణ్యఫలాన్ని కలిగినవారనీ, భక్తులకు ఉమాభర్త పంచప్రాణాలనీ, భక్తులు దోషాలనుండి విముక్తులనీ చూసాను)

శివరూపవర్ణన ఇది-

సోమ ఖండాఖండ జూటంబుఁ బొడగంటి
భరిత నయనాభీల భాలంబుఁ బొడగంటి
సురచిర స్ఫుటజైత్ర శూలంబుఁ బొడగంటి
క్రతుహరుని శుద్ధ కంకాళంబుఁ బొడగంటి
జిత గజాజిన మహాచేలంబుఁ బొడగంటి
గురుమౌళి సురసరిత్కూలంబుఁ బొడగంటి
గిరిసుతా తనుభాగకీలంబుఁ బొడగంటి
నతిసుందరాకార మాది వృషభునిఁ గంటి
హరినేత్ర పూజితుని నాదిమూలముఁ గంటిఁ

(నెలరాజు తునకతో ఉన్న అఖండమైన జటాజూటాన్ని చూసాను. భయంకరమైన అగ్నితో ఉన్న నొసలునీ, మనోజ్ఞమైన త్రిశూలాన్నీ, కంకాళాలనీ, యేనుగుతోలునీ, గంగానదినీ, పార్వతీ దేవి ఉన్న వామభాగాన్నీ, సుందరుడైన నందినీ, విబూది పూసిన శరీరభాగాలనీ చూసాను. రాముడి నేత్రంతో పూజనందుకున్న ఆదిమూలాన్ని చూసాను)

ఈ క్రిందిదళాలు ఈ రగడకే మకుటాయమానమైనవి. అతనిలోని స్వయంపరిశోధనని చెబుతున్నాడు -

బరికింప నాలోని పాపంబు కడగంటి
నరసి పాపము నన్ను నంటరాదని కంటి
బహుపాపధరుఁ డేల భక్తుఁడౌనని కంటి
బహుపాపములు నన్నుఁ బట్టి విడుచుటఁ గంటి
నయముగా నయనములు నాకీయఁ బొడగంటి
భయభక్తులీ భర్గు పాదములు పొడగంటి
నిది పుణ్యమని కంటి నిది గణ్యమని కంటి
నిది యోగమని కంటి నిది భోగమని కంటి
నిది ధర్మమని కంటి నిది మర్మమని కంటి
నిది నిత్యమని కంటి నిది సత్యమని కంటి
నిది పుణ్యములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది గణ్యములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది యోగములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది భోగములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది ధర్మములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది మర్మములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది నిత్యములకెల్ల నెక్కుడని పొడగంటి
నిది సత్యములకెల్ల నెక్కుడని పొడగంటిఁ

(ఆత్మవిమర్శ చేయగా నాలోని పాపాన్ని చూసాను.ఆలోచించి నన్ను పాపం అంటకూడదన్నది చూసాను. పాపాలని ధరించేవాడు భక్తుడు కాడన్నది చూసాను. నన్ను బహుపాపాలు పట్టుకుని విడవడమూ చూసాను. ఈ భయభక్తులు మృదువుగా నాకు నయనాలనివ్వడం చూసాను. నా ధనమైన భర్గుడి పాదాలని చూసాను. ఇదే పుణ్యమనీ, ఇదే గణ్యమనీ, ఇదే యోగమనీ, భోగమనీ; ఇదే ధర్మమనీ, మర్మమనీ; ఇదే నిత్యమనీ సత్యమనీ చూసాను. ఇది పుణ్యాలలోకెల్లా గొప్పదని చూసాను. ఇదే గణ్యాలలోకెల్లా గొప్పదనీ, ఇదే యోగాలలోకెల్లా గొప్పదనీ, భోగాలలోకెల్లా గొప్పభోగమనీ, ధర్మాలలోకెల్లా గొప్పధర్మమనీ, మర్మాలలోనూ గొప్పమర్మమనీ, నిత్యవస్తువులలోకెల్లా నిత్యమైనదనీ, సత్యములన్నిటిలోనూ మహాసత్యమనీ చూసాను).

తనకి ద్యోతకమైన తాను చేయాల్సిన పనిని ఇలా చెబుతున్నాడు -

శంకరుని కృప వడయ సమయమిది యని కంటి
నిఁకను నాయెత్తు కృతులిత్తునని పొడగంటి
నిఁకఁ గృతుల్‌ చెప్ప నా కేమిభయమని కంటి
వడిఁ గృతుల్‌ నాయెత్తు వచ్చునని పొడగంటి
మృడుఁడింక నాకృతుల్‌ మెచ్చునని పొడగంటిఁ

(శివుని కృపపొందడానికి ఇదే సమయమని చూసాను. ఇక నాయెత్తు కృతులని రచిస్తానన్నది చూసాను. రచనలు చేయడానికి నాకేమిటి భయమన్నది చూసాను. నా రచనలన్నీ నా అంత యెత్తు వస్తాయన్నది చూసాను. మృడుడు నా రచనలు మెచ్చుకుంటాడన్నది చూసాను)

రంగనాథుడు అన్నట్లుగానే తనంత యెత్తు రచనలు శివునిపై చేసి తన జన్మకి సార్థకత యేర్పరుచుకున్నాడు. ఈ మహాశివకవి సరస్వతిని మొత్తంగా చూడలేకపోవడం మన దురదృష్టమే.

ఆసక్తిపరుల కోసం వేటూరి ప్రభాకరశాస్త్రి గారు చక్రపాణిరంగనాథుడిపై వ్రాసిన వ్యాసాన్ని ఇక్కడ ఉంచుతున్నాను. ఆసక్తి పరులు ఈ ఫైలును దింపుకోవచ్చు. నిన్న, ఇవ్వాళ మనం చదువుకున్న రగడల పూర్తి లభ్యపాఠాలు ఇందులో ఉన్నాయి:

2 comments:

  1. చాలా బావుంది. ధన్యవాదాలు!

    ReplyDelete
  2. చదువరి13 April 2025 at 03:49

    చక్కగా వ్రాసారు.

    ReplyDelete