తెలుగుదేశంలో శివకవియుగం భక్తితో ప్రజల జీవనాన్ని సుసంపన్నం చేయడంతో పాటుగా తెలుగుభాషకూ ఎనలేని సేవ చేసింది. ఆ యుగంలో కవిత్రయం పాలుకురికి సోమనాథుడు, పండితారాధ్యులు, నన్నెచోడుడు తెలుగు దేశీయతకి ఒక కొత్త వేదికని నిర్మాణం కావించారు. ఈ యుగంలోనే తెలుగునేలమీద ఉదయించిన ఒక విలక్షణ కవి రంగనాథుడు.
ఈ కవి గురించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాటుపద్యమణిమంజరిలో పరిచయం చేసారు. అక్కడి ఉటంకింపులని బట్టి మణిమంజరి రచనాకాలానికి ఈ రంగనాథుడిమీద పండితులలో వాదోపవాదాలు జరుగుతున్నట్లు ఊహించవలసి వస్తోంది. వాటిలో కాక కవిత్వంలో లగ్నమానసుడ్ని కావడం చేతా, రంగనాథుడి శివకవిత్వం చదివి ఒళ్లు పులకరించిన వాడ్నవడం చేతా, ఆ కవి గురించి మీతో పంచుకుంటున్నాను.
కన్నడిగుడైన తొంటెదార్య కవి వ్రాసిన పాల్కురికి సోమేశ్వరపురాణంలో రంగనాథుడి కథ వర్ణించబడి ఉంది. చక్రపాణి రంగనాథుడు మొదట వైష్ణవుడు. ఇతడితో శైవుడైన పాల్కురికి సోమనాథుడికి తగువు వచ్చింది. అయితే వాదంలో తండ్రిని వద్దని, సోమనాథుడి కొడుకు చతుర్ముఖ బసవేశ్వరుడు వాదానికి దిగాడు. ఆ వాదంలో రంగనాథుడు ఓడిపోయాడు. పరాజయంతో దుఃఖపడి రంగనాథుడు శ్రీశైల మార్గంలో వెడుతూ కూడా శివద్వేషంతో మల్లికార్జునుడి దర్శనం చేసుకోక ముందుకు వెళ్లాడు. దాని ఫలితంగా రంగనాథుడికి చూపు పోయింది. ఆ బాధతో అహోబిలానికి వెళ్లి నరసింహస్వామిని ప్రార్థించాడు. నరసింహస్వామి దయతోనే రంగనాథుడికి స్వప్నంలో శివుడి ఆధిక్యత బోధపడింది. అంతే, అక్కడే, ఒక మహాకవి పురుడు పోసుకున్నాడు.
తరువాత రంగనాథుడు పరమశివుడు వెలసిన ఆ మార్గంలో, ఆ నల్లమల అడవులనూ, పర్వతాలనూ , లోయలనూ, నదీనదాలనూ స్పృశిస్తూ తన స్వామిని అన్వేషిస్తూ శ్రీశైలాన్ని చేరుకున్నాడు. శివుడిని ప్రస్తుతించాడు. దానితో ఒక కంటి చూపు తిరిగివచ్చింది. తరువాత పాల్కురికి సోమనాథుడి దగ్గరికి వచ్చి తన అపచారాన్ని మన్నించాలని వేడుకొన్నాడు. రెండవ కంటిచూపూ తిరిగివచ్చింది. తరువాత రంగనాథుడు సోమనాథుడి శిష్యుడై చతుర్ముఖ బసవేశ్వరుడి చేత శివదీక్షని తీసుకున్నాడు. రంగనాథుడి జీవితం శివుడి తోనూ, కవిత్వంతోనూ నిండిపోయింది. ఈతని భక్తికి శివుడి మనసు పులకరించింది. కవితకి భాషాదేవి మేను జలదరించింది.
రంగనాథుడు శివసాహిత్యంలోనే యెవరూ చేయని పనిని సౌందర్యవంతంగా చేసాడు. అది పంచాక్షరీ మంత్రమహిమని ఒక రగడలో వర్ణించడం. పూర్తిగా నూటయెనిమిది పాదాలతో ఉన్న ఈ నమశ్శివాయరగడ లో ప్రతీ పాదమూ నాలుగు షణ్మాత్ర గణములతో ఉంటుంది.
తెలుగునీ, సంస్కృతాన్నీ సమపాళ్లలో కలిపిన ఒక అందమైన కృతి ఇది. నమశ్శివాయ రగడలో ప్రతీ పాదమూ 'నమశ్శివాయ' అన్న పదంతో ముగుస్తుంది. ఇది షణ్మాత్రల కూర్పు కావడం చేత 'నమశ్శివాయ ' అన్న పదంలో 'న ' అన్న అక్షరం ముందు గణంలో చేరి, 'మశ్శివాయ ' అన్న పదం చివరి గణంలో పడటం వల్ల, నమః, శివాయ అన్న సంధి అందంగా విడివడి, తెలియకుండానే చదివేటప్పుడు 'నమశ్శివాయ' ని పైకి ఎత్తి చదువుతాం. ఆ కవి ఆరాటమల్లా మనతో ఆ నామాన్ని ఎత్తి అనిపించాలనేనేమో అని అనిపిస్తుంది.
ఈ రగడలోని కొన్ని పంక్తులు ఇక్కడ చూపిస్తున్నాను -
ప్రకటధీర భావభర తపశ్చయము నమశ్శివాయ
భూతనాథచరణకమల పూజనము నమశ్శివాయ
ప్రాతతప్రశస్తవస్తుభాజనము నమశ్శివాయ
శోషణాది శుద్ధికరణ శోధితము నమశ్శివాయ
పోషితాగమప్రమేయ బోధితము నమశ్శివాయ
ప్రసవశరవికార భావభంజనము నమశ్శివాయ
రసికలోక రాజలోక రంజనము నమశ్శివాయ
..... ...
పారిజాతఫలసమృద్ధిఁ బండెడిది నమశ్శివాయ
దురితవితతిఁ దూరుపాఱఁ దోలెడిది నమశ్శివాయ
వరములోని నిచ్చుచోట వ్రాలెడిది నమశ్శివాయ
మునులు ఘనులు మించి తలఁచి మ్రొక్కెడిది నమశ్శివాయ
ఓటలేక పుణ్యపథములూరెడిది నమశ్శివాయ
మేటి సుకృతకోటినెల్ల మీఱెడిది నమశ్శివాయ
...
యోగమీ నమశ్శివాయ యోగ్యమీ నమశ్శివాయ
భోగమీ నమశ్శివాయ భోగ్యమీ నమశ్శివాయ
సరసమీ నమశ్శివాయ సత్యమీ నమశ్శివాయ
పరమమీ నమశ్శివాయ బ్రహ్మమీ నమశ్శివాయ
రంగనాథుడు ఐదువందల సీసపద్యాలతో శ్రీగిరినాథవిక్రమం, వేయి పాదాలతో దండకం, ఎనిమిది వేల పద్యాలతో ఒక గ్రంథం, ఒక తారావళి, ఒక శతకం,నాలుగు లయగ్రాహులు, ఏడు రగడలు, వేయి దోదక వృత్తాలు, వంద తోటక వృత్తాలు, మూడు వేల మత్తకోకిలలు, ఆరువందల గీతాలు, యెనిమిది మంజరులు, వీరభద్రవిజయం , శరభలీల అనే కావ్యాలు, ముప్పై ఆరు గద్యాలు, ముప్ఫై ఆరు ఉభయశతకాలు చెప్పాడని కన్నడ కవి సిద్ధనంజేశుడు తన గురురాజచరిత్రలో చెప్పాడు. రంగనాథుడు తన శ్రీగిరినాథ విక్రమమన్న గ్రంథాన్ని సంస్కృతంలోకీ అనువాదం చేసాడట. ఇవి మనకి అందుబాటులో లేవు.
దొరుకుతున్న కవితలలో కొన్నిటిని ఇక్కడ ఉటంకిస్తున్నాను.
1
చెలువార గజాజినచేలముతో
గళనీలిమతో నహికంకణుడై
తలఁజంద్రకళం గల దైవము మా
కులదైవము దైవతకోటులలోన్.
అందంగా ఏనుగు చర్మంతోటి, కంఠం మీద నలుపుతోటి, పాములని కంకణాలుగా ధరించి, శిరసుమీద చంద్రకళని ఉంచుకున్న దైవము కోట్లాది దేవతలలో మా కులదైవము.
2
ఉపవాసములెల్లను నుండుట నీ
కృప వచ్చుటకా యది రిత్త సుమీ
యపవిత్రునిఁ బుల్లని యంబలికై
సుపవిత్రునిఁ జేయుట సుద్ది గదే.
శివా, ఉపవాసాదికం చేయడం నీ కృపకోసం అనడం వొట్టిమాట. అపవిత్రుడిని పుల్లని గంజికోసం సుపవిత్రుడిని చేయడం వృత్తాంతమే కదా.
3
అదలని తేరు తేరికిని నాదరువై తగు విల్లు వింటికిం
గుదురగు నారి నారిపయిఁ గూన్కుశరంబు శరంబు బొడ్డునం
బొదలిన యంత యంతముఖముల్ నిజవాసములైన గుఱ్ఱముల్
చెదరక నీకునెట్టిపని సేయునయా గిరిజాధినాయకా.
'ఊఁ' అంటే ముందుకు కదలని రథం (భూమి), ఆ రథాన్నే ఆధారం చేసుకుని ఉన్న విల్లు (మేరుపర్వతం), ఆ వింటికి కుదురైన నారి (ఆది శేషుడు), ఆ నారిమీద శయనించే వాడు బాణం(విష్ణుమూర్తి), ఆ బాణానికి నాభిలో జనించినవాడు సారథి (బ్రహ్మ), ఆ సారథి ముఖాలు గుర్రాలు (వేదాలు) - ఓ గిరిజానాథా! అటువంటి వాటిని త్రిపురాలని చంపడానికి దగ్గర పెట్టుకున్నావే, అవి నేకేంపని చేసిపెడతాయి? (చేసి పెట్టాయంటే అది నీ మహత్త్వమే కానీ వాటి గొప్ప కాదు అని ధ్వని)
4
ఓజు చేముట్టక యొగ్గానఁ బట్టక చక్కగా దివిఁ బాఱు చక్రములును
లాయానఁ గట్టక లలి మేఁత వెట్టక వర్ణహీనంబైన వారువములు
తపనవెట్టక జీవితము కాసు ముట్టక సత్త్వసంపదఁ జూపు సారథియును
కడచీలఁ దట్టక ఘనముగా మెట్టక గంభీరసంపదఁ గలుగునిరుసు
గలిగి తనరారునరదంబుఁ గడఁక నెక్కి
త్రిపురవిజయంబుఁ జేకొన్న దేవదేవుఁ
డిందుశేఖరుఁ డానందమందిరుండు
మనలఁ గరుణావిధేయుడై మనఁచు గాత.
యే శిల్పో తయారు చేయని, ఒగ్గంలో పట్టని, చక్కగా ఆకాశంలో పరిగెత్తే చక్రాలు; గుర్రపుశాలలో కట్టకపోవడం చేత, ప్రేమగా మేత పెట్టకపోవడం వల్ల వివర్ణాలైన గుర్రాలు; యే మాత్రం ఆసక్తి లేకుండా, జీవితంలో ఒక్క కాసు కూడా ఆశించకుండా సత్త్వసంపద చూపే సారథి; ఇనుపశీలలో పట్టకుండా, అసలు నడవకుండా గంభీరమైన సంపద కలిగిన ఇరుసు - వీటితో కలిసి ఉన్న ఒకానొక రథాన్ని యెక్కి, త్రిపురాలనిగెలిచిన ఇందుశేఖరుడైన దేవదేవుడు మనలని కరుణతో రక్షించుగాక.
( 'మనల కరుణావిధేయుడై మనచుగాత' అన్న మకుటంతో మణిమంజరిలోనే శివస్తుతిచాటువులు కనపడుతున్నాయి. వాటిలో ముత్యంలాంటి ఒక పద్యాన్ని నేను ఇదివరకు పరిచయం చేసాను. అవన్నీ చక్రపాణి రంగనాథుడి కృతులేనా అన్నది ఆలోచించాల్సి ఉంది)
చక్కగా వ్రాసారు.
ReplyDelete