"తునాతున్క లగుచున్న 'కడిద'ము అను నల్లని రంగుపూత గల కాగితముపై పిండిబలపముతో వ్రాయబడియున్న యీ పద్యము లొక ప్రాచీన శతకములోనివి" అన్న గగుర్పాటు కలిగించే వాక్యంతో భారతి పత్రిక 1930 వ సంవత్సరం మార్చి సంచికలో "వటమూలమందిరా!" అన్న శీర్షికతో ఈ ఐదు పద్యాలు అచ్చయ్యాయి.
చూపులు రెండు ముక్కుతుదఁ జొన్పియు జూచిన చూపు వెంటనే
లోపలఁ జూచి చండకరులో శశిఁ గూర్చి చతుర్దళంబుపై
దీపము వెట్టి దాని తుది తేజము తానయి విశ్వమంతయున్
వ్యాపకుఁడైన పుణ్యుఁడు మహాత్ముఁడగున్ వటమూలమందిరా!
కన్నులుమూసి నాదుమదిగన్ను (?) త్రికోణమునందు జొన్పి, లో
సన్నపు దిండిఁ దూర్చి, జలజంబుల నిచ్చెన యెక్కి మింటిపై
వెన్నెల రాజుఁ జేరి సుఖవేళలయందును నీవు నేనయై
యున్ననుగాని నాహృదయ మబ్బదయా వటమూలమందిరా!
గట్టిగ వేధలార్గురిని ఖండలు సేయక యేడు చింతలన్
గొట్టక మూడ్గురిండ్లు చెడగూల్పక (......) మబ్బునా భువిన్
బొట్టును బోనమున్ (......) పోకులు బూడిద పూఁతలూరకే
పెట్టునుగాని నీదుదయ పేర్పడునా వటమూలమందిరా!
వాలిన యింద్రియాలయ కవాటములన్నియు మూసి నెమ్మదిన్
దాళము వెట్టి లోవెలుగు తత్త్వముఁ గన్గొని తట్టి సుందరిన్
లాలిత నాగకన్య నుపలాలన చేసినవాఁడె యోగియౌ
మాలిన వేషముల్ జముని మార్కొనునే వటమూలమందిరా!
సాగిన కోపవహ్ని నిజశాంతజలంబులఁ జల్లనార్చి యా
శాగిరులన్ నివృత్తి కులిశాహతి నుగ్గుగఁ జేసి యత్తమో
నాగవిభున్ వివేకమృగనాయకుచే నణఁగించి లోన సం
యోగ వియోగముల్ విడువ యోగియగున్ వటమూలమందిరా!
కడిద(ము) అనే ఒక విధమైన కాగితం తెలుగునాట వాడుకగా ఉండేదనీ, అది నలుపురంగులో ఉండేదనీ, దానిపై పిండి బలపంతో వ్రాసేవారనీ, తెలుగునేలమీద అది ఒక లేఖకసాధనాలలో ఒకటి అని తెలియగానే ఎంత సంబరంగా అనిపిస్తుందో, మనసుకు నచ్చిన పద్యాలను కడిదలపై ఎప్పుడైనా చెరిగిపోతాయేమో అనే చింత లేకుండా చదువుకోవడానికి కరమారా వ్రాసుకున్న ఆ కవితాభిమాని అంతస్సౌందర్యం, ఈ పద్యాలను కొన్ని పదాలు పోయినా వీలైనంతమేర ఎత్తి వ్రాసుకుని ఇలా ప్రచురించి తెలుగువాళ్లందరికీ కానుక చేసిన ఈ అజ్ఞాత సంకలనకర్త అంతస్సౌందర్యం చూసినపుడు అంతే సంబరంగా అనిపిస్తుంది.
శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు తమ ప్రాచీనాంధ్రకవులు అనే వ్యాసంలో ఈ కవితను ప్రస్తావిస్తూ ఈ కవిపేరు వటమూలుడనీ, "వటమూలమందిరా!" అనే మకుటంతో ఒక శతకం వ్రాసాడనీ, తనను తానే సంబోధించుకుంటూ తన పేరును మకుటంలో ఉంచి శతకం వ్రాయడమనే సంప్రదాయానికి ఇతడే ఆద్యుడనీ, క్రీ.శ. 1580 ప్రాంతంలో వెలసిన తురగా రామన, అయ్యంకి బాలసరస్వతి అనే జంటకవులు తమ నాగరఖండంలోని కవిస్తుతిలో ఈ కవిని ప్రస్తుతించడం చేత ఆ కాలానికి ముందువాడనీ వ్రాసారు. ఈకవిని వేమన తన గురువుగా పేర్కొన్న సంగతిని వారక్కడ ప్రస్తావించలేదు. పండిత శ్రీ వంగూరి సుబ్బారావుగారు ఈ కవి గురించి వ్రాస్తూ, "సాగిన కోపవహ్ని" అన్న పద్యాన్ని మాత్రం ఉదాహరించి, ఈయన వేమన గురువులలో ఒకడు కనుక క్రీ.శ 1450 వ ప్రాంతము వాడని అన్నారు. చాగంటి శేషయ్యగారు ఈ కవి గురించి వ్రాసారు కానీ ఈ వివరాలే తప్ప అన్యవిశేషాలు ఏవీ వ్రాయలేదు.
వేమన తల్చుకున్న తన గురువులు వీరు:
భవదూరుడు శరభాంకుడు
శివశీలుడు వేయుగోటి సిద్ధేశ్వరుడున్
శివభృత్యుడు వటమూలుడు
శివమయచిన్మయుడు సోమశేఖరగురుడున్.
వీరందరూ శివకవులు. ఎన్నో యోగరహస్యాలు వేమన పద్యాలలోనూ కనిపిస్తాయి. "శివకవులకు నవకవులకు" అనే మరొక పద్యాన్ని కూడా వేమన చెప్పాడట. వీరిలో శివకవియుగంలోని కవులు పూర్వకవులుగానూ, ఎర్రన యుగంలోని శివకవులు నవకవులుగానూ పరిగణించాలని కొర్లపాటి శ్రీరామమూర్తి గారు సూచించారు. పై వారిలో మొదటివాడు భాస్కరభవదూరుడు. ఈయన కృతులు ఇప్పుడు అలభ్యం. శరభాంకుడు "శరభాంకలింగమా!" అన్న మకుటంతో చక్కని వివేకభక్తితో శతకాన్ని చెప్పాడు. ఇతడు కాకతీయ ప్రతాపరుద్రచక్రవర్తి కాలం నాటివాడు. శివశీలుడు, శివభృత్యుడు, శివమయ చిన్మయుడు అన్న కవుల వివరాలు అందుబాటులో లేవు. సోమశేఖరునిపై భిన్నాభిప్రాయాలున్నాయి. పోతన తన వీరభద్రవిజయములో తల్చుకున్న సోమశేఖరుడే ఇతడని కొందరు. పిడుపర్తి సోమనాథకవి పాలుకురికి సోమనాథుడిని సోమశేఖరుడని అన్నాడు కాబట్టి సోమనాథుడే సోమశేఖరగురుడని మరికొందరు.
వేమన తల్చుకున్న తన గురువులు వీరు:
భవదూరుడు శరభాంకుడు
శివశీలుడు వేయుగోటి సిద్ధేశ్వరుడున్
శివభృత్యుడు వటమూలుడు
శివమయచిన్మయుడు సోమశేఖరగురుడున్.
వీరందరూ శివకవులు. ఎన్నో యోగరహస్యాలు వేమన పద్యాలలోనూ కనిపిస్తాయి. "శివకవులకు నవకవులకు" అనే మరొక పద్యాన్ని కూడా వేమన చెప్పాడట. వీరిలో శివకవియుగంలోని కవులు పూర్వకవులుగానూ, ఎర్రన యుగంలోని శివకవులు నవకవులుగానూ పరిగణించాలని కొర్లపాటి శ్రీరామమూర్తి గారు సూచించారు. పై వారిలో మొదటివాడు భాస్కరభవదూరుడు. ఈయన కృతులు ఇప్పుడు అలభ్యం. శరభాంకుడు "శరభాంకలింగమా!" అన్న మకుటంతో చక్కని వివేకభక్తితో శతకాన్ని చెప్పాడు. ఇతడు కాకతీయ ప్రతాపరుద్రచక్రవర్తి కాలం నాటివాడు. శివశీలుడు, శివభృత్యుడు, శివమయ చిన్మయుడు అన్న కవుల వివరాలు అందుబాటులో లేవు. సోమశేఖరునిపై భిన్నాభిప్రాయాలున్నాయి. పోతన తన వీరభద్రవిజయములో తల్చుకున్న సోమశేఖరుడే ఇతడని కొందరు. పిడుపర్తి సోమనాథకవి పాలుకురికి సోమనాథుడిని సోమశేఖరుడని అన్నాడు కాబట్టి సోమనాథుడే సోమశేఖరగురుడని మరికొందరు.
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు లభ్యాలుగా ఉన్న వటమూలుడి పద్యాలలో ఖాళీలను పూరించి, మరొక పద్యంతో కలిపి మొత్తం ఆరు పద్యాలను చాటుపద్య మణిమంజరి లో వటమూలమందిరా! అన్న శీర్షిక కింద ప్రకటించారు.
చూపులు రెండు ముక్కుతుదఁ జొన్పియు జూచిన చూపు వెంటనే
లోపలఁ జూచి చండకరులో శశిఁ గూర్చి చతుర్దళంబుపై
దీపము వెట్టి దాని తుది తేజము దానయి విశ్వమంతయున్
వ్యాపకుఁడైన పుణ్యుఁడు మహాత్ముఁడగున్ వటమూలమందిరా!
కన్నులుమూసి నాదుమది కన్ను త్రికోణమునందు జొన్పి, లో
సన్నపు దిడ్డి దూర్చి, జలజంబుల నిచ్చెన యెక్కి మింటిపై
వెన్నెల రాజుఁ జేరి సుఖవేళలయందును నీవు నేనయై
యున్ననుగాని నాహృదయ మబ్బదయా వటమూలమందిరా!
గట్టిగ వేధలార్గురిని ఖండన సేయక యేడు చింతలన్
గొట్టక మూడ్గురిండ్లు చెడగూల్పక (నీ పద) మబ్బునా భువిన్
బొట్టును బోనమున్ (దపము) పోకులు బూడిద పూఁతలూరకే
పెట్టునుగాని నీదుదయఁ బేర్పడునా వటమూలమందిరా!
వాలిన యింద్రియాలయ కవాటములన్నియు మూసి నెమ్మదిన్
దాళము వెట్టి లోవెలుగు తత్త్వముఁ గన్గొని తట్టి సుందరిన్
లాలిత నాగకన్య నుపలాలన చేసినవాఁడె యోగియౌ
మాలిన వేషముల్ జముని మార్కొనునే వటమూలమందిరా!
సాగిన కోపవహ్ని నిజశాంతజలంబులఁ జల్లనార్చి యా
శాగిరులన్ నివృత్తి కులిశాహతి నుగ్గుగఁ జేసి యత్తమో
నాగవిభున్ వివేకమృగనాయకుచే నణఁగించి లోన సం
యోగ వియోగముల్ విడువ యోగియగున్ వటమూలమందిరా!
వాలిన యింద్రియంపుఁ బెనువాతులకున్ మృదుగానమంద వా
తూల విలాసినీ కుసుమతోయగుణంబులు వచ్చి చొచ్చినన్
గ్రోలఁగనీక నెమ్మనము కుత్తుకవట్టి నినుందలంచి యీఁ
జాలినఁగాక మాటలఁబ్రసాదములే వటమూలమందిరా!
ఈ కవి ఎంతటి ఆత్మసాధన చేసాడో, లభించిన ఈ పద్యాలలోని ప్రతీ పదమూ చెబుతోంది. యౌగికసాధనా పద్ధతులనూ, కవితాత్మకతనూ నిలువెల్లా నింపుకున్న కవిగురువు వటమూలుడు. ఇళా, పింగళా నాడులలోని చంద్ర సూర్య తత్త్వాలకు వంతెన వేయాలనే విషయాన్ని "చండకరులో శశి గూర్చి" అని వర్ణించాడు. మూలాధార చక్రాన్ని చతుర్దళపద్మంగా చూపించాడు. దానిపై దీపం పెట్టాలట! అక్కడి కుండలినీ శక్తిని జాగృతపరచడానికి ఇంతకన్నా గొప్ప ప్రతీకను ఎవరు చూపగలరు? సహస్రార స్థానంలోకి ఎగబాకిన దాని తుదితేజాన్ని ఎవరు వర్ణించగలరు? ఆ యోగభూమిక గురించి మాట్లాడవలెనన్నా ఇటువంటి ఒక శివగురువే మాట్లాడాలి.
ప్రతీ పద్యం నిండా ఇటువంటి గులాబీరేకులలాంటి పదబంధాలే. సుషుమ్నను సన్నపు దిడ్డి అనీ, షట్చక్రాలను జలజంబుల నిచ్చెన అనీ, సహస్రారంలో ఉండే చిద్గగన చంద్రమండలాన్ని మింటిపై వెన్నెలరాజు అనీ కుండలినిని లాలితనాగకన్య అనీ, సుందరి అనీ ప్రేమగా, తీయగా తెలుగులోకి యోగసౌందర్యాన్ని దింపిన మహనీయుడు వటమూలుడు. ఈ పద్యాలు గొంతెత్తి ఏ సభలోనో చదువవలసినవి కావు. ఏ నదీ తీరాన్నో, పర్వతసానువుమీదో, గోశాలలోనో, దేవాలయపు మెట్లమీదో, చిన్నపిల్లల తరగతి గదిలోనో ఒక పక్కన కూర్చుని, చదువుకుని కళ్లు మూసుకోవలసిన పద్యాలివి. హృదయంలో దాచుకొని, సాధన చేయవలసిన పాఠాలు.
వటమూలమందిరుడు దక్షిణామూర్తి. ఈ పద్యాలు ఒక తెలుగు సౌందర్యలహరి. ఒక తెలుగు దక్షిణామూర్తి స్తోత్రం.
ఈ శతకం మొత్తం దొరికి ఉంటే, ఇంకెంత బావుండేదో అన్న ఆలోచన కొంత బాధపెడుతున్నా, ఈ ఆరుపద్యాలలో కుదురుకున్న నా మనస్సు పొందిన శాంతి ఈ శివగురువు యెడ నన్ను ఋణగ్రస్తుడిని చేసింది.
🙏
ReplyDeleteకృతజ్ఞతలు. 🙏
Deleteఈ పద్యాల గురించి, ఈ కవి గురించి వినడం ఇదే మొదటిసారి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ReplyDeleteకృతజ్ఞతలు.
Deleteవిజ్ఞాన కళిక!
ReplyDeleteకృతజ్ఞతలు, సర్.
Delete