Saturday, 22 March 2025

గురుమూర్తిర్గుణనిధిః

    


2020 వ సంవత్సరంలో నేను మిడిమిడి జ్ఞానంతో సంస్కృతశ్లోకాలకు వ్యాఖ్య వ్రాస్తూ ఫేస్ బుక్ లో ప్రచురిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఒకరోజు అనుకోకుండా నాకు ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ఒక మందారపు మొక్క కుండీ ఛాయాచిత్రం. రెండు విచ్చిన పన్నీరుపూవు రంగు మందారపూవులు, పక్కనే జీవాన్ని నింపుకుని ఉబ్బి ఉన్న మందారమొగ్గఒకటి, భగవంతుని అరచేతులలాంటి పచ్చని ఆకులు. బ్రతుకుకాంతిని ఒకలబోస్తున్న ఆ కుండీ బొమ్మను చూస్తూ దానితో పాటు ఉన్న మహార్ఘమైన శ్లోకాన్ని కాసేపు చూడనేలేదు -

అమరీశ్లోక వ్యాఖ్యాతః!
రామనాథమహోదయ!
మహాదేవమణేశ్శ్లాఘా
పుష్పమాలేవ వః కృతా.

అని.

చిన్న తనంలో బైట తిరుగాడుతూ పెద్ద పెద్ద ఆకారాల భవంతులు ఇత్యాదులను చూసేటప్పుడు వాటిని నిర్మించడంలో ఎంత విద్వత్తు, ఎంత పరిశ్రమ, ఎంత ఉపాసన ఉంటాయో తెలియకపోయినా వాటి సౌష్ఠవాన్ని చూసి అబ్బురపడిన అనుభూతిని ఈ శ్లోకాన్ని చదువుకుంటున్నపుడు ఇందులోని ప్రతీ అక్షరమూ నాకు కలిగించింది. ఇది ఆచార్య శ్రీ ధూళిపాళ మహాదేవమణి గారి నుండి నాకు అందిన మొదటి సందేశం. అప్పటి నుండీ వారి చల్లని దీవెనల వెలుతురు నాకు దారి చూపుతూనే ఉంది. శ్రీమతి ఆచార్య అన్నపూర్ణ గారి ప్రేమానుమోద వృష్టి అప్పటికే నా పై భరపూరంగా కురుస్తూ ఉంది.

శంభూయా ద్వర రామనాథ సుకవే ! సంపుష్ట మేథాఝరీ
రంగత్తుంగ తరంగడోలిత సుధీసందోహ వారాంనిధే !
వ్యాఖ్యా చాంద్రమసీ ప్రకాశ తపసా శ్రీపుట్టపర్తేః కవే
స్సామర్థ్యం, శివతాండవస్య, భవతా ప్రాబుద్ధ మస్మాదృశామ్

నైకగ్రంథ వివేకతా పిపఠిషా విజ్ఞాన గంధాత్మతా
సద్విద్యా పరిపూర్ణతా వివిదిషా విద్వత్ప్రమోదార్హతా
పద్యశ్లోక సుబోధనే చ కరణే  పారంగతా గణ్యతా
సంప్రాప్తా పరిమిప్రకాండ!జయహో! శ్రీరామనాథాఖ్య!తే .

అని నా సహాయవల్లి రచనను చదివి, అయోగ్యుడ్నైనా కూడా నాపై వారు కురిపించిన ఆశీర్వాక్కులు "పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్య"మ్మన్న మహాకవి భర్తృహరి ప్రతిపాదించిన సత్పురుషుల మహనీయ లక్షణానికి సాక్ష్యాలు. ఎందరో ఆరితేరిన గొప్ప విద్వాంసులను తయారు చేసిన ఈ గురు దంపతి వాత్సల్యాతపత్రం క్రింద ఏ చదువూ సంధ్యలు లేని నాకు చోటు లభించడం నా భాగ్యం కాకపోతే మరేమిటి?

మహాదేవమణి గారి అనుభూత హృదయం పల్లవించి పలికిన పద్యాలను "శ్రీధరీయము" గా వారిదివరకు ప్రచురించారు. ఇప్పుడు శిష్యుల కోరిక మేరకు దానిని పెంచి, మణిశింజినీ వ్యాఖ్యను జోడించి "బృహత్ శ్రీధరీయము" గా వెలువరించారు. అది ఫిబ్రవరి 11 వ తారీఖున హైదరాబాదు చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో ఆవిష్కరింపబడింది. ఆ కావ్యావిష్కార సభలో మాట్లాడే అవకాశం నాకు కలిగింది. అంతకు ముందే ఈ కావ్యానికి ఒక ముందుమాటను వారి ఆజ్ఞపై వ్రాసాను.

బృహత్ శ్రీధరీయము కావ్యంలోని పద్యాలు ఫేస్ బుక్ మాధ్యమంలో ఉన్న చాలా మందికి సుపరిచితమే. ఈ కావ్యంలోని ప్రతీ పద్యమూ కూడా నిసర్గమధురం. 1996 జనవరినెలలో మహాదేవమణిగారు మరొకొందరు పెద్దలతో కలిసి, తిరుపతికి ఒక అవధానకార్యక్రమ నిమిత్తంగా బయలుదేరారు. వారికి 3 రోజులలో ఏర్పాటైన తిరుమలేశుని దర్శనం ఎవరో రాజకీయనాయకులు రావడం చేత మరునాటికి వాయిదా పడింది. కానీ మహాదేవమణిగారికి సెలవు కుదరక, అదే రోజు సాయంత్రం 6.30 ట్రైనుకు తిరుగు ప్రయాణం కావాల్సిన సమయం ఏర్పడింది. దర్శనం కుదరదన్న సంగతి వారికి ఆరోజు మధ్యాహ్నం సమయంలో గానీ తెలియలేదు. దానితో వారికి ఆ పూట అన్నం సహించలేదు. ఆ దుఃఖం వాల్మీకి మహర్షినుండి ఒక శ్లోకమై వెలికి వచ్చినట్లు ఇలా పద్యపాదంగా ఆయన నుండి వెలికివచ్చింది:

అవధానంబున కేగుదెంచుటలు శ్రీశా! నిన్ను చూడంగనే
అవకాశం బిసుమంత లేక మది తా నఱ్ఱాకతో క్రుంగ


అని. ఈ పాదాలను పదే పదే మననం చేస్తూ బస్సెక్కి కొండపై దిగి, ఫ్రీలైన్ లో నిలబడ్డారాయన. అప్పటికి సమయం మధ్యాహ్నం మూడు గంటలు. ఆ సమయంలో అక్కడికి చేరినవారికి దర్శనం రాత్రి 10 గంటలకు గానీ జరిగే అవకాశం లేదు. వారికి ట్రైన్ సాయంత్రం ఆరున్నరకు. తరువాతిరోజు కాలేజీలో ఉండవలసిన పరిస్థితి. అయినా వారి అడుగు ముందుకు పడింది. ఏమాత్రమూ సడలని భగవద్విశ్వాసం ఇక్కడే పనిచేస్తుంది. అక్కడకు ఒక పోలీసాఫీసరు రావడమూ, అవధానం కార్యక్రమ బ్యాడ్జీతో ఉన్న మహాదేవమణిగారిని గుర్తుపట్టడమూ, వారిని తీసుకొని ప్రధాన సింహద్వారం వద్ద నిలబెట్టడమూ వెంటవెంటనే జరిగాయి. దర్శనం 4.30కు పూర్తయింది. దర్శనం ముగించుకొని, కొండ క్రిందకు వచ్చి, రూమ్ ఖాళీ చేసి వారు స్టేషను కు వచ్చే సరికి సమయం రాత్రి 7 గంటలు. ఆరోజు ట్రైను అరగంట ఆలస్యమై వారు బండిలో కూర్చోగానే కదిలింది. అణువణువూ విచలితమై, చుట్టూ ఆ బోగీలో ఉన్నవారు చూస్తుండగా కళ్లమ్మట నీళ్లు చిప్పిల్లుతుండగా పై పద్యాన్ని ఇలా పూర్తి చేసారు -

అవధానంబునకేగుదెంచుటలు శ్రీశా! నిన్ను చూడంగనే
అవకాశం బిసుమంత లేక మది తా నఱ్ఱాకతో క్రుంగగా
భవదాలోకన స్వల్పకాలమున విభ్రాంతిన్ ప్రసాదించి మా
ధవ! నన్ దిర్మలకెక్కజేసితివి మద్భాగ్యంబదే శ్రీధరా!


ఇది కవిత పుట్టవలసిన పద్ధతి. ఇదే కవిత పుట్టవలసిన పద్ధతి. ఇలా కన్నుల వెంట నీరు స్రవించిన ఒక కవి, ఆ కవి నుండి పుట్టిన పద్యం ఒక కావ్యంగా ఘటిల్లడం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఇందుకనే ఆ సభలో నా కావ్యసమీక్షా ప్రసంగం ప్రారంభిస్తూనే ఈ సంగతి ఉటంకించాను.

తొమ్మిదవ శతాబ్దానికి చెందిన లాక్షణికుడైన ఆనందవర్ధనుడు కావ్యంలో ధ్వని యొక్క మహత్త్వాన్ని సిద్ధాంతీకరిస్తూ ధ్వన్యాలోకమనే ఆలంకారిక మహద్రచనను చేశాడు. అందులో ఆయన కావ్యాత్మను గురించిన చర్చలో ఒకమాట చెప్పాడు.  

కావ్యస్యాత్మా స ఏవార్థః తథా చాదికవేః పురా
క్రౌంచ ద్వంద్వ వియోగోత్థః శోకః శ్లోకత్వమాగతః. 

ఒక సుందరమైన మహాకావ్యానికి రసరూప ధ్వన్యమానార్థమే ఆత్మ అని చెబుతూ దానికి నిదర్శనంగా ఆనాడు క్రౌంచపక్షుల జంటలో ఒకదానిని కిరాతుడు చంపినపుడు వాల్మీకి శోకం శ్లోకమై వెలివడిన ఉదంతాన్ని చెప్పాడు. దీనికి వ్యాఖ్యగా లోచనకారుడేమన్నాడంటే, ఇక్కడ ఉన్న కవేః అన్న శబ్దం శోకముతో అన్వయించకూడదనీ,   శ్లోకంతోనే అన్వయించాలనీ చెప్పాడు. న తు మునేశ్శోక ఇతి మంతవ్యం అని.  ఎందుకంటే వాల్మీకి అనుభవించిన శోకం లౌకికమైనది కాదు. లౌకిక శోకం కవిత్వాన్ని పుట్టిస్తుందని ఎక్కడా లేదు. నిజంగా ఎవరైనా మనలను గట్టిగా గిల్లితే లేదా మన వస్తువును దేనినైనా లాక్కుంటే పుట్టే శోకం కవిత్వాన్ని ఏమీ సృజింపదు. దుఃఖగతుడు ఆ దుఃఖంలో లీనమౌతాడు గానీ కవిత్వాన్ని చెప్పడం సాధ్యం కాని సంగతి. ఆ క్షణాలలో వాల్మీకి మనఃస్థితి అలౌకికమైనది. ఆయనలో క్రౌంచహననం వల్ల కరుణరసం జనించింది. ఆ భావావేశమే అప్రయత్నంగా శ్లోకంగా వెలికి వచ్చింది.

సరిగ్గా అటువంటి తిరుమలలో స్వామి దర్శనమనే ఒక  సంఘటన, అది కలిగించిన ఒక అలౌకికానుభూతి కవి కన్నుల వెంట ధారాపాతంగా బాష్పాలను పుట్టించి, వెనువెంటనే “అవధానంబున కేగుదెంచుటలుశ్రీశా!” అనే పద్యంగా వెలికివచ్చి ఆ అనుభూతే పరివర్ధితమై ఈ కావ్యంగా రూపుదిద్దుకుంది. “కరము ద్రవించి మానసము కన్నుల నుండి స్రవించె వెల్లువై” అన్న కవిపలుకులు అనుభూతి జనితాలు. ఒక కావ్యం పుట్టవలసిన అత్యుత్తమమైన పద్ధతి ఇది.

విష్ణువుమీదా, శివుని మీదా, అమ్మవారి మీదా గంగానది మనముందు ప్రవహిస్తుందా అన్నట్లుగా ఉండే ప్రతీపద్యమూ సంభాషణ రూపంగా తీర్చబడింది. ఈ కావ్యం నిండా అనేక విశేషాలు. భగవద్రూపభావన, ప్రస్తుతి, తత్త్వావిష్కరణ, పౌరాణిక విశేషాలను వివరించడం, లోకంలో అన్యాయాలను దుయ్యబట్టడం, భక్తి రహస్యాలు, మంత్రమహత్తులూ అనేకవిధాలుగా హృదయంగమంగా ఈ కావ్యంలో కనిపిస్తాయి. భక్తిలో ప్రధానంగా కావలసింది అహంకారత్యాగం. దానినే అద్భుతంగా ప్రతిపాదిస్తూ –

నిను నే జూచితినో, కనంబడితివో, నేనెంచలేన్ గాని నా
కనుకుందుల్ జలతైల పూరములతో గన్పాప దీపాలతో
నిను జూపింపగ జూచు నా యెడదకున్ ప్రేమంబునన్ చిత్తమున్
తనుజాతోన్నత రోమనేత్రముల దానై జూచెగా శ్రీధరా

అన్నారు. మనం భగవంతుడిని చూశాము అని అనుకోవడం ఆస్తికమనస్తత్వం కాదు. మనకు భగవద్దర్శనం కలగడం ఆయన కృప. ఈ విధంగా ప్రతీ పద్యంలోనూ అతిమనోహరంగా భక్తుడి హృదయాన్ని ఆవిష్కరించారు కవి. భగవత్స్మరణ, భగవచ్చింతన, భగవద్భావమూ లేని ముక్తి ఒక భక్తుడికి ఒకనాటికి వాంఛనీయం కాదు. అటువంటి ముక్తిని కూడా అధఃకరించి “ముక్తిర్ద్వారి చతుర్విధాపి కిమియం దాస్యాయ లోలాయతే” అన్నట్లుగా తమ చుట్టూ తిప్పుకోగలడాన్ని సాధింపగలిగిన భక్తిమార్గవిశిష్టత ఈ కావ్యం నిండా అడుగడుగునా కనిపిస్తుంది. “భక్తి యనగా సంజాత రోమాంచ నిశ్చల తాదాత్మ్యము” అన్న ఈ కవిపలుకులు ఆంధ్రసాహిత్యఫలకంపై సువర్ణాక్షరాలతోటి వ్రాయదగ్గవి.

“చిత్తకాలుష్యమే లోకానన్ నిజమైన కశ్మలత ఆలోచింపగా శ్రీధరా” అంటూ మనఃకాలుష్యమే అసలైన కశ్మలత అని వీరు చేసిన ప్రతిపాదన సమాజోన్నతిని కాంక్షించేది.  “నీ నామంబు లయంబు చేయు దురితానీకంబు మానాల్కకున్” అని నామమహిమను చక్కగా ప్రతిపాదించారు.

      

ఈ కావ్యంలోని మరొక మనోహరమైన సంగతి ప్రస్తావించవలసి ఉంది. వందకు పైన పద్యాలు, శ్లోకాలూ ఉన్న ఈ కావ్యంలో తానొక శిశువై, జగత్పితృతత్త్వంతో సంభాషిస్తూ అనేకవిధాలైన అంశాలను ముచ్చటిస్తూ ప్రతిపాదిస్తూ 50 వరకూ పద్యాలు వ్రాసారు కవి. అందులో ద్వైత-అద్వైత-విశిష్టాద్వైతాల మధ్య భేదమేమిటి, ద్వైతం యొక్క ఆవశ్యకత, పుజా పునస్కారాలు, రాసక్రీడ, వ్యాజస్తుతి, అవతారాల కథలు ఇత్యాది వాటితో పాటుగా ఆ తండ్రితో ప్రపంచంలో జరిగే అకృత్యాలను పంచుకోవడం - భక్తి వ్యాపారం కావడం ఇత్యాది; అదృష్టవంతుడిని ఎన్ని కష్టాలు పెట్టినా ఎదుగుతాడని చెప్పడం, సేవాఫలితం, పరోపదేశవేళల్లో అందరూ కనబరిచే ధోరణి, వీటితో పాటు అసలు మిథ్య అంటే ఏమిటి? అంతా శూన్యంగా భావిస్తే మంచిదా లేక స్వామి అంతటా నిండిఉన్నాడని సాధన చేయలా వంటి సందేహాలను సూటిగా ఆయన ముందు పెట్టడం ఉంది.

ఇవన్నీ ఒక కొడుకు తన తండ్రితో మాత్రమే మాట్లాడే విషయాలు.

తల్లి వద్దకు వచ్చే సరికి, లోకం ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడం లేదు. ఆ అమ్మప్రేమలో పూర్తిగా మునిగిపోయి తల్లిదగ్గర ఏ విధంగా ఒక కుమారుడు ప్రవర్తిస్తాడో అలా ఈ కవిశిశువు మారిపోతారు.

అక్కడి ఊహల్లో, పద్యాలలో “నీ మంజీరమ్మున మువ్వనై మణియునై మార్మ్రోగెదన్ శ్రీధరీ” అన్న మకుటంతో వచ్చే పద్యాలన్నీ నిసర్గమధురాలు. “నేను అమ్మ మంజీరానికి మువ్వనై ప్రతిధ్వనిస్తాను’ అన్న ఊహ ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో కానీ, అత్యంత గాఢంగా ఈ కవి హృదయాన్ని పట్టుకుని వీడలేదు. అమ్మకు తాను మంజీరంపు మువ్వగా మారి ఎన్ని మధురమైన ఊహలు చేశారో చెప్పడానికి వీలులేదు. నాదసేవ చేద్దామనుకోవడం, అది బ్రహ్మగారి వేదపఠనంలా ఉందనడం, సంగీత మందాకినిని పాద్యంగా స్రవింపజేయాలనుకోవడం, అమ్మకు జరిగే పూజాకుంకుమ పడి, తానుకూడా ప్రకాశించడం, పద్మం వంటి అమ్మ పాదాలపై తుమ్మెదలు వాలకుండా తాను మంజీరధ్వనులు చేయడం, చిగురుటాకుల వంటి అమ్మ పాదాలను కోయిలలు లేతచిగుళ్లనుకొని భ్రమించి పొడవకుండా తాను ధ్వనులు చేసి వాటిని దూరం చేయడం, అమ్మ ముంజేతి చిలుక పలుకులను తాను ధ్వనిస్తూ సవరించడం, అమ్మవారు యుద్ధం చేసే సమయంలో భయంకరమైన సర్పంగా మారి, కోరలతో అమ్మ పాదానికంటే ముందుగానే వెళ్లి శత్రుజనాన్ని ఇబ్బంది పెట్టడం, ప్రళయ సమయంలో తాను అమ్మ పాదమంజీరంగా శివునిపై నృత్యం చేయడం, ఇత్యాది ముగ్ధమనోహరాలైన ఊహలన్నీ ఈ కవి ఏదో ఒక పళ్లెంనిండా పూవులు తెచ్చి ముఖం మీద ఒక్కసారి కొడితే ఎంత బావుంటుందో, అంత అందంగా పద్యాలను మన హృదయంపైకి పదాలను భావాలను దోసిళ్లతో తీస్తూ విసురుతున్నట్లుగా వ్రాయగలిగారంటే, ఎంత గాఢంగా ఆయన తాను అమ్మ మంజీరాన్ని అన్న భావనను దృఢ పరచుకున్నారో, ఆ భావనలో ఎంత సమాధికి లోనైనారో తెలుస్తుంది. శ్యామదేవుడనే అలంకారికుడన్నాడు కదా, “కావ్యకర్మణి కవేః సమాధిః పరం వ్యాప్రియతే” అని. ఒక కావ్యంలో నిండా పరచుకుని ఉండేది కవి సమాధి మాత్రమే.

           
అమ్మవారి నఖవర్ణన చేస్తూ ఈ కవి అల్లిన పద్యాన్ని చూడండి:

నఖమా! విష్ణుపదాంబుజాంబక తనూ నక్షత్ర రోమాంచకో
న్ముఖమా! శార్మిక ధార్మికఘ్న కుటిలోన్మూలక్రియా వైష్ణవీ
మఖమా! సంతత నందమాన జనతాఽమ్లాయత్తమో దీపికా
శిఖమా!


అని పద్యం వ్రాసాక వారి కలం ఆగిపోయిందట! అమ్మపై భారం వేసి, నిద్రకుపక్రమించారట. ఆ నిద్రలో ఒక కల, ఆ కలలో 40 సంవత్సరాల క్రిందట వారికి టైఫాయిడ్ వచ్చినపుడు వారి అమ్మగారు ప్రక్కనే కూర్చుని జుట్టును తన గోళ్లతో పైకి తోస్తూ దువ్విన సన్నివేశం సాక్షాత్కరించి, "కూకటి దువ్వి ముద్దునిడితే! శ్రీనింప నన్ శ్రీధరీ!" అని పూర్తి చేసారు. ఇదే ఈ కావ్యం - ఈ కవి అనుభూతి దారం ఆధారితంగా అల్లిన పద్యాలమాల.

కావ్యం యశసేఽర్థ కృతే వ్యవహార విదే శివేతరక్షతయే
సద్యః పరనిర్వృతయే కాంతాసమ్మితయోపదేశయుజే

అన్న కావ్యానికి నిర్దేశింపబడిన ప్రయోజనాలలో యశస్సునూ, అర్థాన్నీ, వ్యవహారాన్నీ, కాంతాసమ్మితత్వాన్నీ కొంత శ్రమపడి సాధింపవచ్చు. కానీ శివేతరక్షతి, పరనిర్వృతి అనే ప్రయోజనాలను సాధించడం ఏ గొప్ప కవివల్లనో తప్ప సాధ్యం కాదు. ఆ రెంటినీ కూడా కలుపుకొని సంపూర్ణంగా సాధించిన భక్తివిద్యాప్రతిపాదకమైన కావ్యం ఈ శ్రీధరీయము.

లోకంలో సాధారణంగా ఏదైన ఒక విద్యను అభ్యసించే క్రమంలో “ఆ విద్య ఏది? ఎంత వరకూ ఉంది? ఎలా ఉన్నది? ఏ యే రూపాలలో లేదా రూపాంతరాలలో ఉన్నది” ఇత్యాది ప్రశ్నలకు మనం జవాబులు చెప్పుకుంటూ వెళతాము. కానీ, “నేను అభ్యసిస్తున్న విద్య కానిదేది?” అన్న ప్రశ్న మనకు ఉదయించదు. ఒక ఇంజనీరు మెడిసిన్ పై పుస్తకాలు వ్రాయడం మనం గమనించము. వ్యాపారవేత్త వ్యాపారసూత్రాలపై ఒక రచన చేయవచ్చు కానీ, సంగీతంపై ఏమీ వ్రాయడు. లాయరు పశుపోషణ సబ్జెక్టుపై ఏమీ మాట్లాడడు. ఆసక్తి ఉండవచ్చు. ఉండి ఉంటే, అది కృషిగా పరిణమించి, పరిశ్రమ తరువాత, తనది కాని ఆవిద్యలో ఉన్న పద్ధతులూ పడికట్లూ సంపూర్తిగా అవగాహనకు వచ్చిన తరువాత అందులో తన ప్రేమను ప్రకటీకరిస్తూ సగౌరవంగా ఎవరైనా రచనలు చేయడమే సాధారణంగా జరిగే పద్ధతి.
 
కానీ ఈ నియమం భారతీయ చరిత్రకూ, విద్యకూ మాత్రం లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ పరిస్థితులలో ఏ వాతావరణంలో ఉన్న వ్యక్తైనా వాటిపై ఒక పుస్తకం విడుదల చేయవచ్చు. ఉన్నది తప్పు, నేను చెవుతానంటూ నిర్వచనాలతో ప్రమాణాలు ఉన్నా లేకున్నా అధికారం ప్రకటించుకొని అక్షింతలు వెనక్కు చల్లి కొన్ని వందల పేజీల పుస్తకం వ్రాయవచ్చు. మీకు తెలిసింది భక్తి కాదు, ఇదే భక్తి అని మాట్లాడవచ్చు, మాట్లాడుతున్నారు కూడా. ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోవడం మాని; తాను ఒక ఫలితాన్ని ముందుగానే అనుకుని, దానిని దత్తాంశాలలోకి తెలివితో కిట్టించవచ్చు. ఇటువంటి పరిస్థితులలో, ఇన్ని వలల మధ్యలో  ఆస్తికతలోని అనుభూతిని, ఉన్నతిని, జీవాన్ని గ్రహిస్తూ మన అనుభూతిని చెడిపోకుండా కాపు కాసుకోవడం మన కర్తవ్యం కావాలి. అందుకోసం ఏదైనా ఒక భారతీయవిద్యలో ఏది విద్య, ఏది అవిద్య అన్న విభజన చేసుకోవలసిన అవసరం మనకు ఉంది. ఏది భక్తి కాదో, ఏది సత్సంప్రదాయం కాబోదో, ఏది మనది కానిదానిని మనతో ఔననిపిస్తోందో వివేచిస్తూ సాధనలో పురోగమించవలసిన ఆవశ్యకత ఉంది. అందుకు ఆజీవితాంతం సారస్వత, ఆధ్యాత్మిక ఉపాసనలో ఉన్న ఒక కవి ముఖపద్మం నుండి వెలికివచ్చిన బృహత్ శ్రీధరీయము వంటి ఒక రచన ఒక దీపమై దారి చూపిస్తుంది అనడంలో నాకు ఏ సందేహమూ లేదు.

అని నా ప్రసంగాన్ని ముగించాను. ఆసక్తిపరుల కోసం ఈ రచనకు నేను వ్రాసిన ముందుమాటను ఇక్కడ ఉంచుతున్నాను. ఈ కావ్య ప్రతుల కోసం ఆచార్య శ్రీ మహాదేవమణిగారిని సంప్రదించవచ్చు.

****

No comments:

Post a Comment