Sunday, 23 March 2025

తల్లీకూతుళ్ల విద్యావాల్లభ్యం

          

17వ శతాబ్దపు తంజావూరు విద్యకు జీవగర్ర. ముఖ్యంగా ఆనాటి దీక్షితుల నట్టిళ్లు పాండిత్యానీకీ కవిత్వానికీ పుట్టిళ్లు. అచ్చన్న దీక్షితులు, రంగరాజాధ్వరి, అప్పయదీక్షితులు, రత్నఖేట శ్రీనివాస దీక్షితులు, సమరపుంగవ దీక్షితులు, యజ్ఞనారాయణ దీక్షితులు, రామభద్ర దీక్షితులు, నీలకంఠ దీక్షితులు, గోవింద దీక్షితులు - ఒక్కొక్కరూ ఒక్కొక మహామేరువు. ఈ కవుల పేర్లు తలచుకుంటేనే, వారి కృతులను గుర్తుచేసుకుంటేనే, వారి ఊపిరి వెనుక ఆదర్శాలను స్మరించుకుంటేనే మేను పులకాంకురితమౌతుంది.

వారి ఇళ్ల వసారాల వెంట, గుమ్మాల వెంట, గదుల వెంట, వీథుల వెంటా తన పదపల్లవాలకు మట్టి చిద్రుపలు గ్రుచ్చుకొని, ఇబ్బంది పెడుతున్నాయన్న సంగతి కూడా గమనించకుండా భారతీదేవి స్వైరవిహారం చేసిన కాలమది. పురుషులూ, స్త్రీలూ అనే భేదం లేకుండా జ్ఞానం ఒక అవారితపవనమై ఉన్నతవాతావరణాన్ని కల్పించిన రోజులవి. దీక్షితవంశంలోని మగవారి రక్తనాళాలనిండా చదువు, చర్చ, జ్ఞానం, విద్య, కవిత్వం, రచన, భక్తి ప్రవహిస్తూ ఉండేవి. ఆ నాటి గృహిణులైతే సారస్వతశక్తులు. అటువంటి ఒక తల్లి, ఆమె కూతురి గురించిన వివరమే ఈ చిరువ్యాసం.

ఈ తల్లిపేరు మంగళాంబ. ఈమె “రత్నఖేట” శ్రీనివాసదీక్షితుల ధర్మపత్ని. శ్రీనివాస దీక్షితులు బహుశాస్త్ర కోవిదుడు, అవధాని, అనేకగ్రంథనిర్మాత. అప్పటి జింజి సంస్థానాన్ని పాలించిన కృష్ణమనాయకుని కొలువుకూటంలో విద్యాధికారి. సూర్యుడిని రత్నఖేటం తో పోల్చుతూ ఒక శ్లోకం చెప్పాడు. ఆనాటి నుండీ రత్నఖేట దీక్షితులని పేరు వచ్చింది. మంగళాంబ స్వతహాగా విద్వాంసురాలు, కవయిత్రి. ఆ రోజులలో శాస్త్ర చర్చలలో వాక్యార్థసభలలో పాలుపంచుకునేది. ఒకరోజు అటువంటి ఒక సభకు వెళ్లడానికి ఆవిడకు ఆలస్యమైంది. ఆ సమావేశంలో ఉన్న శ్రీనివాస దీక్షితులు కారణాన్ని అడిగారు. వెంటనే ఆశువుగా తన భర్తకు ఇలా సమాధామిచ్చింది.

వేణీ భూతేషు కేశేష్వసిత ఫణి ధియా ద్రష్టుమాగత్య కేకీ పశ్చాదారభ్య యోద్ధుం ప్రతిశిఖిమనసా తేషు విస్రంసితేషు భూయో ధమ్మిల్లితేషు ప్రకటఘనధియా నర్తనాయోజ్జజృంభే తన్నృత్తాలోకనాన్మే ప్రియసఖ! సమభూన్మండనశ్రీవిలంబః

“ప్రియసఖా! నేను ఈ సభకు రావడానికి తయారౌతూ, జడ వేసుకుంటూండగా అక్కడ ఉన్న మయూరం నా వేణీ బంధాన్ని చూసి, సర్పంగా భ్రమించి పట్టుకుందామని దగ్గరగా వచ్చింది. భయంతో నేను జడను విప్పాను. విడిన కేశాలను చూసి, పురివిప్పిన మరొక నెమలేమో అని భ్రమించి, దానితో యుద్ధం చేయబూనింది. దాంతో మళ్లీ జడను అల్లుకోవడం ప్రారంభించాను. ఈ సారి అది ఒక నల్లమబ్బులాగా దానికి గోచరించింది. ఆనందంతో ఆ నెమలి నృత్యం చేయడం మొదలుపెట్టింది. ఆ నృత్యాన్ని చూస్తూ ఉండిపోయాను. కనుక ఆలస్యమైంది. ”

ఈ సమాధానంలో మంగళాంబ యొక్క కల్పన, ప్రతిభ, ఔచిత్యం, విద్వత్తు, ఆశుత్వం, పరిస్థితి నిర్వహణ – అన్నీ కబరీభారంలానే పెనవేసుకుని ఉన్నాయి. ఇది స్రగ్ధరావృత్తం. అప్పటికప్పుడు అల్లడం కష్టసాధ్యం. పైగా ప్రియసఖా అని సభామధ్యంలో భర్తను సంబోధించిందంటే, ఆమెకు అక్కడ ఉన్న గౌరవమూ; వారందరికీ కావ్యసంప్రదాయపుటౌచిత్యాలపై ఉన్న మక్కువా తేటతెల్లమౌతున్నాయి.

మంగళాంబ-శ్రీనివాస దీక్షితుల కుమార్తె అచ్చమ్మ. శ్రీనివాస దీక్షితులను వాదంలో ఓడించడం చాలా మంది పండితులకు కేవలస్వప్నంగా ఉండేది. ఆయన ప్రతిపాదనలతో అంగీకరించని వారు కూడా ఎదురొడ్డడానికి జంకేవారట. అంతటి వాదపటిమ ఆయనది. ఒకనాడు ఉదయాన్నే శ్రీనివాస దీక్షితుల శక్తి తెలియని పండితులు కొందరు దూరదేశం నుండి వాదన కోసం వారింటికి వచ్చారట. అప్పుడు అచ్చమ్మ కళ్ళాపి చల్లుతున్నది. వారి ఉద్దేశం అర్థమై, తన విద్వత్తూ తద్వారా తన తండ్రి విద్యామహత్వమూ తెలిసేలా ఆశువుగా ఇలా  అన్నదట:

విపశ్చితా మపశ్చిమే వివాదకేలి నిశ్చలే
సపత్నజిత్యయత్నతస్తు రత్నఖేట దీక్షితే
బృహస్పతిః క్వ జల్పతి క్వ సర్పతీహ సర్పరాట్
అసమ్ముఖస్తు షణ్ముఖశ్చతుర్ముఖోపి దుర్ముఖః

ఈ బంగారుతల్లి ప్రతిభ శ్లోకం చెప్పడంలో అదీ ఆశువుగా చెప్పడంలో కంటే, తగిన ఛందస్సునెన్నుకోవడంలోనూ దానిని నడిపించడంలోనూ ఉంది. ఈ వృత్తం పేరు పంచచామరము. లఘువు-గురువుల జంట ఒక పాదంలో ఎనిమిది సార్లు త్ర్యస్రగతిలో వస్తుంది. ఒకసారి ఈ శ్లోకాన్ని పైకి చదవండి. ఆ గతిలో కళ్లాపి చల్లే గతిని ఊహిస్తూ చదవండి. ఔచిత్యం మీకు వెనువెంటనే సాక్షాత్కరిస్తుంది.

“విద్వాంసులలో తనవంటి మరొకరు లేనివాడూ, వివాదకేళిలో తొణకడమే తెలియనివాడూ, ప్రతివాదులను అలవోకగా ఓడించేవాడూ అయినా రత్నఖేట దీక్షితులుండగా బృహస్పతి మాట్లాడగలడా? వేయిపడగల ఆదిశేషుడు నోరుమెదపగలడా?సరికదా, ఆరుముఖాల షణ్ముఖుడైతే ఎదురుగానిలబడలేడు. బ్రహ్మగారు పెడమొహం పెట్టకుండా ఉండలేడు.”

ఇంతటి మహనీయుడు రత్నఖేట దీక్షితులు. అంతటి వాడు ఆనాటి జింజి సంస్థానానికి వచ్చి, తన అనిదంపూర్వమైన అద్వితీయమైన ప్రతిభతో ఎవరూ మెప్పించలేని విధంగా తనను మెప్పించి, విద్యలో గొప్పతనమంటే ఇది అని చూపిస్తూ ప్రకాశించిన యువశివావతారం అప్పయదీక్షితులను చూసి అబ్బురపడి, ఆయనతో మామూలుగా నమస్కారం పొందడం వీలు కాక, అచ్చమ్మను ఇచ్చి వివాహం చేసి, మామగారి స్థానంలో ఉండి నమస్కరింపబడ్డారట! జింజిలో తాను కేవలం “అచ్చా భర్త”ను మాత్రమే అని అప్పయ్య దీక్షితులు స్వయంగా గర్వపడ్డారు.

(మిత్రులతో ఒక చర్చలో భాగంగా వ్రాసినది)


****

No comments:

Post a Comment