Wednesday, 22 January 2025

కీర్తనీయచరితుడు


తురుష్కో నిష్కాశిః తురగఖుర కుద్దాల దళిత
క్షమా ధూళీపాళీ చుళుకిత చతుస్సిన్ధుసలిలః
స్వదోర్లీలా భగ్న ప్రతిభట వధూటీ పరికరః
ప్రతస్థే కార్తాన్తీం దిశమితి హి వార్తా సమజని.

అపరశివావతారమైన అప్పయ్యదీక్షితుల వారు ఉపాసనలో ఉన్నారు. వీధిబైట ఏదో కలకలం. ఏం జరుగుతుందో చూసిరమ్మని కూతురిని పంపారు. ఆమె బైటకు పోయి వచ్చి ఆయనతో ఆశువుగా పై శ్లోకం చెప్పిందట!"

అన్నారు మహావిద్వాంసులైన చామరాజనగరం శ్రీకంఠశాస్త్రిగారు శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాల యతీంద్రులతో. వారి సన్నిధిలో ఒక 12 సంవత్సరాల వటువున్నాడు. యతీంద్రులు అతనితో, "అనంతూ! పై శ్లోకం గుర్తుపెట్టుకోరా" అని ఆదేశించారు. శాస్త్రిగారన్నారు కదా, "చెప్పింది ఒక్కసారే కదా" అని. "ఏమీ ఫరవాలేదు, అతను గుర్తుపెట్టుకుంటాడు" అని యతీంద్రుల సమాధానం. ఆ వటువే సుగృహీతనామధేయులైన రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు.

నేను సాహిత్యవిద్యను అర్థించడం మొదలుపెట్టిననాటి నుండీ నేటి వరకూ, ఆ మాటకొస్తే నేననుకోవడం, నా జీవితాంతం వరకూ కొందరి వ్యక్తుల ప్రభావం నన్ను వదిలిపోదు. ఆ వ్యక్తులలో శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారొకరు. సాహిత్యాన్ని చూసే రీతిలోనూ, చేసే రీతిలోనూ ఆయన నాలో కలిగించిన పెనుమార్పులు నేను విడిపించుకోలేనివి.

సంగీతంలో రాళ్లపల్లివారి ప్రజ్ఞ జగద్విదితం. పుట్టపర్తి నారాయణాచార్యులు ఆయన గురించి రెండు మాటలన్నారు. ఒకటి, రాళ్లపల్లి సంగీతశాస్త్రంలో మహాలాక్షణికుడు. ఎంతటి లాక్షణికుడంటే, ఆనాటి గొప్పగొప్ప సంగీత విద్వాంసులు ఈయన దగ్గరకు వచ్చి, రాగాల స్వరూపాలిలా ఉంటాయి అని నేర్చుకునేటంత. పుట్టపర్తివారన్న ఇంకోమాట - నేను సాహిత్యంలో పడి సంగీతాన్ని నిర్లక్ష్యం చేస్తే, రాళ్లపల్లివారు సంగీతంలో పడి సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేసారు అని. ఆ మాట ఒకవేళ నిజమే అయి, ఆయననుండి సంగీతరంగంలో బయల్పడిన విజ్ఞానం, సాహిత్యరంగంలో బయల్పడిఉండకపోయినట్లైతే అది ఒకరకంగా మంచికే జరిగిందేమో అనిపిస్తుంది. కారణం, ఇప్పటి వరకూ ఆయన మనకు ఇచ్చిన సాహిత్యాన్నే మనం సరిగా అధ్యయనం చేయలేదు కనుక.

నాకు రాళ్లపల్లివారు ముందుగా ఆయన వ్యాసాల ద్వారా పరిచయం అయ్యారు. ఆయన సాహిత్యంపై చేసిన విమర్శ ఒక మహోన్నతస్థాయికి చెందినది. తులనాత్మక అధ్యయనం, దోషాలను ఎత్తి చూపడం, గుణాల పొగడిక, ప్రమాణాలనూ, దృష్టాంతాలనూ, దార్ష్టాంతికాలనూ వివరించడం, నిర్వచనాలను విశదీకరించడం ఇత్యాది అనేక అంశాలలో ఆయన ఒక దార్ఢ్యమైన కొత్త దారి వేసారు. విమర్శలో ఆయన తప్పొప్పులు చూపే విభాజకుడుగా కాకుండా, ఒక సహృదయుడుగా, ఒక సుహృదయుడుగా మాత్రమే రచనలు చేసారు. ఈ ఒక్క వ్యక్తివల్ల తెలుగులో విమర్శ లోతైనదిగానూ, విశాలమైనదిగానూ అయింది. అన్నమయ్యకూ, వేమనకూ వారు చేసిన ఉపకారం ఎనలేనిది. రాళ్లపల్లివారి వ్యాసాలపైన వీలుచిక్కితే మరొకసారి వివరంగా మాట్లాడాలి.

ప్రముఖ పండితులు ప్రొఫెసర్ సాళ్వ కృష్ణమూర్తి గారు రాళ్లపల్లివారిని ఇలా వర్ణించారు -

జయతి నయసరూపః పుష్పహాసానురూపో
విహితమధురభావః సున్దరో మంగళాంగః
కృతిరపి వ్యవహర్తా సత్యవాదీ చ వాగ్మీ
రుచిరమతిరుదారః పేశలోఽనన్తకృష్ణః

ఆయన పుష్పహాసానురూపుడట. శరీరం సౌందర్యవంతమైందట. మధురమైన భావాలతో నిండినటువంటి ఆయన సత్యవాది అట. అలానే వాగ్మి కూడానట. ఆయన బుద్ధి మనోహరమైనదట. అటువంటివాడట అనంతకృష్ణ.

ఈ వ్యాసం నేను మీతో పంచుకోదల్చుకున్నది ఆయన కవిత్వం గురించి. గాథాసప్తశతీసారంలో ఆయన తీసుకువచ్చిన తెలుగుదనం ఎంతటిదో మిత్రులకు తెలుసు. నా మనసుకెంతో దగ్గరైన పద్యాలలో కొన్నింటిని చూడండి:
~
ప్రత్తిచేను దున్నుపనికి మంచిదినాన
మడకపూజ సేయఁ దొడఁగు నపుడు
కోర్కులాత్మ గుబులుకొన గడగడమని
వడకఁజొచ్చెఁ గాపు చెడిపె కేలు.
~
"ముద్దుఁగొడుకు మొదట మొలచిన పలుదోయి
గొఱికి కొఱికి కాటువఱిచె నిదిగొ!
రేఁగుపండు గంటిరే!" యని పెండ్లాము
నగుచుఁ దెచ్చిపెట్టె మగనిచేత.
~
మెండుకొని మిద్దెబంగలనుండి కురియు
వాననీళులఁ దోఁగిన ప్రాఁతయింట
నానకుండిన చోటును నాన్పుచున్న
దకట! కన్నీళ్ళఁ బాంథునిల్లాలు చూడు.
~
చూరునుండి వాననీరు గాఱఁగఁ దల
నడ్డువెట్టి కొడుకు నాదుకొనెడుఁ
గాని, పాంథగృహిణి, కన్నీటివరదలఁ
దాను దడుపుచుంట కానదకట.
~
పూని యూదెడు నెఱజాణ! ప్రొయ్యి మీద
నలుక గొనబోకు ; రక్త పాటల సుగంధ
మైన నీయూర్పు జవులకు నాసగొనుచు
పొగ లెగయు గాని మండదీ ప్రొయ్యినగ్గి.
~
వంటయింటి పనుల నంటిన మసిచేయి
సోకియుండ జంద్రసుందరముగ
నింపుగొల్పుచున్న యిల్లాలిమోమును
భర్త నవ్వుచున్నవాడు చూచి.

~
తానమాడి సమ్మదమున దువ్వెనపండ్లఁ
జిక్కుకొన్న పసపు చిన్నముల్లు
గ్రుచ్చి తీసెదెవని కోరిక పండంగఁ
జేయఁబూనినావె చిన్నదాన.
~
కలఁగవు కమలంబులు; హం
సలు గదలవు; చూడవమ్మ చక్కఁగ నెవరో
తలక్రిందుగ నాకాశము
నిలిపినవారత్త! చెఱువు నీళులలోనన్.
~
చక్కఁదనము గలుగు చానలు జగములో

నెందఱున్ననేమి? యింత వినుము ---
ఒడలి చెలువునందు నెడమ సగంబుతోఁ
గుడి సగంబె సాటి గూడుఁ జెలికి.
~~~

సుందరపాండ్యుని నీతిద్విషష్టికను సైతం ఆయన ‘ఆర్య’ అన్న పేరుతో తెనిగించారు. పెనుగొండ మీద ఆయన అల్లిన పాట ఎంత తీయనిదని?

ప. చనిన నాళుల తెనుగు కత్తులు
సానవెట్టిన బండ - యీ
పెనుగొండ కొండ

చ (౧) రంధ్రములఁ బ్రహరించు శత్రుల
రక్తధారల త్రావి త్రేఁచిన
ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ముల
అఱితి నీలపు దండ (యీ పెను)

(౨) వెరపులెఱుగని బిరుదు నడకల
విజయనగరపు రాచకొడుకులు
పొరలఁబోయఁగ కరడుకట్టిన
పచ్చినెత్తురు కండ (యీ పెను)

౩) తిరుమలేంద్రుని కీర్తి తేనెలు
బెరసి దించిన కాపుకవనపు
నిరుపమ ద్రాక్షారసంబులు
నిండి తొలఁకెడు కుండ (యీ పెను)


రాళ్లపల్లి వారి వంటి హృదయమున్న కవి మరొకరుండరేమో. రఘువంశాన్ని తెలుగుచేద్దామని ప్రయత్నించి, చేసి, తనకే నచ్చక చించివేసిన ఆయన తపన ఎవరికుంటుంది? కవిపదవంటే అంత గౌరవం ఆయనకు. ఆ సందర్భంగా ఆయన పడిన ఈ వేదన వంద కావ్యాలకు పెట్టు -

పదపుష్టింబరికించి శబ్దవిధులం
బాటించి, యర్థంబులన్
గొదుకుల్ వుట్టక దిద్ది, భావముల ని
క్కుల్ సూచి పద్యంబులన్
బొదిగింపంగలమింతె గాని యది యే
మో తక్కువైదోచు నా
కొదువందీర్చు కవిత్వబీజమది మా
కున్ జిక్కునో జిక్కదో!

ఆయనకు ధనాశలేదు. కీర్తికాంక్షలేదు. వినాదైన్యేన జీవనం అన్నదే ఆయన కోర్కె. అదే ఈ మనోహరపద్యంగా ఆయన్నుండి వెలివడ్డది:

ధనమే యిమ్మని నిన్ను నేనడుగనో
తల్లీ! తలంపన్ ధనం
బన బైనొత్తిన రాజముద్రయె గదా!
ప్రాణంబుతో నీ జగం
బున నున్నన్ని దినాలు కొందరయినన్
మోదింపగా గౌరవం
బున జీవింప ననుగ్రహింపు మదియే
పూర్ణంబగున్ భార్గవీ!

అని.

ఆమధ్య కన్నడిగులు రాళ్లపల్లివారిపై వ్రాసిన వ్యాసాలను చదివినపుడు వాళ్లు ఆయన్ను భుజాలమీదకెత్తుకున్న వైనం చూసి, ఆనందంతో పాటుగా, ‘ఈపని తెలుగువాడు చేయలేదు కదా’ అన్న బాధకూడా కలిగింది. మైసూరులో రాళ్లపల్లివారు ఊనుకుని ఉండకపోయిఉంటే ఇది కూడా జరిగి ఉండేది కాదని సమాధానపడ్డాను.

న్యాసకళానిధిస్తవమ్ అని రాళ్లపల్లివారు వ్రాసిన కృతిలోని ఈ రెండు శ్లోకాలను చూడండి -

అనిర్వేదమసిద్ధేషు సాధితేష్వనహఙ్కృతిమ్
అనాలస్యఞ్చ సాధ్యేషు కృత్యేష్వనుగృహాణ నః

సాధించలేని వాటిపట్ల అనిర్వేదం,
సాధించిన వాటిపట్ల అనహంకృతి,
సాధించవలసినవాటి పట్ల అనాలస్యం
మాకు అనుగ్రహించు స్వామీ!

~

స్వచ్ఛన్దం భవతః ఛందే పారవశ్యం భవద్వశే
పశ్యతాం నః సదా చిత్తం సమాధత్తాం శమాధ్వని

స్వామీ!
నీ నిర్బంధంలో స్వచ్ఛందంగా,
నీ వశంలో పారవశ్యంతోనూ ఉంటూ
మా మనసులు శాంతిమార్గంలో పయనించుగాక!

అసలైన ఆస్తికతకు శాసనాలవంటివి ఈ రెండుశ్లోకాలూ.

రాళ్లపల్లివారు బాలకశతకమన్న పేరుతో సంస్కృతంలో ఒక నూరు శ్లోకాల రచనను చేయాడానికి పూని, కేవలం ఆరు శ్లోకాలు మాత్రమే వ్రాసారు. శిశువు మీద ఇంతటి ఒక గొప్ప రచన మరొకటి ఉన్నదా అన్నది నాకు అనుమానమే. ఈ శతకం పూర్తయి ఉంటే, సంస్కృతశతక శిల్పంలో విలక్షణమై, ఒక సమ్మార్జనీ శతకం, మహిషశతకం, కలివిడంబనశతకం, కంటకాంజలి ఇత్యాదుల సరసన అవ్వవలసిన తీపివాదోడుగా అయి ఉండేది. ఆ ఆరుపద్యాలనూ మిత్రులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను.

ఈ ఆరుశ్లోకాలూ అనర్ఘమణులు. శిల్పంలో కానీ, భావప్రకటనలో కానీ ఈ శ్లోకాలలో నాకు కనిపించిన మాధుర్యం, నేను ఎక్కడా చూడనటువంటివే. మీరు ఒక మంచికవితను చదివినపుడు కవియొక్క ప్రతిభను చూసి పొగిడి ఉంటారు. ఈ క్రింది ఆరుకవితలనూ చదివాకా, ఆయన ప్రతిభను ఎలాగూ చూస్తారు. అయితే దానితోపాటుగా, రాళ్లపల్లివారు తామనుకున్న విధంగా కృతిని పూరించలేకపోవడాన్ని చూడండి. ఆరు దగ్గర ఆగిపోయి, ఏడవశ్లోకాన్ని ఊహించలేని వారి అశక్తతను చూడండి. ‘ఇంత గొప్పగా వస్తేనే కానీ వద్దు’ అని అనగలిగి, మామూలుగా కవులకుండే చాపల్యాన్ని తన కొనగోటితో తొక్కిపెట్టిన ఓ విబుధుడి వీరత్వాన్ని చూడండి.

1

ప్రాతస్సంత్యజ మందిరం, శ్రయ ధనోన్మత్తానవజ్ఞా శతం
మౌనేనాపి సహస్వ, శోషయ తనుం సేవాసు వా మా శుచః
ఉద్బాహుద్వయముచ్చకైరుపహసన్ లంబాలకం కేవలం
సాయం త్వా మభిగచ్ఛతు ప్రియతమా కక్షావలంబీ శిశుః

ప్రొద్దున్నే నీ ఇంటిని విడిచిపెట్టు,
ధనోన్మత్తులను జీవికకోసం ఆశ్రయించు.
వందలాది మొద్దులను మౌనంగానే సహించు.
బైట సేవలో ఒంటిని సున్నం చేసుకో- ఫరవాలేదు; శోకించకు.
సాయంవేళయ్యేసరికి, నీ ఇంటిదాని చంకనాశ్రయించి
ఊగాడుతున్న జత్తుతో, నీకేసి చూసినవ్వుతూ
రెండు చేతులూ చాచి,
నీ శిశువు నీకెదురువచ్చుగాక!

ఈ కవిత ఒక విశ్వవ్యాపకశక్తి ఉన్న శుభాశంసన. ఒక సాక్షాత్కారంకోసం పడవలసిన తపన, చేయదగిన ఉపాసన. ఇంతకంటే ఒక సాధువాదాన్ని నేను ఊహించలేను. నా మనసు కష్టంలో మునిగిపోయిన ప్రతీసారీ, ఈ కవిత నాకు స్ఫురించాలని మాత్రం కోరుకుంటాను.

2

డోలా మధ్యే శిశుమభినవైః హాసలేశైర్విలాసాన్
అభ్యస్యంతీమనిమిషదృశా పశ్యతోః సూతిగేహే
పిత్రోర్మోదం గ్రసతి సహసాభ్యుద్గత ప్రాక్పరా సు-
జ్యేష్ఠాఽపత్య స్మృతిజనిత శుక్ నిష్ప్రతీకార తీవ్రా.

సూతిగేహంలో ఉయాల మధ్యలో
శిశువుయొక్క లేలేత నవ్వుల చిందింపులకేసి
రెప్పవాల్పులను మర్చిపోయి చూస్తున్న
తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని
హఠాత్తుగా వారి మనసులలో తోచినటువంటి
పూర్వజాత మృతశిశువు యొక్క స్మృతిజనిత తీవ్రశోకం
కబళించివేస్తుంది.

మహాబలమున్న రెండు మనోభావాల మధ్య యుద్ధం ఈ కవిత. గ్రసతి - తేలికదైనా చాలా బరువైన మాట. ‘నిష్ప్రతీకార తీవ్రా’ - అడ్డూ అదుపూ లేని తీవ్రత అది. ఈ కవితలో కవి శోకానికి అతిచిన్న పదం ‘శుక్’ ని వాడేడు. కానీ దానిచుట్టూ కవి అల్లిన పదాలగూడు దాని బరువును ఎంతో పెంచింది. పై కవితకూ, ఈ కవితకూ ఎంత తేడా?

3

రదన ముకుళైః ద్విత్ర్రైర్నూత్నోద్గమాత్ప్రియ దంశనైః
సపది శిశునా మాతా దష్టస్తనీ కృత శీత్కృతిః
‘కి’మితి సహసా పత్యా పృష్టా, 'నకించి’దితీక్షణే
నమయతి మనాగోష్ఠోపాంతస్ఖలన్మధుర స్మితా.

అప్పుడే వచ్చిన మొగ్గలలాంటి రెండు పాలపళ్లతోటి
లేతగా తన చన్నును కొరికిన వెంటనే
‘ఇస్స్’ అన్న ఆ తల్లిని చూసి
“ఏమైంది” అని భర్త వేసిన ప్రశ్నకు
వెంటనే “ఏమీలేదు” అంటూ, ఆమె, తన చూపును
పెదవి సెలవులపై పుట్టిన తెలినవ్వువైపుగా వాల్చింది.

ఇది ఒక స్వభావ వర్ణన. ఎన్నో రూపకాలూ, ఉత్ప్రేక్షలూ ఏకకంఠంతో తమ గొంతులను ఆసాంతమూ పణంగా పెట్టినా తీసుకురాలేని మనోహరమైన ఊహ. తల్లిప్రేమను ఈకవి మాత్రమే, ఇంత అలతి సంస్కృత పదాలతోటి కొలవగలిగేడని నేను ఖచ్చితంగా చెప్పగలను.

అల్లికను చూడండి - ఎంత అసాధారణత్వం! ప్రతీపదమూ లోతైనదే. ఆ తల్లి ‘దష్టస్తని’. ఆ కొరుకుళ్లు ‘ప్రియదంశనలు’. శీత్కృతి - చాలా తీయని పదం.

4

స్నిహ్యద్బంధు వియోగ శూన్య మనసోర్బాష్పస్ఖలత్ కంఠయోః
దంపత్యోర్యతమానయోర్చతముదైవాన్యోన్య మాశ్వాసనే
హస్తాభ్యామవలంబ్య జానుయుగతో(?) మాస్ఫాలయన్ పుత్రకః
చక్రే సస్మిత కౌతుకైర్జగదిదం నైకాంతదుఃఖాకులమ్.

అనుగు బంధువుల వియోగంచేత శూన్యమైన మనసు కలిగినటువంటి
కన్నీళ్లను వర్షిస్తున్న కంఠాలను కలిగినటువంటీ
పరస్పరమూ ఊరడించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి
ఆలుమగల యొక్క జగత్తును
బోసినవ్వుల కుతుకాలతో
రెండు చేతుల ఆసరాగా, రెండు మోకాళ్లనూ ఆడిస్తున్న పుత్రకుడు
నందనవనంగా మార్చివేసాడు.

ఇది సద్యోమహిమ. నైకాంతదుఃఖాకులమ్ - ఎంతో అందమై పదబంధం.

5

నిషిద్ధాన్యేవాసౌ పరిమృశతి వస్తూని నచతై
రభగ్నైః సంతుష్యత్యథ హసతి తర్జాసు బహుళమ్
కథం నిర్వ్యోఢవ్యో గృహవిధిరనేనేతి వివశాం
శిశౌ, పత్నీం పశ్యన్ వికసితముఖో నందతి యువా.

‘వద్దన్నవాటినే పోయి పట్టుకుంటాడు.
పట్టుకున్న వస్తువులను పగులగొట్టి సంతోషపడతాడు.
బెదిరిస్తేనేమో, వెకిలిగా నవ్వుతాడు.
ఈ కర్మను నేనెట్లా సహించేది?’
అని అల్లరి పిల్లవాడి గురించి
వివశంగా మాట్లాడుతున్న భార్యను చూసి
విచ్చుకున్నముఖంతో యువకుడు ఆనందిస్తున్నాడు.

ఈ పీడ ప్రతీ ఇంటికీ శాశ్వతంగా పడుతూనే ఉండాలి.

6
అంతః పంజర వర్తినశ్శుకశిశో రాలాపనైర్మోహితో
వేగాత్క్రీడనకాని గేహపురతో విక్రేతుకామో వణిక్
అక్లిష్టాం గృహరంగవల్లి, మవిపర్యస్తం చ వస్తుక్రమం
పశ్యన్నేవ, వహన్నళింద నిహితాం పేటీం పునః ప్రస్థితః

ఇంటిలోని పంజరంలోనించి వెలువడుతున్న శుకాలాపాలకు మోహపడి
బొమ్మలను అమ్మడానికి వేగంగా ఇంటిముందుకొచ్చిన వ్యాపారి
చెరుపబడని రంగవల్లిని, చెదరబడని వస్తువులనూ చూస్తూనే
క్రిందకు దింపిన తన బుట్టనెత్తుకుని బయలుదేరాడు.

~
డా. చిలుకూరి నారాయణరావుగారు ఒక మిత్రగోష్ఠిలో రాళ్లపల్లివారి గురించి చెప్పిన ఈ పద్యంతో ఈ చిరువ్యాసాన్ని ముగిస్తున్నాను.

రాళ్ళపల్లిలోన రాళ్ళెన్ని పుట్టెనో
రాళ్ళలోన వజ్జరాలు పుట్టె
వజ్జరాలలోన వలపెట్లు పుట్టెనో
కీర్తనీయ చరిత! కృష్ణశర్మ!

*

జనవరి 23 రాళ్లపల్లి వారి జయంతి.

[This re-edited essay first published on 27th January 2022. Featured image is from Interent.]

No comments:

Post a Comment