మహేంద్రనాధ గుప్త (మ) రామకృష్ణుల పంచన చేరిన తొలినాళ్లవి. ఒకరోజు సత్సంగం జరుగుతోంది. నరేంద్రుడు పాడుతున్నాడు –
మనసా చేయుము మాధవు ధ్యానము
నిత్యనిరంజను నిర్మలాత్ముని
ఎంత నిరుపమంబాతని తేజము
ఎంతమోహనంబాతని రూపము
ఎంత చేరువో ఎల్ల భక్తులకు
ఎంత ప్రియతముండతడో వారికి
విమలవికాసము చెందు ప్రేమలో
కోటిచంద్రనిభ తేరుగేరుచు
మెరపు తీగవలె మెరయు రూపప్రభ
గగురుపాటుతో గూర్చు సౌఖ్యమును.
‘మ’ రామకృష్ణులని గమనిస్తున్నాడు. పాట చివరిపాదాలు చెవిలో పడగానే రామకృష్ణుల ఉనికి మారిపోయింది. ఆయన మేను ఆపాదశీర్షం కంపించింది. గగుర్పాటు ఆ బ్రహ్మచారి శరీరం మీద వయారాలు పోయింది. దుఃఖాలయమైన సంసారం పాతాళానికి కుంగిపోయింది. ఆయన అనుభూతి బ్రహ్మానందం యొక్క నిర్వచనాన్ని క్రిందకి తొక్కింది. మనసులో వేయిరేకులుగా విచ్చుకున్న సమాధిపద్మపు నవ్వు ముఖం పైకి వద్దామని ప్రయత్నించింది. పెదవులు చిరునవ్వుతో విప్పారాయి. అంత ఆనందాన్ని అక్కడే పైకి చూపించలేక నొచ్చుకున్నట్లుగా ఆయన కళ్లు ధారాపాతంగా బాష్పాలని స్రవిస్తున్నాయి.
అదే సమాధిలో ఆయన్ను ‘మ’ మొదటిసారి చూడటం.
ఇదెందుకు చెప్పానంటే, మహానిమ్నమైన కాలస్వరూపమేదో స్మశానాలలో పీనుగుల మధ్య తిరిగే ఒక నల్లని ఆడుదానిలాగా మారడమేవిటి? తన మగడిని నేలన పడవేసి తొక్కడమేవిటి? పుర్రెల దండ మెడలో వేసుకోవడమేవిటి? ఆ స్త్రీ మనకి అమ్మ అవడమేవిటి? ఆమె పేరు తల్చుకున్న మాత్రం చేతనే కళ్లనీళ్లు పెట్టుకుని ఒక మనిషి పరమహంస కాగలడమేవిటి? భారతీయుడి లెక్క అంతే. దగ్గరకి వచ్చేవాడే దేవుడు.
శాక్తేయ సాహిత్యంలో సౌందర్యలహరి తరువాత అంత పరిపుష్టమైనది మూగవాడైన మూకకవి మాటగా వచ్చిన పంచశతి. ఈ మూకశంకరులు శ్రీవిద్యాప్రవర్తకులలో ఒకరైన దూర్వాసమహర్షి అంశట! పంచశతి కవులపై చూపిన ప్రభావం అంతాఇంతా కాదు. మూకపంచశతిని అనుకరిస్తూ వచ్చిన పిల్ల రచనలు ఎన్నో. ఇప్పటికీ చాలామందికి అమ్మవారిపైన ఒక శ్లోకం ఆర్యావృత్తంలో చెప్పవలెనంటే, ఆ మహానుభావుడి తోవలోకి తెలియకుండానే తోస్తుంది బుద్ధి. ఆ కృతిలో విభజనే ఒక చల్లదనం – ప్రతిపాదకమైన ఆర్యాశతకం,ప్రార్ధిస్తూ స్తుతిశతకం, చిరునవ్వు మీద మందస్మితశతకం, శరణాగతిపైన పాదారవిందశతకం,అనుగ్రహం మీద కటాక్షం శతకం. పంచశతి కవిత్వాన్ని నేను బేరీజు వేయలేను. ఆయన అనుప్రాసాలంకారశాస్త్రజ్ఞుడు. దీని గురించి మళ్లీ మాట్లాడతాను. విషయాంతరమౌతుంది.
అంతటి పంచశతి తరువాత శాక్తంలో పూర్వకవులైన వ్యాసుడినో, ఆదిశంకరులనో, మూకశంకరులనో అనుకరించకుండా కొత్తపుంత తొక్కిన రచన ఉమాసహస్రం. దీనిని వ్రాసింది కావ్యకంఠవాశిష్ఠ గణపతి ముని. ఈయన తెలుగువాడు. కారణజన్ముడు. ప్రాతఃస్మరణీయుడు, దేశభక్తుడు, దేవీ భక్తుడూను. ఆయన్ను నేను ఇలా నమస్కరించుకున్నాను.
జయతి స మహానుభావో
మంత్రాగమసాంద్రవిపినహర్యక్షః
మౌనమయూఖవిలుంఠిత-
సంసారః కావ్యకంఠవాసిష్ఠః
యెవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పవలసి వచ్చి, పెద్దమొత్తంలో ఉత్సుకతతో పాటు చెప్పేటంత అర్హతలేదన్న చిన్నతనం కూడా ఒకేసారి కలిగితే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. అయినా ప్రయత్నం చేస్తాను.
ఒక మనిషి తన జీవితంలో అందుకోగలిగే స్థాయిఎంత? ముట్టుకోగలిగే ఎత్తు ఎంత? అనుభవించగలిగే ఆనందమెంత? అందుకోసం మార్గాలు ఎన్ని? ఆ మార్గాలలో చేయవలసిన సాధన ఎంత? దానికి కావాల్సిన మనోబలమెంత? ఈ ప్రశ్నలు వేసుకుని సమాధానాలకోసం ప్రయత్నించి, లౌకిక సుఖాలని త్యజించి, తన పరపతికోసమో మోజులకోసమో జీవించకుండా భగవత్సుఖాన్ని తాను పొంది, ఇతరులకి పంచిపెట్టిన ఒక తెలుగువాడు ఈ దేశంలో బ్రతికాడు. ఆయన పేరు అయ్యలసోమయాజుల సూర్య గణపతి శాస్త్రి. స్థిరపడిన పేరు కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని.
మనసులో శారీరిక సుఖాలమీద తీరని మోజు ఉండి కూడా, పైకి డాంబికం ప్రదర్శిస్తూ భగవంతుడిమీదా, తత్వం మీదా గంటలు గంటలు మాటలు ఊదే మనలాంటి మనుషులున్న లోకంలో తాను విద్యావంతుడై ఉండి, రాజసత్కారాలూ పట్టుజరీ శాలువాలతో సన్మానాలూ చేయించుకోగల సత్తా ఉండీ, యెవరో ముక్కూ మొహం తెలియని థామస్ హారిస్ అనే ప్రధానోపాధ్యాయుడి ప్రశ్నకి సమాధానంగా తన జీవితాన్నే తపస్సు కోసం అర్పించి, లైటు బల్బు కూడా లేని చీకటి గుహలలో ఆజీవితాంతం భగవంతుడి కోసం తపించిన వ్యక్తి ఆయన.
ఆయన పేరులోనే ఆయన వైశిష్ట్యమంతా ఉంది. ఆయన గణపతి శాస్త్రిగా జన్మించారు. ప్రతిభతో కావ్యకంఠుడైయారు. తపస్సు చేసి ముని అయ్యారు.
గణపతి శాస్త్రి 17-11-1878 వ తేదీ (బహుధాన్య నామ సంవత్సరం కార్తీక బహుళాష్టమి) న విశాఖపట్టణం మండలంలో బొబ్బిలికి ఆరు మైళ్ల దూరంలో ఉన్న కలువరాయి అన్న గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు నరసింహశాస్త్రి, తల్లిపేరు నరసమాంబ. భగవదనుగ్రహంతో పుట్టినా గణపతికి ఆరు సంవత్సరాల వరకూ మాట రాలేదు. ఒక రోజు నరసింహశాస్త్రి తెగించి చేసిన ఆయుర్వేద చికిత్స కారణంగా అడ్డుకట్ట తెగిన నదీ ప్రవాహంలాగా వాక్కు వెలికి వచ్చింది. ఆయనకి పదవ యేడాది వచ్చే సరికే కావ్యాలు, జ్యోతిష్యంలో కొత్త పద్ధతులను రచించే స్థాయికి ఆయన విద్యాభ్యాసం చేరుకుంది. ఆ వయసులోనే ఒక్క గంటలో ఆశువుగా ముప్పైనాలుగు శ్లోకాలతో పాండవధార్తరాష్ట్రసంభవమనే కావ్యాన్ని చెప్పారు. ఆయన పన్నెండవ ఏట బంధువుల ఒత్తిడితో విశాలాక్షి అనే అమ్మాయితో గణపతికి వివాహం జరిగింది. భార్యని ఉద్దేశించి ఆయన కాళిదాసు మేఘసందేశాన్ని అనుకరిస్తూ ‘భృంగ సందేశం’ అనే కావ్యాన్ని వ్రాశారు. కానీ కాళిదాసు కవిత్వంలో పోల్చినపుడు తక్కువగా తోచి దాన్ని చించివేశారు.
తరువాత తపస్సు చేద్దామనే కోరికతో కాశీకి వెళ్లారు. అక్కడి నుండి ప్రయాగ, నాసికా త్రయంబకం వంటి పట్టణాలని తిరిగారు. అక్కడ రామభావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి మొదటి అష్టావధానాన్ని చేశారు. అప్పటికి ఆయన వయస్సు సుమారు 19 సంవత్సరాలు.
1900 వ సంవత్సరం గణపతి శాస్త్రి గారి విజయాలలో కొత్త మలుపులు తిరిగిన సంవత్సరం. ఆ సంవత్సరం ఉగాదికి ఆయన అప్పటి శ్రీకాకుళం జిల్లా మందసా సంస్థానానికి వెళ్లారు. అక్కడ రెండవ అష్టావధానం చేయడంతో పాటుగా అక్కడి రాజగురువుని వాదంలో ఓడించారు. అప్పుడే నవద్వీపంలో విద్వత్పరీక్షలు జరుగుతున్నాయన్న వార్త వచ్చింది. రాజుగారు ప్రోత్సహించడంతో గణపతి ఆ పరీక్షలో పాల్గొనడానికి నవద్వీపానికి వెళ్లారు.
నవద్వీపంలో జరిగిన ఆ నాటి విద్వత్పరీక్షలో అంబికాదత్తుడనే మహాపండితుడు అధ్యక్షుడు. సభలోకి అడుగుపెడుతూనే గణపతి శాస్త్రి అతడ్ని ఉద్దేశించి, కోఽసౌ మహాశయః? (ఎవరీ మహాశయుడు) అని ప్రశ్నించాడట. దానికి ఆయన ఆశువుగా –
సత్వరకవితాసవితా గౌడోఽహం కశ్చిదంబికా దత్తః
( నేను గౌడ దేశానికి చెందినవాడను, ఆశుకవిత్వానికి తండ్రిని, నా పేరు అంబికాదత్తుడు)
అని శ్లోకంలోని సగం భాగంతో సమాధానమిచ్చాడు. దానికి వెంటనే గణపతి ముని,
గణపతిరితి కవికులపతిరతిదక్షో దాక్షిణాత్యోఽహమ్
( నేను గణపతిని. కవుకులానికి పతిని. సామర్ధ్యం కలవాడిని, దక్షిణభారతానికి చెందిన వాడిని)
అని ఆ శ్లోకాన్ని పూరించారు. అంతటితో ఆగక, భవాన్ దత్తః, అహంత్వౌరసః (నీవు దత్తుడివి, నేను సొంత కొడుకుని) అన్నారట!
తరువాత అంబికాదత్తుడు కొన్ని సమస్యలని ఇచ్చి గణపతి శాస్త్రిని పూరించమని అడిగాడు. ఆ సమస్యలని రసవంతంగా పూరించడంతో పాటుగా భారత కథని 18 శ్లోకాలలో ఆశువుగా చెప్పారు. ఆ సభ గణపతి యొక్క పాండిత్యానికీ, కవితాశక్తికీ, బుద్ధికుశలతకీ మెచ్చుకుని ఆయన్ను కావ్యకంఠ అనే బిరుదుతో సత్కరించింది.
ఆ బిరుదుతో గణపతిశాస్త్రికి ప్రదానం చేసిన శ్లోకమిది-
ప్రాచీనైస్తైః కవికులవరైః కాలిదాసాదిభిర్యా
లబ్ధా కీర్తిః భవదనుగతా సైవ భూయాదిదానీమ్।
సాభిర్దత్తోయ ఇహ రుచిరః కావ్యకంఠోపహారః
తేన శ్రీమాన్ ఇహ భువి భవాన్ ఉజ్జ్వలశ్చాపి భాయాత్॥
(ప్రాచీనులైన కాలిదాసాది కవుల చేత ఏ కీర్తి అయితే పొందబడిందో, అదే కీర్తి ఇప్పుడు మిమ్ములను అనుసరించి వచ్చింది. ఇక్కడి విద్వాంసులచేత నీకీయబడిన ఈ కావ్యకంఠ బిరుదు చేత నీవు ఈ భూమి మీద ఉజ్జ్వలంగా ప్రకాశించాలి గాక. గమనిక- నేను పైన ఇచ్చిన లంకెలో ఈ శ్లోకపాఠం దోషాలతో ఉంది).
ఆ కాలంలో ఈ సత్కారం పొందిన తెలుగువాడు ఈయన మాత్రమే.
తరువాత గణపతి శాస్త్రి కేవలం ఒక ఏడాదిలో వేదాధ్యయనాన్ని ముగించి, సాయణాచార్యుల భాష్యాన్ని అధ్యయనం చేశారు. అంతేకాదు, ఆయుర్వేదం, జ్యోతిష్యం, వేదాంతం వంటి ఎన్నో శాస్త్రాలని సాంగోపాగంగా అతి తక్కువ సమయంలో కరతలామలకం చేసుకున్నారు.
తరువాత అరుణాచలానికి వచ్చిన ఆయన పొట్టకూటికోసం ఎవరిమీదో ఆధారపడటం కంటే భగవంతుడ్ని ప్రార్ధించడం మేలని శివుని మీద వేయి శ్లోకాలతో హరసహస్రాన్ని వ్రాశారు. ఆ రచన పూర్తి అయిన తరువాత శివుడి అనుగ్రహం తనపైన కలుగలేదని ఆ రచననీ గణపతి ముని చింపి వేశారు. రామస్వామి అనే శిష్యుడు ఈ హరసహస్రాన్ని తనకోసం వ్రాసుకున్నాడు కానీ అతడు ఆకస్మికంగా మరణించడంతో ఆ ప్రతి దొరకలేదు.
ఈయన వందకి పైగా రచనలు చేశారు.
- 1910-1912 సంవత్సరాలలో ఆయన చెన్నైలో ఉన్నప్పుడు అక్కడి పీఠాధిపతులు ఆయనకి చేసిన సత్కారసభలో అప్పటికప్పుడే ఆశువుగా తత్వఘంటాశతకాన్ని చెప్పారు. అందులో ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత సిద్ధాంతాల సారం ఉంది. ఇది వేదాంతంలో ప్రసిద్ధి చెందిన రచన.
- గోకర్ణములో జ్యోతిష్యంలోని సూత్రాలతో లఘుసంహిత అనే గ్రంథాన్ని వ్రాశారు. దీనిని ఇప్పటికీ అక్కడి జ్యోతిష్యపండితులు పొగుడుతూ ఉంటారట!
- ఋగ్వేదం మీద ఎవరూ చేయని విధంగా పరిశోధన చేసి రచించిన ఋగ్వేద సంహిత
- దైవరాతుడనే శిష్యుడు తపస్సమాధిలో కూర్చుని చెప్పిన 428 మంత్రాలని ‘ఛందో దర్శనమ్’ అనే పేరుమీద సంకలనం చేశారు. దానికి ‘వాసిష్ఠాన్వయ భాష్యము’ అన్న పేరుతో వ్యాఖ్యానం కూడా రచించారు. ఇది ఇంగ్లీషులోకి కూడా అనువాదమయ్యింది.
- 475 శాక్తేయ సూత్రాలతో దశమహావిద్యలపైన రచన
- రమణ మహర్షి ఉపదేశాలను చెబుతూ 300 శ్లోకాలతో రచించిన రమణగీత
- 20 రోజులలో దీక్షలో కూర్చుని 700 ల శ్లోకాలతో చేసిన ఇంద్రాణీ సప్తశతి
- వేదంలో ఇంద్రుడి నామాలని ఏరి కూర్చిన ఇంద్రసహస్రనామం. దీనికి భాష్యం కూడా రచించినట్లు చెబుతారు.
- సంస్కృత భాష గొప్పదనాన్ని చెబుతూ వ్రాసిన ‘లాలి భాషోపదేశః’
వంటి అనిదంపూర్వమైన రచనలు ఆయన కలం నుండి జాలువారాయి. వీటిని ఆశువుగా చెప్పడం ఒక ఎత్తైతే, పరిపూర్ణమైన కావ్యగుణాలతో చెప్పడం మరొక ఎత్తు. ఇంత విస్తారమైన వాఙ్మయంలో వ్యర్థమైన అక్షరం ఒకటి కనపడదు. ఇంతకు మునుపున్న పద్ధతిని అనుకరించడం గానీ, ప్రసంగవశంగా కూడా చెప్పిందే చెప్పడం కానీ ఉండదు. ఏ రచనకి ఆ రచన ఒక్కొక కలికితురాయిలాగా విలువైనది. అరుదైనది.
ఈయన తన చివరి నిముషం వరకూ రెండు గొప్ప కోరికలతో బ్రతికారు. ఒకటి తపస్సు చేయాలని. రెండు భారతదేశం ఉద్ధరింపబడాలని. తపస్సులో ఈయన అందుకొన్న ఎత్తులు సామాన్యమైనవి కావు. పరమశివుడి అనుగ్రహాన్నీ, అమ్మవారి కరుణనీ పొందారు. ఆధ్యాత్మికమైన అనుభవాలెన్నో అందుకొన్నారు.
పండితసభలలో చప్పట్లూ, సన్మానాలూ, గౌరవాలూ పొంది కూడా ఎక్కువ కాలం అరుణాచలంలోని గుహలలోనూ ఆశ్రమాలలోనూ; తీర్థయాత్రలు చేస్తూ గుళ్లూ గోపురాలలోనే గడిపారు. ఎంతో మందికి ఆధ్యాత్మికమార్గంవైపుకి త్రోవని చూపారు. అత్యంత నిరాడంబరంగా అచ్చమైన యోగి లాగా, సన్యాసి లాగా జీవించారు. పరివ్రాజకుడై భారతదేశమంతా పర్యటించారు. తాను తిరిగిన ప్రతిచోటులోనూ తన గురువైన రమణమహర్షి యొక్క ఔన్నత్యాన్ని అందరిలోనూ వ్యాపింపచేశారు.
అధ్యాత్మిక గురువుగా దేశమంతటా పేరు సంపాదించి కూడా ఏనాడూ ఒక్క దమ్మిడీ ఆశించలేదు. మఠాలూ, చందాలూ అంటూ ఏ ఒక్కరినీ చేయి చాచి అడుగలేదు. ఈయనకు తపస్సు ఫలితంగా స్వర్ణసిద్ధి కలిగింది. ఇది ఒక వస్తువుని బంగారంగా మార్చే మహిమ. రామారావు అనే గణపతి ముని అనుచరుడు ఆయనకు తినడానికి ఒక ఆపిల్ తో పాటుగా ఒక కాయిన్ ను ఆయనకి తెలియకుండా ఇచ్చాడట. అది బంగారంగా మారిన తరువాత ముని గమనించి, ‘ఛీ! పిశాచీ’ అంటూ దాన్ని మురికి గుంటలోకి విసిరేశారట!
గణపతి మునికి భగవంతుడంటే ఎంత ప్రేమో దేశమన్నా అంతే ప్రేమ. ఒకరోజు రంగయ్య నాయుడనే ఒక శిష్యుడు ఎప్పుడూ పరధ్యానంగా ఉన్న గణపతిమునిని చూసి, ‘దేని గురించి ఇంత దీర్ఘంగా ధ్యానిస్తున్నారు? అని ప్రశ్నిస్తే దానికి ముని, ‘దశాం దేశస్యైతాం ప్రతిపదమయం ధ్యాయతి జనః’ (ఈ దేశం యొక్క పరిస్థితిని గురించే దీర్ఘంగా ఈ జనుడు ధ్యానిస్తున్నాడు) అన్నారట!
ఈ దేశ భవిష్యత్తు గురించి ముని తీవ్రంగా తపన పడ్డారు. ఇక్కడి మూఢాచారలనీ, అధర్మాన్నీ కఠినమైన ధోరణిలో తన ఉపన్యాసాల ద్వారా ఖండించారు. వేదం, సంప్రదాయం , శాస్త్రం అనే వాటిలో కాలానుగుణంగా ఏవి ఎలా మార్పు చెందాలో ఆయన వివరణాత్మకంగా ఉద్ఘాటించారు. ఆయన మాట్లాడిన ప్రసంగాలలో కొన్ని-
- 1923 డిసెంబరు లో జరిగిన సభలలో స్త్రీహక్కుల మీదా, అస్పృశ్యతానివారణలమీదా వేదశాస్త్రప్రమాణికంగా ప్రసంగాలు చేశారు.
- 1914లో తనకి ఇష్టం లేకపోయినా దేశంకోసం ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడైయారు. ఆ సంవత్సరం డిసెంబరులో బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో అస్పృశ్యతానివారణం శాస్త్రసమ్మతమే అని సంస్కృతంలో ఉపన్యాసం ఇచ్చారు.
- 1925 నవంబరు లో బందరు లో సనాతనధర్మంలోని సంస్కరణలమీద ప్రబోధించారు.
- 1927 డిసెంబరులో చెన్నైలోని హిందూ హైస్కూలు లో జరిగిన మహాసభలో అస్పృశ్యతానివారణ పైన సంస్కృతంలో మహోపన్యాసం చేశారు.
ఇంద్రాణీ సప్తశతిలో గణపతి ముని తన లక్ష్యాలని ఈ విధంగా చెప్పుకొన్నారు –
స్వాతంత్ర్యం వనితానాం త్రాతుం మాతరధీశే
దూరీకర్తుమపారం దైన్యం పంచమజాతేఃధర్మవ్యాజమధర్మం భూలోకే పరిహర్తుం
వేదార్థే చ గభీరే సందేహానపి హర్తుంఘోరం వర్ణవిభేదం కర్తుం చ స్మృతిశేష-
ముల్లాసం మతిశక్త్యోర్మహ్యం దేహి మహాంతమ్
(స్త్రీల స్వతంత్రతని రక్షించడానికీ, పంచమజాతి దైన్యాన్ని పోగొట్టడానికీ, అధర్మాన్ని పారద్రోలడానికీ, వేదము యొక్క లోతైన అర్ధాలని అందించి, అందులోని సందేహాలని తీర్చడానికీ, కులభేదాలని పోగొట్టడానికీ, ఓ అమ్మా! నా బుద్ధికి గొప్పదైన శక్తిని ప్రసాదించు!)
ఇటువంటి ఒక మనిషి, అందులోనూ తెలుగువాడు ఈ దేశంలో నడయాడాడు.
ఉమాసహస్రాన్ని కేవలం 20 రోజులలో దీక్షలో కూర్చుని వ్రాశారట ఈయన. కవిత్వం వాసనవల్ల రావచ్చు. విలక్షణత ప్రతిభ వలన ఏర్పడవచ్చు. పాండిత్యం పరిశ్రమ వల్ల కలుగవచ్చు. కానీ భక్తికి పుణ్యాలు పుచ్చాలి. వీటిలో ఒకటి కుదరటమే విరలమైతే అన్నీ కుదిరినవాడు గణపతి ముని. నీలకంఠదీక్షితుల తరువాత విద్వత్తులో ఇన్ని గుణాలూ పొందినది ఈయనే. ఎన్నో దైవానుభూతులను పొంది సిద్ధపురుషుడు కూడా అయి, దీక్షితులనూ మించిపోయారని చెప్పాలి అనిపిస్తుంది నాకు.
ఈ ఉమాసహస్రం శిల్పం మీదనే ఎంతో మాట్లాడవచ్చును. దీనిమీద సంస్కృతంలో ఒక పేపరు వ్రాశాను నేను ఒక పత్రిక కోసం. అది ఎందుకో ముద్రణకి నోచుకోలేదు. అదలా ఉంచితే, వేయి శ్లోకాలు ఈ రచనలో స్తబకాలుగా విభజించబడ్డాయి. వేదరహస్యాల దగ్గరనుండి, ఉపాసనారహస్యాల దాకా విషయాలు అనేకం. శక్తి స్త్రోత్రాలకి ప్రసిద్ధమైన ఆర్య, శార్దూలం, స్రగ్ధర, మహాతరుణీదయితం, శిఖరిణీ ఇత్యాది వృత్తాలు ఈయన అతి తక్కువగా ఉపయోగించారు. పేరు కూడా తెలీని వృత్తాలని తీసుకుని, వాటి ప్రస్తారాలని అమ్మతో నింపి వాటిజన్మకీ ధన్యత చేకూర్చారు. ఆయన కవనధార ద్యోగంగ. భావాలు అమృతభాండాలు.భక్త్యావేశాలైతే జీవనదులు.
అందులో ఆయన ఎక్కువగా వర్ణించింది అమ్మవారి నవ్వునే. ప్రతీ స్తబకమూ హాసస్తుతితోనే మొదలవుతుంది. ఒక స్తబకం అయితే ప్రధానంగా నవ్వుపయినే ఉంది.
వాటిలో కొన్ని –
1
సహాదరేణ యో వలక్షపారిజాతమాలయా
గళస్థలీవిభూషయా ధ్వనిం వినైవ భాషతే ।
మహేశపుణ్యయోషితో మనోజ్ఞహాస ఏష మే
విభూతయే ప్రకల్పతాం విధూతయే చ పాప్మనామ్ ॥
అమ్మ మెడలో తెలతెల్లని పారిజాతమాల ఉన్నదట. ఆ మాలతోటి అమ్మ నవ్వు ధ్వని లేకుండానే మౌనసల్లాపాలు సలుపుతోందట! మాటలు కలపడానికి సమానహృదయం కావాలి కదా. పూవు వికసనంతోటి అమ్మనవ్వు సమమైందని చెప్పడం ఒకటి, అంత సహజమైనదనీ, శుద్ధమైనదనీ, సుకుమారమైనదనీ చెప్పడం రెండు. అంతే కాదు,ఆ మనోజ్ఞహాసంలో ధ్వనిం వినైవ – శబ్దం లేదట. స్త్రీ నవ్వుకి శబ్దం లేకున్నప్పుడే అందం. అమ్మవారు సహజంగా స్త్రీస్వభావజనితమైన ధ్వనిలేని నవ్వు కలిగిఉంది. అంతే కాదు, వికసించిన పూవుతో మాట్లాడుతుందంటే, ఆ సృష్టి రహస్యం తనకే తెలిసినదనీ, ఆమె నవ్వే విశ్వవికసనమనీ భావం. అటువంటి అమ్మనవ్వు మనకి సంపదలని కలిగించి, పాపాలని కడిగివేయుగాక.
2
శుభ్రస్మితలేశో మాతుర్మరుతాన్నః।
అన్తస్తిమిరాణామన్తం విదధాతు ॥
దేవతల తల్లి అయిన జగదంబ యొక్క చిరునవ్వు, మనలోని చీకటులను తొలగించుగాక!
క్లుప్తమైనా ఎంత గాఢత ఉన్న భావం ఇది! అమ్మ నవ్వు చీకటులను తొలగించడమంటే కాంతివంతమైనదని అర్ధం పైకి ప్రస్ఫుటమౌతున్నా, అమ్మ నవ్వు దయాజ్ఞానసమ్మిలితమైన హృదయంలోనుండి వచ్చినది కనుక ఆ నవ్వు అజ్ఞానమనే చీకట్లని తొలగించాలని అంతరార్ధం. చీకటి ఉన్న గదిలో వెలుగు ప్రసరించగానే, చీకటి వెలుతురులో ఎలా ఐక్యమౌతుందో, అలాగే మన హృదయంలోని చీకటిని అమ్మ నవ్వు తనలో కలుపుకుని, తాను అంతటా నిండాలి.
ఈ ఛందస్సు పేరు ‘తనుమధ్యా’. ఇదీ అమ్మవారి పేరే. అంతః, అంతం – సొగసైన అనుప్రాస.
3
శ్రీకణ్ఠచర్చామివ కల్పయన్తో ముహుః కపోలేషు సఖీజనస్య ।
శ్రీకణ్ఠకాన్తాహసితాంకురాణాం శ్రీమన్తి కుర్వన్తు జగన్తి భాసః॥
తన సకియల గండుచెక్కులపైన చందనపు పూత పూస్తున్నాయా అన్నట్లున్న శివాని చిరునవ్వులు జగత్తుని మంగళకరమైన కాంతులతో నింపుగాక!
ఆవిడ ‘రేమే ముహుర్మధ్యగతా సఖీనాం’ (కుమా) కదా! సఖులతో కూడుకుని ఉండటం తనకి ఇష్టమైన పని. అప్పుడు ఆమె సన్నగా నవ్వుతుంటే ఆ నవ్వు సఖీజనుల కపోలాలపైన చందనపు పూతలా ఉందట. ఇదేమి పోలిక? అమ్మవారినవ్వు కాంతి పచ్చగా ఉంటుందా అని ప్రశ్న. ఇది వక్కాణింపు కాదు, ఉత్ప్రేక్ష అని సమాధానం. ‘ఇవ’ అన్న ప్రయోగం అందుకోసమే. చందనలేపనంలో అహ్లాదం, తన్మయత్వం, చల్లదనం, మన్నన, అలంకారం – ఈ ధర్మాలు ఉన్నాయి. ఒక వస్తువుతో వేరే వస్తువుకు అన్యధర్మనిమిత్తంగా తాదాత్మ్యం చూపిస్తే అది ఊహ అవుతుంది. ఆ ధర్మప్రేరకమైనదే అమ్మవారి నవ్వు. అంతే కానీ రంగుని బయటపెట్టే పోలిక కాదు ఇక్కడ ముని చేసింది.
శ్రీకంఠచర్చాం, శ్రీకంఠకాంతా; శ్రీమన్తి, కుర్వంతు,జగన్తి – లయని పట్టుకోవడమంటే ఇదే.
హసితాంకుర – నవ్వు మొగ్గలు. తీయనైన ఊహ.
4
చన్ద్రాతపః కశ్చన సంప్రసన్నో
మహేశనేత్రాతిథితర్పణో నః।
మనోభిలాషం సఫలీకరోతు
మహేశ్వరీ హాసలవప్రకాశః ॥
శివుడి కన్నులనే అతిథులని తృప్తిపరిచే ప్రసన్నమైనవీ, వెన్నెలవంటివీ అయిన మహేశ్వరి చిరునవ్వులు మన కోరికలు నెరవేర్చుగాక!
న తిథిః అతిథిః అని. అంటే తెలియకుండా ఇంటికి వచ్చేవాడు. ఇక్కడ అమ్మవారి నవ్వింటికి శివుడి కళ్లు అతిథులట! అంటే చెప్పి రావు. ఎప్పుడు వస్తాయో అన్న తెలివి ఉండదు. ఎప్పుడు వచ్చినా ఆమె నవ్వు వాటికి తృప్తిని చేకూరుస్తుందట. అంటే ఆమెనవ్వు అప్పుడప్పుడు వచ్చేదో, తెచ్చిపెట్టుకున్నదో కాదు. ఆహ్లాదాంతరంగం నుంచి పైకి పూసిన పూవు. అలాగని మారిపోయేదా? మాటిమాటికీ వస్తున్నా శివహృదయాన్ని అమృతంతో నింపే నవ్వు అది. ‘క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః’ అని కదా మాఘుడన్నది. అదే వెన్నెల. చల్లదనం.
కడుపు నిండిపోయే ఊహ ఇది.
మనోభిలాష – తెలుగువాడి సంస్కృతం. చంద్రాతపం – చంద్రుడి ఎండ; వెన్నెల.
5
కుర్వంతు కామం సఫలం మదీయం
కులాద్రికన్యాహసితాని తాని।
యేషాం మయూఖైః క్రియతే సితాద్రే
రుద్యానవాటీషు నవోవసన్తః ॥
ఏ తల్లి నవ్వు జిగులు హిమాచలప్రాంతపు ఉద్యానవనాలలో వసంతాన్ని చేస్తున్నాయో ఆ హిమవత్పర్వతపుత్రి నవ్వులు నా కోరికలని సఫలం గావించుగాత!
ఏమి ఊహ ఇది! ఇక్కడ అందం – క్రియతే అన్న ప్రయోగం. ఆ నవ్వుల చేత నవవసంతం చేయబడుతున్నదట! అంటే వసంతాన్ని తయారుచేయగలిగిన అమృతత్వం అమ్మ నవ్వులో ఉందన్నమాట. ఇది పరిణామాలంకారం.
జగత్తులో మనోహరమైన వస్తువులకు ఆమె నవ్వే కారకము కదా!
6
ఆమ్రేడితం భూషణచన్ద్రభాసాం
నాసావిభూషమహసాం ద్విరుక్తిః।
పురారినారీ స్మితకాన్తయో మే
పూర్ణాని కుర్వన్తు సమీహితాని ॥
అమ్మవారి నవ్వుకాంతులు శిరస్సుపైన కొలువైన చంద్రుడి కాంతికి ఆమ్రేడితం లాగా ఉన్నాయట. ముక్కుపుడక కాంతులకి ద్విరుక్తిలాగా ఉన్నాయట. అటువంటి నవ్వులు నా అభీష్టములని తీర్చుగాక అని.
ఆమ్రేడితమంటే – రెండుమూడు మార్లు చెప్పడం అని ఒకటి, రెట్టించడమని రెండు అర్ధాలు. ద్విరుక్తి అంటే రెండుసార్లు చెప్పడం. ఈ కల్పనాశక్తి మహాకవికి గానీ ఉండదు. చంద్రుడూ, నాసాభరణం రెండూ ఆవిడకి అలంకారాలే. ఆ చంద్రుడి పరిస్థితి వర్ణనాతీతం. ఇందులోనే గణపతిముని అంటారొకచోట, అమ్మవారు తనతప్పేమీ లేకుండా పూర్ణచంద్రుడినే శిరసుపైకెత్తుకొన్నదట. కానీ ఆమె ముఖకాంతికి తనకాంతిని సరిపోల్చలేక శల్యమై,కేవలం రేఖామాత్రంగా మిగిలాడట ఆయన. పాపం! ఆ చంద్రుడి కాంతికన్నా, ముక్కుపుడక కాంతికన్నా అమ్మ నవ్వు గొప్పదే. అలాగని అమ్మని ఆశ్రయించినవాటిని తక్కువచేస్తే ఎలాగ? అందుకే సూటిగా గొప్పది అనకుండా ఈ వర్ణన. నవ్వు శోభని రెండవసారి చెబుతున్నది అంటే, మొదటిసారైనా ఆ జాబిలీ, ముక్కెరా చెప్పగలగటానికి కారణం అమ్మను ఆశ్రయించడమే అని ధ్వని.
పురారినారీ – శివుడి స్త్రీ. సమీహితము – కోరిక.
వర్ణన కాకపోయినా నవ్వుతో ఆ మహానుభావుడు చేసిన ఈ కల్పన చూడండి –
తవాతికాన్తా నయనాన్తవృత్తి-
ర్హాసః పురారేశ్చ నవేందుహారీ
ఉభౌ వివాహోత్సవ పూర్వరంగం
నిర్వర్తయామాసతురాదిరామే
ఓ ఆదిరామా (మొదటి వనితా)! అతి మనోహరమైన నీ కడకంటి చూపూ, వెన్నెలవంటిదైన శివుని నవ్వూ కలిసి మీ ఇద్దరి వివాహోత్సవానికి పూర్వరంగాన్ని(నిశ్చితార్ధం/పాణిగ్రహణమహోత్సవం) నిర్వహించాయమ్మా!
గుండెకి తాకే కల్పన ఇది. ఆదిదంపతులిద్దరూ కలవకముందు ఆవిడ కటాక్షమూ, ఈయన నవ్వూ కలుసుకున్నాయట! భాషాపరమైన సోకు ఇక్కడ – నయన+అంతవృత్తి అనేది స్త్రీలింగం. ఇది అమ్మవారివైపు. అలాగే హాసః పుంలింగం. ఇది అయ్యవారివైపు. ఆ రెండూ కలిసి అసలు పెళ్లికి పూర్వరంగాన్ని నిర్వహించాయట!
7
దిగ్వల్లీష్వతి శుభ్రం కుర్వన్తః కుసుమర్ధిమ్।
భూయాసుస్తవ భూత్యై మన్మాతుః స్మితలేశాః॥
దిక్కులనే తీగలలో శుభ్రమైన కుసుమాలను పూయిస్తున్న నా తల్లి యొక్క చిరునవ్వు మీకు సంపదలొసగుగాక.
ఇక్కడ కుసుమాలంటే పూలనే అర్ధమే చెప్పనక్కరలేదు. అందుకే దిక్కులే తీగగా చెప్పబడ్డాయి. భూమిలో జనిస్తున్న అహారం దగ్గరినుంచీ, ఓషధులు, వనరులు, ధాతువులు ఇత్యాది సర్వమూ దిక్కుల తీగలకి పూచే పూవులే. ఆ పూవులకి అమ్మవారి నవ్వే మూలమట. ఎంత విలక్షణమైన ఊహ ఇది!
ఈ వృత్తం పేరు మదలేఖ.
8
వాణీసరోరుహదృశో హయరాజహంసో
వక్త్రారవిన్దనిలయాద్బహిరాగతాయాః।
ఆలాపకాలదరహాస ఇహస్థితానాం
క్షేమం కరోతు సుతరాం హరసున్దరీ యః॥
అమ్మ మాట్లాడుతున్నది. మాట్లాడుతూ నవ్వుతున్నది. లేదా నవ్వుతూ మాట్లాడుతున్నది. ఆ మాట ఆవిడ ముఖారవిందం నుండి బయటకి వచ్చిన సరస్వతీదేవివలే ఉంటే, ఆ నవ్వు ఆ సరస్వతీ దేవి వాహనమైన రాజహంసలాగా ఉన్నదట. ఆ నవ్వు క్షేమకరమగుగాక అని.
ఇందులో ప్రతీపదమూ ఔచిత్యవంతమే. సరస్వతి పద్మాలయ. ఇక్కడకూడా అమ్మవారి ముఖమనే పద్మం నుండే ఆవిడ ఆవిష్కరింపబడుతోంది. నవ్వు కూడా మాటతోపాటుగానే ప్రయాణం సాగిస్తోంది. నవ్వుకీ రాజహంసకీ తెలుపు, స్వచ్ఛతా సమానధర్మాలు. అమ్మమాటలో సరస్వతి ఉందని చెప్పడం కాదు. అమ్మ మాటే సరస్వతి. నవ్వుని సరస్వతీదేవి వాహనం అనడం చేత ఆ చిరునవ్వు అమ్మ మాటని మోస్తోందని ధ్వని.
వాణీసరోరుహదృశః – సరస్వతీదేవి కూడా పద్మాక్షే.
సుతరామ్ – ఇది తెలుగు ‘సుతరామూ’ కాదు. మిక్కిలిగా అని అర్ధం.
హరసున్దరీ – ఆ అందగత్తె శివుడిది.
9
అన్తర్గతస్య హర్షక్షీరసముద్రస్య కశ్చనతరఙ్గః ।
హాసో హరహరిణదృశో గతపఙ్కం మమ కరోతు మనః॥
అమ్మ హృదయమనే ఆనందక్షీరసముద్రము యొక్క తరంగము వంటిదైన నవ్వు నా హృదయంలోని మలినాన్ని తొలగించుగాక.
తల్లి మనస్సు ఆనందకందం, శుద్ధస్వరూపం. ఆ మనస్సుయొక్క తరంగంలాగా పైకి వచ్చినదే ఆవిడ నవ్వు. అంతేకానీ పైపైన అతికించుకున్నది కాదు. అది తరంగం బురదని అవతలకి త్రోసినట్టు నా మనసులోని మాలిన్యాన్ని తొగత్రోయాలి. ఆవిడ మనసు శుద్ధమైనది. పాలసముద్రానికీ, మనసుకీ అది సమానధర్మం. నవ్వుకీ తరంగానికీ తెలుపూ, స్వచ్ఛతా సమానధర్మాలు.
హరహరిణదృశః – రమ్యమైన సమాసం. చూపులు లేడి చూపులలాగా ఉంటాయి కనుక ఆవిడ హరిణదృక్కు. ఆ చూపులెవరివి? హరుడివి.
కశ్చన తరంగః – ఒకానొక అనిర్వచనీయమైన అల.
గతపంకః – పాండితీప్రకర్షకమైన ప్రయోగం. పోగొట్టబడినబురద కలిగినది.
10
రుద్రాణీ దరహసితాన్యస్మాకం సంహరన్తు దురితాని।
యేషాముదయో దివసో భూషాపీయూష కిరణస్య ॥
ఏ చిరునవ్వు యొక్క పుట్టుక శిరసు పైన ఉన్న చంద్రుడికి పగలుని కలుగజేస్తున్నదో ఆ నవ్వు పాపాలని నాశనం చేయుగాక.
ఆ చంద్రుడు పీయూష కిరణుడు – అమృతమే కిరణాలుగా కలవాడు. ఆతడికే పగలు కలిగేలాగ చేస్తున్నదంటే ఆ అమ్మనవ్వు వాటికన్నా మహత్వం కలిగినదని ధ్వని. అదీ కేవలం దరహసితమే. కేవలం చిరునవ్వులకే చంద్రుడు నిలువలేకపోయాడనటం. చిరునవ్వు మహత్వమే చెప్పడంలో తల్లి స్త్రీత్వమూ ద్యోతకమవుతుంది. నవ్వు పాపాలని నాశనం చేయాలని కోరడంలో పాపాలని చీకటితో పోల్చడం ఉంది. రెండవ పాదంలో రమణీయమైన ‘ష’కార అనుప్రాస.
11
ఆలోకమాత్రతో యః శంకరమసమాస్త్రకింకరం చక్రే ।
అల్పోఽప్యనల్ప కర్మా హాసో నః పాతు స శివాయాః॥
ఏ చిరునవ్వునయితే కేవలం చూడటం చేతనే శివుడు మన్మథుడి కింకరునిగా మారాడో,ఆ శివాని నవ్వు మనలను రక్షించుగాక.
ఆ హాసం అల్పం. అంటే పూర్తి నవ్వూ కాదు. కేవలం దానిని చూడటం చేతనే శివుడు మోహింపబడ్డాడు. మన్మథుడి కింకరుడయ్యాడు అనడంలో ఎవరినైతే ముందు తానే దహించివేసాడో అతనికి కింకరుడు కావలసి వచ్చిందని. అందుచేత ఆ హాసము అనల్పకర్మా – చేసిన పని చాలా దొడ్డది.
అసమాస్త్రుడు – ఐదు అస్త్రాలు కలవాడు. మంచి ప్రయోగం.
అమ్మకి శివా అని శివసంబంధమైన విశేషణం వాడటంలో దాంపత్యాన్ని స్ఫురింపజేయడం ఉంది.
ఆలోకమాత్ర – కేవలం చూడటం చేతనే.
అల్ప-అనల్ప; శంకర-కింకర – మంచి లయ.
12
రదవాససా రథీ మాం శరీ కరైః పాతు పార్వతీహాసః।
పావకదృశం జిగీషోః పంచపృషత్కస్య సేనానీః॥
దంతాలని కప్పుతున్న క్రింది పెదవి అనే రథం కలిగి, కిరణములనే బాణాలు కలిగి శివుని జయించాలని కోరిక కలిగిన మన్మథుడికి సేనాపతి లాంటిదైన అమ్మవారి నవ్వు నన్ను రక్షించుగాక.
ఇది అమోఘమైన ఊహాబలం. అమ్మవారినవ్వు మన్మథుడి సేనాపతట. సేనాపతికి ఉండే రథమూ, బాణాలూ అమ్మవారి నవ్వుకీ ఉన్నాయని సమర్ధన. ఆ నవ్వుకి క్రిందిపెదవే రథం. కాంతులే బాణాలు.
రదవాసస్సు – దంతాలని కప్పునది; క్రిందిపెదవి. రథీ – రథము కలిగినది. శాబ్దిక చమత్కారం.
కరము – కిరణము, బాణము అని శ్లేష.
శరీ – శరములు కలిగినది.
పంచపృషత్కుడు – ఐదుబాణాలవాడు. పండితుడి ప్రయోగం.
పావకదృశుడు – అగ్నిని చూపుగాకలవాడు. లేదా అగ్నే చూపైన వాడు. మన్మథుడ్ని దగ్గరకి రానివ్వనన్న నిశ్చయంతో అగ్నిని ముందుపెట్టుకున్నవాడు. అయినా కృతకృత్యుడు కాలేకపోయాడని ధ్వని.
జిగీష – గెలవాలనే కోరిక.
13
అధరోష్ఠవేదికాయాం నాసాభరణాంశు శాబకైస్సాకం ।
కులమఖిలమవతు ఖేలన్నద్రిసుతా హాసబాలో నః॥
క్రిందిపెదవి అనే వేదికమీద ముక్కెర కాంతులనే చిన్నపిల్లలతోటి ఆడుతున్న అమ్మవారి నవ్వనే పిల్లవాడు మన వంశాలని కాపాడుగాక.
అమ్మవారి నవ్వు స్వల్పమైనది. చిన్నపిల్లాడిలాగా. ఆ పిల్లవానితో ఆటలాడే తోటిపిల్లలు అమ్మవారి ముక్కుపుడక కాంతులట. అవి ఆడుకునే వేదిక అమ్మవారి క్రిందపెదవట. భావం చాలదా దీనికి.
14
వ్యర్థీభూతే చూతే గతవతి పరిభూతిమసితజలజాతే
అనితే సిద్ధిమశోకే కమలేఽపి గలజ్జయశ్రీకే ।
బహుథా బిభేద హృదయం హరస్య బాణేన యేన సుమబాణః
తదుమా లీలాహసితం మల్లీసుమమస్తు మే భూత్యై ॥
శివుడిని జయించుదామని మన్మథుడు ఆయనపైన తన బాణాలని ప్రయోగిస్తున్నాడు. రసాలం వ్యర్థమయింది. నీలోత్పలం తిరస్కృతి పొందిది. అశోకం సిద్ధిని పొందలేపోయింది. కమలం జయాన్ని పొందలేకపోయింది. ఇక మిగిలింది మల్లిక. అమ్మవారి నవ్వే ఆ మల్లికా సుమమయి హరుడిని జయించిదట. అటువంటి నవ్వు నాకు వృద్ధిని చేకూర్చుగాక అని.
మన్మథుడి బాణాలైదు.
అరవిన్దమశోకం చ చూతం చ నవమల్లికా।
నీలోత్పలం చ పంచైతే పంచబాణస్య సాయకాః॥
పద్మము, మామిడి, అశోకం, మల్లిక, నల్లకలువ. వీటిని ఒక్కొకటిగా శివునిపైకి విసురుతున్నాడట మన్మథుడు. అన్నీ ఓడిపోతున్నాయి. చివరికి అమ్మవారి నవ్వే మల్లికాబాణమై శివుడి హృదయాన్ని భేదించిందట. మల్లికకూ, అమ్మవారి నవ్వుకూ తెల్లదనం సమానధర్మం. అది మిగిలిన పుష్పాలలో లేదు అనడం.
గలజ్జయశ్రీక – జారిపోతున్న జయలక్ష్మి కలిగిన. అందమైన సమాసం.
బహుధా బిభేద – చాలా రకాలుగా భేదించడం. మంచి ప్రయోగం. అమ్మవారి నవ్వు దెబ్బకి శివుని అవస్థని చెబుతూంది.
15
శర్వధైర్యగుణ శాతశస్త్రికా శమ్బరారిజయకేతుపట్టికా।
మన్దహాసకలికా మదాపదం పర్వతేన్ద్రదుహితుర్వ్యపోహతు ॥
శివుడి ధైర్యమనే గుణం పాలిటి వాడికత్తి, మన్మథుడి జయకేతనం అయిన అమ్మవారి చిరునవ్వు నా ఆపదని పోగొట్టుగాక.
శివుడిధైర్యమనే గుణాన్ని అమ్మవారి నవ్వు వాడి కత్తియై తూట్లుపొడుస్తున్నదట. మన్మథుడి జయకేతనమనడంలో నవ్వు వికసనపు ఆకృతి జెండా వలే ఉన్నదనటం.
పర్వతేన్ద్రదుహితా — హిమవంతుడి కూతురు.
వ్యపోహతు – నిరాకరించుగాక. మంచి క్రియాపదం
మన్దహాసకలిక – చిరునవ్వుమొగ్గ.
16
భవాంబుధిం తారయతాత్ భవన్తం
హాసోఽద్భుతః కుంజరవక్త్రమాతుః।
యో హన్తి బిమ్బాధరలంఘనేఽపి
వ్యక్తాలసత్వో హరితాం తమాంసి ॥
అమ్మవారి నవ్వు దొండపండులాంటి ఆమె క్రిందపెదవిని లంఘిస్తున్నదట. ఆ దాటుకి అలసిపోయిందా అన్నట్లుగా స్వల్పంగానే వ్యక్తమవుతున్నదట. ఉత్తమస్త్రీలక్షణమైన మందహాసమే ఆమె నవ్వు అనడం. అంత అలసటతో ఉన్నా, దిక్కులలోని చీకట్లని తొలగించడంలో ఏమాత్రమూ తగ్గట్లేదట! ఈ విచిత్రాన్ని చెప్పడం కోసమే ‘అద్భుత’ ప్రయోగం. అటువంటి నవ్వు సంసారసాగరాన్ని దాటించుగాక అని.
17
ఆగమవిన్మతికైరవిణీనాం బోధమజస్రమసౌ విదధానః।
పాతుమహేశవధూవదనాంశో హాసశశీ సకలాని కులాని।।
ఆగమాలని నేర్చిన బుద్ధులనే కలువపూలకు ఎప్పుడూ బోధనీ వికాసాన్నీ కలిగించే అమ్మవారి నవ్వుచంద్రుడు మన వంశాలని కాపాడుగాక.
కైరవిణి – తెల్లకలువల గుంపు. మంచి పదం.
సకలాని కులాని – లేతైన అనుప్రాస. ఛందస్సు బోధకవృత్తం.
18
అన్తర్వలక్షపరిధిభ్రమమాదధానో
వక్త్రస్య పూర్ణతుహినద్యుతి మండలస్య।
హాసః కరోతు భవతాం పరమం ప్రమోదం
శుద్ధాన్తపంకజదృశః ప్రమథేశ్వరస్య ॥
ప్రమథాధిపతి అయిన శివుడి హృదయకమలానికి పూర్ణచంద్రుడివంటి అమ్మవారిముఖం చుట్టూతా పరివేషంలాగా ఉన్న అమ్మవారి నవ్వు మీకు మోదాన్ని కలుగజేయుగాక.
చంద్రుడు గుడికట్టడం మనకి తెలిసినదే. అమ్మవారి నవ్వు ఆ ముఖచంద్రమండలం చుట్టూ పరివేషంలా ఉన్నదనడం గొప్ప ఊహ. అమ్మవారి ప్రసన్నతని చెబుతూంది.వృత్తం వసంతతిలక.
19
ఉద్దీపయతు నశ్శక్తిమాదిశక్తేర్దరస్మితమ్।
తత్త్వం యస్య మహత్సూక్ష్మమానన్దోవేతి సంశయః॥
ఏ నవ్వు యొక్క తత్వం మహాసూక్ష్మమా లేదా ఆనందమా అని మాకు సంశయమవుతున్నదో ఆ ఆదిశక్తి యొక్క చిరునవ్వు మనలోని శక్తిని ఉద్దీపింపజేయుగాక.
ఇది తాత్వికమైన శ్లోకం. అమ్మవారి నవ్వు పట్టుకోలేని సూక్ష్మమైనదా లేదా మనస్సు యొక్క పొంగు అయిన ఆనందం వంటిదా? అజ్ఞానమనే చీకటిని పోగొట్టేది కనుక జ్యోతి వంటిదా లేదా దుఃఖాన్ని పోగొడుతుంది కాబట్టి ఆనందమయమా అన్న సంశయమౌతున్నదంటున్నారు ముని. ఇక్కడ సంశయమంటే అర్ధంచేసుకోలేని మాంద్యమా అని ప్రశ్న. శ్లోకంలో ప్రతిపాదించిన రెండు పరస్పరవ్యతిరేకమైన విషయాలూ ఆ నవ్వుని ప్రతిపాదించేవే అవటం చేత కేవలం ఒకదానిగానే నిర్వచించలేకపోవడమని సమాధానం.అనుష్టుప్ఛందము.
20
దూరీకురుతాద్దుఃఖం నిఖిలం దుర్గాయాస్తద్దరహసితం నః।
రచితాస్యామ్భోమృద్భ్యాం యదభూల్లేపనమమలం బ్రహ్మాండస్య॥
నీటితోనూ, మట్టితోనూ నిర్మితమైన ఈ బ్రహ్మాండానికి ఒక పూతలాగా అయిన అమ్మవారి చిరునవ్వు మనకి దుఃఖాలని దూరంగా జరుపుగాక.
నీటినీ, మట్టినీ ఉటంకించడం చేత ఈ బ్రహ్మాండాన్ని ఒక కుండతో పోల్చినట్లయింది. దానికి అమలమైన లేపనంలాగా అమ్మవారి నవ్వు ఉన్నది అంటే, ఆ బ్రహ్మాండభాండం కేవలం జడమైనది. అందులో చైతన్యలేపనం అమ్మవారి నవ్వే. కుండ చేయడంలో మట్టి, నీటితో పాటు తేజస్సు కూడా అవసరమే కనుక ఆ తేజశ్శక్తి అమ్మవారి నవ్వేననీ భావం.
**
[Original essay was first published on June 19 , 2019. Featured image taken from Google. Older blog post archived here. ]
No comments:
Post a Comment