Friday, 3 January 2025

పదిలక్షలు

 
మా ఇంట్లో కొన్ని ముందు పేజీలూ, కొన్ని వెనకపేజీలూ పోయినటువంటి ప్రతాపరుద్రీయమనే ఒక తెలుగు నాటకం పాత ప్రతి ఒకటి ఉంది. చిన్నతనంలో ఆ పుస్తకాన్ని చదివినపుడు, ద్వితీయాంకంలో వచ్చిన విద్యానాథుడి పాత్ర నా మనసులో ముద్రించుకునిపోయింది. అందులో ముస్లిం రాజుల చెంత బందీగా ఉన్న ప్రతాపరుద్రుడికి అనుకోకుండా విద్యానాథుడు తారసపడి అతడెవరో తెలీయకుండా ప్రతాపరుద్రుడిమీద వ్రాసిన తన కావ్యాన్ని అతనికే వినిపించడమూ, అది విని ఉప్పొంగిన ప్రతాపరుద్రుడు అతడికి ఒక ఉంగరాన్ని ఇవ్వడమూ, దానిమీద "ప్రతాపరుద్రమహారాజు" అన్న ముద్రను చూసి, మహరాజును గుర్తుపట్టి, ఆశువుగా విద్యానాథుడు పద్యాలు చెప్పడమూ ఒక అందమైన సన్నివేశం. (ఈ నాటకాన్ని వ్రాసింది సోమరాజు రామానుజరావు గారు. ఆర్కైవులో అందుబాటులో ఉంది)

కాకలుతీరిన కాకతీయవీరులను తల్చుకుని, ఆ తెలుగుజాతి వైభవాన్ని గుర్తుచేసుకుని, పులకించని తెలుగు మేను ఉండదు. మెత్తబడని తెలుగు గుండె ఉండదు. ఏకశిలాతోరణంపై మహాకవి శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు వ్రాసిన ఈ పద్యం ఇప్పుడు నా మదిలో మెదులుతోంది -

సీ.

ఏకశిలా మహాప్రాకారరక్షణ శ్రీకార మంత్రమై చెలఁగు దీక్ష
మ్లేచ్ఛవాహినులను మేదింప గణపతిదేవుండు దూసిన తెలుఁగు కత్తి
రణముల సురతాణి గణముల గుణమూడ్చు రాణిరుద్రమదేవి పాణిశక్తి
జాయప సేనాని సాయించు ధీమించు భరతవిద్యాప్రౌఢభావగరిమ

పాడుకొందును గళమెత్తి పాటవింప
"కాఁక" లేని "తీయఁ"దనము గండరించు
కాకతీయాంధ్రసామ్రాజ్య కమ్రకీర్తి
తోరణముఁ గాంచి, పులకించి, దోయిలించి!

శివుడి ప్రమథగణాలలో ప్రధానదేవతలెవరో తెలుగునేలను చూసి మురిసి, దానిని ఏలుదామన్న కోరికతో కైలాసం నుండి తరలి వచ్చారేమో అనిపించిన అటువంటి ఆ కాకతీయచక్రవర్తుల యుగంలో రుద్రమదేవి తరువాత సింహాసనాన్ని ఎక్కిన ప్రతాపరుద్రుడి కాలం నాటివాడు విద్యానాథుడనే లాక్షణికకవి. ప్రతాపరుద్రుడు కాకతీయవంశపు మహావీరుడే కాదు, విద్యావేత్త అని కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి. అమరుకశతకానికి రుద్రమదేవకుమారుడని ఒకని వ్యాఖ్య కనపడుతోంది. ఇది ప్రతాపరుద్రుడి రచనే అని కొంతమంది మాట. బద్దెన వ్రాసిన నీతిశాస్త్రముక్తావళి అనే రచనకు మూలం ప్రతాపరుద్రుడి సంస్కృతరచన అయిన నీతిసారమని అంటారు. సరస్వతీ విలాసమ్ అని ఒక సంస్కృత రచన ప్రతాపరుద్రమహారాజు పేరు మీద కనబడుతుంది గానీ ఆ ప్రతాపరుద్రుడు వేరు.

ప్రతాపరుద్రుడి ఆస్థానంలో రెండువందల మంది కవులుండేవారట! పండితులకు లెక్కే లేదు. అప్పయార్యుడనే జైనకవి దగ్గరనుండీ, విద్యానాథుడు, శాకల్యమల్లుడు (ఈయన మల్లినాథుడి పూర్వుడు), విశ్వనాథుడు మొదలైన కవులూ; మనుమగన్నయ్య, గుండయ్యభట్టు, అఘోరశైవాచార్యులు వంటి మహాపండితులూ శాస్త్రకారులూ ప్రతాపరుద్రుడి మూలాన బ్రతికారు. శాఖవెల్లి మల్లికార్జునుడు, కృష్ణమాచార్యులు వంటి సిద్ధభక్తులకూ ప్రతాపరుద్రుడు ఆలవాలమైయాడు.

అటువంటి ప్రతాపరుద్రుడిని ప్రధాన వస్తువుగా చేసి విద్యానాథుడు వ్రాసిన అలంకారిక గ్రంథం ప్రతాపరుద్రయశోభూషణము. దీనికే ప్రతాపరుద్రీయమని పేరు. ఇది సర్వసమగ్రమైన శాస్త్రగ్రంథం. విద్యానాథుడి జీవితం గురించి మనకు పెద్దగా వివరాలేవీ అందుబాటులో లేవు. ఒకట్రెండు సన్నివేశాలు వేరువేరు పుస్తకాలనుండి లభిస్తున్నాయి. వాటిలో మొదటిది ప్రతాపరుద్రుడు విద్యానాథుడూ కలుసుకున్న సంగతి. దీనిని చెప్పినవాడు తొట్టతొలి తెలుగు చారిత్రక వచన రచన అయిన "ప్రతాపరుద్రచరిత్రము" ను కూర్చిన ఏకామ్రనాథుడు.




ప్రతాపరుద్రుడు పట్టుపడిన తరువాత ఏకశిలానగరప్రజలు ఆయనదగ్గరకు వచ్చారట. వారిలో ఒక కవి తాను వ్రాసిన ప్రతాపరుద్రీయాన్ని చదివేడట. అది విని అందులో స్వారస్యానికి ముగ్ధుడై, మహారాజు తన ఉంగరాన్ని అతనికి ఇచ్చి, ఆ కవికి తానే "విద్యానాథుడు" అని పేరుపెట్టి, ఏనుగుపై ఎక్కించి ఉత్సవం చేసాడట! తరువాత ఆ కవి ఏకశిలానగరానికి వచ్చి వ్యాపారులముందు ఆ ఉంగరాన్నుంచి పైకాన్నిమ్మని అడిగాడట. దానికి వాళ్లు "ఈ అంగుళీకయానికి మేము ధర నిర్ణయించలేమ" ని అంటే, "ఎంతో కొంతివ్వండి, మీరు ఏమిచ్చినా అదే మాకు పదిలక్షల"ని అన్నాడట. దానికి వారు నిజంగానే పదిలక్షలలిచ్చారట (చూ. ప్రతాపరుద్రచరిత్రము, పు.65, ఆం.ప్ర.సా.అ. ప్రచురణ).

రెండవది విద్యానాథుడి పేరుమీదున్న ఒక చాటువుకథ. దీని ప్రకారం బందీకాబడిన తరువాత ఢిల్లీ నుండి తిరిగివచ్చిన ప్రతాపరుద్రుడ్ని సంతోషపెట్టడానికి ఒక నిరుపేద అయిన కవి విద్యానాథుడు ప్రతాపరుద్రీయాన్ని వ్రాసాడు. ఆ సమయంలోనే ఏలేశ్వరాగ్రహారానికి చెందిన శివయ్య అనే వ్యక్తి ఇచ్చిన సమస్యను పూరిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పాడు -

నవలక్షధనుర్ధరాధినాథే
పృథివీం శాసతి వీరరుద్రదేవే
అభవత్పరమాగ్రహారపీడా
కుచకుంభేషు కురంగలోచనానామ్

(ఇది ఒక శ్లేషాలంకారపు పూరణ. శివయ్య రాజును దెప్పుతూ మొదటి మూడు పాదాలనూ చదివుండాలి. వాటి అర్థమిదీ: నవలక్షధనుర్ధరాధినాథే= తొమ్మిదిలక్షల ధనుర్ధారుల బలమున్నటువంటి; పృథివీం శాసతి వీరరుద్రదేవే = వీరుడైన రుద్రదేవుడు భూమిని పాలిస్తూంటే; అభవత్ పరమ+అగ్రహార పీడా= బ్రాహ్మణులు ఉంటున్న అగ్రహారాలకు పెద్ద పీడ ఏర్పడింది అని. దీనికి విద్యానాథుడు అగ్రహారమన్న పదాన్ని అగ్ర+హార అని విరిచి, కంఠహారమన్న అర్థం తీసుకువచ్చి కుచకుంభేషు కురంగలోచనానాం అని నాలుగవపాదంగా అన్నాడు. అంటే, ప్రతాపరుద్రుడ్ని చూసి; కురంగలోచనానాం = లేడి కళ్లవంటి కళ్లుల అందమైన అమ్మాయిలయొక్క; కుచకుంభేషు = వక్షస్థలాలలో; (రెండు బిగిసిన వక్షోజాల మధ్య చిక్కుకోవడం చేత) పరమ+అగ్ర+హారపీడా = కంఠమాలలవల్ల బాధ కలిగింది అని)

పై రెండు కథలలో ఒక విధంగా కనిపిస్తున్న అంశం - విద్యానాథుడన్నది ఈ కవి అసలు పేరు కాదని. మరి ఏమై ఉంటుంది అని అన్నదానికి కొన్ని ఊహలు వినిపిస్తున్నాయి. ప్రతాపరుద్రుడి కాలంలోనే బ్రతికిన అగస్త్యపండితుడే విద్యానాథుడైయాడని కొంతమంది. దీనికి వాళ్లు చూపుతున్న ఆధారం ప్రతాపరుద్రీయంలో కావ్యప్రకరణంలో ఉన్న 60 వ శ్లోకం -

ఔన్నత్యం యది వర్ణ్యతే శిఖరిణః కుప్యంతి నీచైః కృతా
గాంభీర్యం యది కీర్త్యతే జలధయః క్షుభ్యంతి గాధీకృతాః
తత్త్వాం వర్ణయితుం బిభేమి యది వా జాతోస్మ్యగస్త్యః స్థితః
తత్పార్శ్వే గుణరత్న రోహణగిరే శ్రీవీరరుద్రప్రభో!

ఇందులో "జాతోస్మి అగస్త్యః" అన్న వాక్యాన్ని తీసుకుని అగస్త్యుడే విద్యానాథుడని అనేవాళ్లు కొంతమంది. కాదు అది నిరాధారమని కొన్ని ప్రమాణాలతో కొట్టివేసినవాళ్లూ ఉన్నారు (చూ. Introduction essay by T.Venkatacharya on Krishnacharita of Agastyapandita, Tanjaore Saraswati Mahal Publication)

అగస్త్యపండితుడు గొప్ప రచయిత. తన తరంతోపాటుగా, తన తరువాతి తరాలనూ కావ్యరచన వైపుకి మళ్లించిన మహాకవి. ఆయన 74 రచనలు చేసాడని సంస్కృతంలో మధురావిజయాన్ని వ్రాసిన గంగాదేవి ఆయన్ను కొనియాడింది. ఈ అగస్త్యపండితుడికి ఇద్దరు మేనళ్లుళ్లు ఉన్నారు. వారు విశ్వనాథుడు, నరసింహుడు. అగస్త్యుడి చెల్లెలిభర్త గంగాధరుడు. ఈ ముగ్గురూ కూడా గొప్ప కవులు. వీరూ, ఆ తరువాతి తరాల కవులు అనేకులు కూడా అగస్త్యుడి కవిత్వాన్ని ప్రశంసించినవారే. ఈయన కృతులలో మనకు ప్రస్తుతం మూడే దొరుకుతున్నాయి. అవి బాలభారతం ( దీనికి మహామంత్రి తిమ్మరుసు మనోహరమని ఒక వ్యాఖ్య వ్రాసాడు. ఈ బాలభారతం ఆరోజుల్లో దక్షిణదేశమంతటా గొప్ప ప్రశంసలు పొందింది. తమిళంలో వ్రాయబడిన విల్లిభారతానికి ఇదే ప్రధానాధారమని వి. రాఘవన్ గారు వ్రాసారు), కృష్ణచరితం, నలకీర్తికౌముది.

భట్టుమూర్తి వ్రాసిన వసుచరిత్రలోని ప్రసిద్ధి చెందిన ముక్కుపద్యం (నానాసూనవితానవాసనల..) అన్నదానికి మాతృక నలకీర్తికౌముదిలో ఉందని చెబుతారు. అది ఈ శ్లోకం -

భృంగానవాప్తిప్రతిపన్నఖేదా
కృత్వా వనే గంధఫలీ తపోఽలమ్।
తన్నాసికాభూదనుభూతగంధా
స్వపార్శ్వనేత్రీకృత భృంగసేవ్యా॥

అగస్త్యపండితుడే విద్యానాథుడన్నది సత్యమైనా కాకపోయినా, వీరిద్దరూ మహాకవులు, సరస్వతీపుత్రులు. ఒక సాంస్కృతికప్రవాహంలో తమవంతు పాత్ర పోషించి, తరువాతి తరాల రచనలను ప్రభావితం చేసినవారు.

ఇక విద్యానాథుడు వ్రాసిన ప్రతాపరుద్రీయం మీద ఒక వ్యాసం వ్రాయవచ్చు. భారతీయలాక్షణిక సంప్రదాయంలో దక్షిణాత్యులకు ఒక ఉనికి ఏర్పరచిన మహాగ్రంథమది. ఈ పుస్తకాన్ని చదువుకోని సాహిత్యవిద్యార్ధి దక్షిణభారతంలో ఉండడు. శయ్య అన్న అంశానికి ఇతడిచ్చిన నిర్వచనాన్ని విదేశీయులు సైతం పొగడడం నేను విన్నాను (యా పదానాం పరాఽన్యోన్య మైత్రీ శయ్యేతి కథ్యతే - పదాలమధ్యలో ఒకదానికొకటిగా ఉన్న పర అయిన మైత్రికి శయ్య అని పేరు: ఇందులో "పరా" అన్న పదానికీ, "మైత్రీ" అన్న పదానికి విశేషంగా వ్యాఖ్యలు వ్రాయవచ్చు). ఇదేకాదు, కావ్యంలో ప్రతీఅంశానికీ ఇతడి నిర్వచనాలు నిర్దుష్టంగా ఉంటాయి. సాహిత్యాన్ని అధ్యయనం చేసే కొద్దీ, ఇతడి నిర్వచనాలకు కొత్తకొత్త ఔచిత్యాలను మనం కనుక్కుంటూనే ఉంటాం.

విద్యానాథుడి శాస్త్రబుద్ధే కాదు, అతని కవితా హృదయమూ మహోన్నతమైనదే. ఈ శ్లోకాన్ని చూడండి -

లోకే కాకతిరుద్రవీరనృపతేరుద్దామభూమశ్రియః
కీర్త్యా కార్తికకౌముదీధవళయా తుల్యం న కించిత్ క్వచిత్
యన్మాధుర్యవిజృంభితక్షతవిషాం గ్రీవాం విలోక్యాధునా
కంఠాలింగనమీశితుర్వితనుతే నీరంధ్రమద్రేస్సుతా
.

కాకతీయరుద్రనృపతి కీర్తికాంతులు కార్తీకమాసపు వెన్నెలల వలే దట్టంగా ముల్లోకాలనూ వ్యాపిస్తున్నాయి (కీర్తిని తెలుపుతో పోల్చడం కవిసమయం). అది కైలాసం వరకూ వ్యాపించి, తెల్లనివాడైన పరమశివుడిని మరింత తెల్లగా చేసాయట. ఆ తెలుపులో ఆయన కంఠం మీద ఉన్న నలుపుకూడా తెల్లనైపోయిందట. అది చూసిన పార్వతి ఇంతగా తెల్లబడిపోతే స్వామిని గుర్తించడం కష్టమని, గళంలోని నలుపుని కాపాడుకోవడం కోసం ఆయన కంఠాన్ని కౌగిలించిందట!

విద్యానాథుడి వల్ల లాక్షణికప్రపంచం కొన్ని వందల ఏళ్లు ముందుకు జరిగింది. కావ్యమనే వస్తువుకు ఉన్న పరిధులను చెరిపేసి, ఒక విశ్వవ్యాపకమైన రామణీయతను దర్శించడంలో మన శాస్త్రకారులకూ, చదువరులకూ ఎంతో సహకరించింది.ఆ ప్రవాహంలో తెలుగుతీపిని నిమజ్జనం చేసినవాడు విద్యానాథుడు. అంతటివాడు కనుకనే మహావ్యాఖ్యాత మల్లినాథసూరి ప్రతాపరుద్రీయంలోని ఉదాహరణలను తన వ్యాఖ్యలలో అనేకమార్లు ఉటంకించాడు.

అలంకారశాస్త్రంలో ఈ విధంగా ఒకే ఒక వ్యక్తిపై యూలజీలను కూర్చుతూ తాను చెప్పదలచుకున్న శాస్త్రీయాంశాలను నిర్వచన-ఉదాహరణాలదులతో ప్రకటిస్తూ వ్రాసిన కృతులలో ప్రతాపరుద్రీయం మొదటిది. మనోహరమైన ఈ విధానాన్ని, తద్వారా విద్యానాథుడిని అనుకరిస్తూ ఆయన వాడిన వర్ణనలనూ అతిశయోక్తులనూ రూపక-ఉపమ-ఉత్ర్పేక్షాది కవితా పరికరాలనూ అదే విధంగా తీసుకొని సుప్రసిద్ధ సంస్కృత విద్వత్కవి శ్రీ వి. రాఘవన్ గారు సంస్కృతంలో ఒక కాల్పనికమైన నాలుగంకాల మనోహరమైన రూపకాన్ని వ్రాసారు. దానిపేరు ప్రతాపరుద్రవిజయము. విద్యానాథ విడంబన ( విద్యానాథుడి అనుకరణ ) అని దానికి మరొక పేరు. ప్రతాపరుద్రీయం యొక్క శిల్పాన్ని అనుకరిస్తూ చేసిన పేరడీ ఈ రూపకం. అందులో ఆయన ప్రతాపరుద్రుడిని శివభాగవతుడు అని ఒక చక్కని పేరుతో పిలిచారు. ఉన్నతమైన కవిత్వపు విలువతో తూగే ఆ నాటకం గురించి నాకు ఎంతో వ్రాయాలని ఉన్నా, ప్రస్తుతానికి ఒక శ్లోకాన్ని ఉదాహరిస్తున్నాను. ఇందులో విద్యానాథుడి అనుకరణ, అనుసరణ కొట్ట వచ్చినట్లుగానే కనిపిస్తుంది.

దేవో భూతపతిః స్వయం గణయుతః పుత్రం కుమారం ప్రియం
పార్వత్యశ్రుభిరార్ద్రితేషు హిమవత్ప్రాంతేష్వమృగ్యత్ చిరమ్
శూన్యోరాశ్చ మృశన్ రమాపతిరగాత్ మ్లానిం, విధాతాపి చ
స్వాస్యం వీక్ష్య సరస్వతీవిరహితం జాడ్యం సమాలంబత.

(తన ప్రమథగణాలతో కలిసి, భూతపతి అయిన పరమశివుడు తన ప్రియమైన కుమారుడి కోసమని పార్వతీదేవి కన్నీళ్లతో తడిసిన హిమవత్ప్రాంతాలలో చిరకాలం వెతికాడట. లక్ష్మీదేవి లేక విష్ణువు వాడిపోయాడట. సరస్వతి వసింపని తన ముఖపద్మాన్ని గమనించుకున్న విరించి పాపం జాడ్యాన్ని అవలంబించాడట. ఆయా దేవతలందరూ తమతమ నెలవులు వీడి ప్రతాపరుద్రుడిని ఆవహించి ఉన్నారని ధ్వని.)

ఈ దేశంలో రసికత చావనంతవరకూ, విద్యానాథుడికి మృతిలేదు. ప్రతాపరుద్రీయంలో అంత విలువుంది. అదే ఆయనకూ ఆయన రచనకూ శ్రీరామరక్ష.

*

(This modified essay was originally written as an answer to a question in Quora three years ago. Featured image is taken from wikimedia commons)

No comments:

Post a Comment