మహాకవి గంభీరుడు. ఒక్కోసారి చిక్కడు. తన మనసులో జనించే ఆనందభావాలలో తేలియాడుతూ స్వర్గమర్త్యపాతాళాల నడుమన ఉన్న భేదరేఖలను చెరిపేస్తూ ఆ ఎత్తులలో సంచరిస్తాడు. మరి అటువంటి కవి దగ్గరకు మనలని తీసుకునివెళ్లేదెవరు అంటే దానికి సమాధానం గురువు. ఆయన నిరంతర సాధన చేత కావ్యంలోని ఆనందాలను పాలలోనుండి వెన్నని తీసినట్లు వెలికితీసి మనకోసమందించే దయాపరుడు. సంస్కృతసాహిత్యంలో ఈ ఆనందమథనాన్ని సుళువు చేసి, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సాహిత్యాధ్యయనం చేసే కొన్ని లక్షలమంది గురువులకూ శిష్యులకూ మేలు చేసిన ఆప్తుడు మన తెలుగువాడైన మల్లినాథసూరి.
ఆ కాలంలో కావ్యవ్యాఖ్య కావ్యరచన కంటే ప్రమాదకరం. దానికి కారణం వ్యాఖ్యాత అసలుకవిని అతిశయించి ఉండే అవకాశం . 'కవితను ఈ విధంగానే చదువు' అని నిర్ధేశించడం తప్పిదమే. అపుడు కవి కనపడకపోగా, సంస్కారం లేని వ్యాఖ్యాత కావ్యానందపు పగ్గాలను తీసుకునే ప్రమాదముంది. హృదయధర్మం లేని వ్యాఖ్యాత వలన లాభం కన్నా నష్టమెక్కువ. కానీ ఒక కావ్యానికి వ్యాఖ్యాత స్వతహాగా కవి అయి, లోకోత్తరపండితోత్తముడయి ఈ ప్రమాదాలన్ని ఎరిగినవాడవడం ఒక అరుదైన సంఘటన. ఆ సంఘటనే మల్లినాథుడు. ఈ మనీషి ఎంత విచక్షణ ఉన్నవాడో ఈ క్రింది శ్లోకం చెబుతుంది:
ఇహాన్వయముఖే నైవ సర్వం వ్యాఖ్యాయతే మయా
నామూలం లిఖ్యతే కించి న్నానపేక్షిత ముచ్యతే
మూలంలో లేనిదేదీ నాచేత లిఖించబడదు. అవసరం లేనిదేదీ నా చేత చెప్పబడదు అని ఆయన చేసిన శపథం. ఈ విజ్ఞతవల్ల సంస్కృతభాషలోని పంచమహాకావ్యాలకు ఒక అరుదైన, అవసరమైన వ్యాఖ్యాన నమూనా తయారయింది. ఈ నమూనాలో ఉండే విషయాలు తొంభై శాతం శాస్త్రసంబంధమైనవి. ఒక శ్లోకంలోని అలంకారం, పదాల వ్యుత్పత్తులు, అన్వయం, వ్యాకరణ సూత్రాలు, క్లిష్టవిషయాలను వివరించే బోధకసహాయకమైన అంశాలు మల్లినాథుని వ్యాఖ్యానంలో ప్రధానభాగాలు. వీటితో కావ్యశ్లోకాలను అరటిపండు వొలిచిచేతిలో పెట్టినట్టుగా చదువరులకందించేడు ఈ మహానుభావుడు. అయితే రసానందం ఈ విధంగానే ఉండవలెనని అతను ఎక్కడా స్వంతబుద్ధిని చొప్పించలేదు.
మల్లినాథుని పూర్వులు
మల్లినాథుడు పుట్టింది నేటి మెదక్ జిల్లాలోని కొల్చారం గ్రామంలో. ఈ ఊరుని ఇదివరకు కొలచెలమ అని పిలిచేవారని అంటారు. మల్లినాథుడి ఇంటిపేరు మీద కూడా కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఈ ఇంటిపేరు జనులనోళ్లలో తిరిగి మారి, ఆ పేరే ఇంటిపేరుగా స్థిరపడినవారున్నారు. కొలిచిన, కోలాచల, కొలచెల, కొలచాల, కొలచెలమ, కోలచెర్ల ఇలాగ. వీళ్లలో గోత్రభేదాలు, శాఖాభేదాలు కూడా కనిపిస్తున్నాయి. మల్లినాథుడు తన ఇంటిపేరునూ, పుట్టుపూర్వోత్తరాలనూ ఎక్కడా క్షుణ్ణంగా బయటపెట్టుకోలేదు. అయితే భోజుడి చంపూరామాయణానికి మల్లినాథుడి తరువాతివాడైన నారాయణపండితుడనేవాడు పదయోజన మని ఒక వ్యాఖ్య వ్రాసాడు. అందులో తన పూర్వజులను ఇలా తల్చుకున్నాడు -
కొలచెల్మాన్వయాబ్దీందుర్మల్లినాథో మహాయశాః
శతావధానవిఖ్యాతో వీరరుద్రాభివర్షితః
మల్లినాథాత్మజః శ్రీమాన్ కపర్దీ మంత్రకోవిదః
అఖిలశ్రౌతకల్పస్య కారికావృత్తి మాతనోత్
కపర్దితనయో ధీమాన్ మల్లినాథోఽగ్రజ స్స్మృతః
ద్వితీయ స్తనయో ధీమాన్ పెద్దిభట్టో మహోదయః
మహోపాధ్యాయ ఆఖ్యాత స్సర్వదేశేషు సర్వతః
మాతులేయక్రతౌ (కృతౌ) దివ్యే సర్వజ్ఞే నాభివర్షితః
గణాధిపప్రసాదేన ప్రోచే మంత్రవరాన్ బహూన్
నైషధజ్యౌతిషాదీనాం వ్యాఖ్యాతాఽభూజ్జగద్గురుః
దీని ప్రకారం మల్లినాథుడి ఇంటిపేరు కొలచెలమ వారని వేటూరి ప్రభాకరశాస్త్రి అభిప్రాయపడ్డారు. అయితే మల్లినాథుడి కొడుకైన కుమారస్వామిపండితుడు విద్యాధరుడు వ్రాసిన ప్రతాపరుద్రయశోభూషణమనే గ్రంథానికి వ్యాఖ్య వ్రాసాడు. అందులో అతడు కొ(కో)లచల అన్న పదాన్ని ఇంటిపేరుగా వాడాడు. ఏది ఏమైనా మల్లినాథుడి వంశం కవిపండితవంశం. రాజుల చేత గౌరవాలను పొందింది. నారాయణపండితుడు బైటపెట్టిన ఈ వంశంలోని మొదటి వ్యక్తి మల్లినాథుడు. పై శ్లోకాన్ని బట్టి ఇతడు తన వైదగ్ధ్యపటిమతో శతావధానం చేసి కాకతీయప్రతాపరుద్రుడి చేత కనకాభిషేక గౌరవాన్ని పొందాడు. ఈ పని చేసిన ప్రతిభావంతులలో ఇతను ప్రప్రథముడు. ఆయన కొడుకు కపర్ది. శ్రౌతవాఙ్మయంలోనూ మంత్రశాస్త్రంలోనూ ఎంతో కృషిచేసాడు. వైదికులలో ఇతని పేరు సుపరిచితమే. ఆపస్తంబగృహ్యసూత్రాలకూ వైదికనిర్ణయాలకూ కపర్దిస్వామి వ్యాఖ్యలు ప్రామాణికాలు. ఈయన పేరుమీద మనోహరమైన చాటువొకటి కనబడుతోంది—
అంబా కుప్యతి న మయా
న స్నుషయా సాఽపి నాఽంబయా న మయా
అహమపి న తయా న తయా
వద రాజన్! కస్య దోషోఽయమ్
(మా ఇంట్లో మేం ముగ్గురం. అమ్మకి కోపం, అయితే అది నా వల్లా కాదు, మా ఆవిడవల్లా కాదు. నా భార్యా కోపంగానే ఉంటుంది. దానికి నేనుగానీ మా అమ్మ గానీ కారణం కాదు. నాదీ అదే పరిస్థితి. అయితే అది మా అమ్మవల్లనో లేదా నా భార్యవల్లనో కలిగింది కాదు. ఓ రాజా, ఇది ఎవరి దోషమో నీవే చెప్పు)
కారణం లేని కోపం కలిగేది నోట్లోకి నాలుగు వేళ్లూ పోనపుడే కదా. మా ఇంట్లో ధనంలేదు - అన్న విషయం ఒక కవి చెబితే ఇలానే చెబుతాడు. ఈ గంభీరత ఆ రాజుని ఖచ్చితంగా మెప్పించే ఉంటుంది. ఆనాడు కవులకూ కవిత్వానికీ ఉన్న విలువ వేరు. ఒక మంచి ఊహకోసం, భావన కోసం ప్రజలంతా నేడు సెల్ ఫోన్ లోని కొత్త ఫీచర్ల కోసం ఎదురు చూసినట్లుగా ఎదురు చూస్తుండేవారు. ఆ కాలంలో కవిత్వమే వైరల్.
కపర్దిస్వామికిద్దరు కొడుకులు. పెద్దవాడు మల్లినాథుడు. రెండవవాడు పెద్దిభట్టు. ఈ మల్లినాథుడే కావ్యవ్యాఖ్యానకర్త. మల్లినాథుడి కాలం మీద కొంత తికమక ఉన్నా, ఈయన వ్యాఖ్యలలో ఉదాహరించిన అన్యరచనల కాలాలను బట్టీ, ఈయనను అభిమానించి గౌరవించిన రాచకొండ ప్రభువు సర్వజ్ఞసింగభూపుడి కాలాన్ని బట్టీ మల్లినాథుడు 1350-1450 సంవత్సరాల మధ్య బ్రతికాడని ఊహ.
ముసలః కిసలాయతే
ఎన్నో కథలు మల్లినాథుడిమీద నేను విన్నాను. కొన్ని చదివాను. మల్లినాథుడు చిన్నతనంలో మొద్దు. తండ్రి అతడిని దారిలో పెట్టలేక, పెళ్లిచేసి అత్తవారింటికి పంపాడు. అక్కడి వాళ్లంతా ఇతడ్ని చూసి ఎగతాళి చేసారు. భార్య "ముసలః కిసలాయతే?" (రోకలి చిగురిస్తుందా) అని దెప్పింది. మిగిలిన వారూ తలోసారీ తలోమాటా అన్నారు. భరించలేకపోయాడు మల్లినాథుడు. తన క్రోధాన్ని దీక్షాగ్నిగా రగుల్చుకున్నాడు. ఆరోజులలో అంతే, వ్యక్తిత్వం పైన దెబ్బ అసహనీయం. దెప్పుడుమాటలు, వ్యంగ్యాలు అసలు భరించేవారు కాదు. ఒక్క సూటిమాటతో కాళిదాసునూ, భారవినీ, మల్లినాథుడినీ తయారుచేసిన నేల ఇది. పట్టుదలతో మల్లినాథుడు కాశీకి వెళ్లాడు. కాశీలో గురుపత్ని నేతికి బదులు భోజనంలో వేపనూనె వడ్డించేదిట. చదువుమీద తప్ప అన్యాసక్తమవని మనసున్న మల్లినాథుడికి అదేమీ పట్టేది కాదట. శిక్షణపూర్తవగానే ఒకరోజు అన్నం తింటూ ఆ చేదు తగిలి, "ఇదేమిట"ని గురువుగారినడిగాడట. ఆయన "నాయనా, నీ చదువింక పూర్తయింది వెళ్లిర"మ్మనారట.
మల్లినాథుడింటికి తిరిగివచ్చాడు. ముసలః కిసలాయతే అని భార్యతో అన్నాడు. ఎంతటి మనోబలమా మనిషిది? ఏమి సంకల్పమతడిది? రఘువంశవ్యాఖ్య చివరలో తనను తాను పదవాక్యప్రమాణపారావారపారీణుడనని చెప్పుకున్నాడు. మల్లినాథుడు నేర్చుకున్న విషయాలు, ఆయన శ్లోకంలోనే—
వాణీం కాణభుజీమజీగణదవాశాసీచ్చ వైయాసికీ-
మంతస్తంత్రమరంస్త పన్నగగవీగుంఫేషు చాజాగరీత్
వాచామాకలయద్రహస్యమఖిలం యశ్చాక్షిపాదస్ఫురాం
లోకేఽభూద్యదుపజ్ఞమేవ విదుషాం సౌజన్యజన్యం యశః
(రఘువంశ వ్యాఖ్యారంభ శ్లోకాలు, 4)
కణాదుడి, గౌతముడి, తర్కశాస్త్రాలను, వ్యాసకృత బ్రహ్మసూత్రాలనూ చక్కగా చదువుకున్నాడట. ఆ పదగుంఫనం చూడండి- కణాదుడికి బదులుగా కాణభుక్కనీ, వ్యాసుడిని స్ఫురింపచేయడానికి వైయాసికీ అనీ; క్రియాపదాలు అజీగణత్, అరంస్త, అజాగరీత్ అనీ—- మామూలు విద్యార్ధికి అంతుచిక్కని భాష. ఈ పదాలంత కఠినమైనది ఆతని దీక్ష. అతని వైదుష్యం. కాశీలో మల్లినాథుడి పేరుమీద ఒక విద్యాలయముందట. ఈ మహాపురుషుడు పట్టనిది తెలుగువాళ్లకే.
పుస్తకరచనలో పడి కుటుంబభారాన్ని మర్చిపోయాడు మల్లినాథుడు. ఒకరోజు ఎవరో ఇంటికొస్తే భార్యను "ఇవాళేమి వండుతున్నావ"ని అడిగాడట. దానికి ఆవిడ చికాకుతో "ఇత్యర్థముల కూర, ఇతిభావముల పులుసు" అని చెప్పిందట.(ఇతర్థః, ఇతి భావః అని మల్లినాథుడు రోజులో పదులసార్లు వాడే మాటలు). జీవిత చరమాంకంలో వ్యాఖ్యరాస్తున్న ఇతనిని చూసి ఒక వ్యక్తి "ఇంత లఘువుగా వ్యాఖ్య వ్రాస్తున్నారేమి" అని అడిగాడట. దానికి ఆయన "మాఘే మేఘే గతం వయః" (మాఘకావ్యానికీ, మేఘసందేశానికీ వ్యాఖ్య వ్రాయడంలో నా వయసైపోయింది) అన్నాడట. ఇవి కట్టుకథలో, నిజాలో! ఏమైనా, మహాకావ్యాలని భారతదేశంలోని మూలమూలలా పేర్లు పొందిన కావ్యాలకు నిజంగా తమ కవితలను ఆ మహాకవులే మనముందు కూర్చుని అందులోని విశేషాలను వివరిస్తున్ననంత అందంగా అత్యంత ప్రసిద్ధిపొందిన వ్యాఖ్యలు వ్రాసినటువంటి వ్యక్తి పడిన శ్రమను మనం తోసేయ్యలేం. రఘువంశం, నైషధం ఇత్యాది కావ్యాలకు సంస్కృతంలో పదుల సంఖ్యలో వ్యాఖ్యలున్నాయి. కానీ మల్లినాథుడి రచనలకే ఆ గౌరవం.
నిజంగానే చిగిర్చిన రోకలి మల్లినాథుడు. ఆ చిగురింత శాశ్వతం.
మల్లినాథుడు, పెద్దిభొట్టు: ఒక తికమక
మల్లినాథుడి గురించి తెలిసినవారికి ఆ పేరుతో పాటుగా సమాంతరంగ వినిపించే మరొకపేరు పెద్దిభొట్టు.
మా ఇంట్లో ఈ రోజుకీ తరచుగా వినిపించే చాటుశ్లోకం ఒకటుంది. ఒకసారి మల్లినాథుడు కావ్యకన్యకలను వర్ణిస్తున్నాడు. భార్య వచ్చి, నన్నూ పొగడమని విసిగించింది. వినకపోయే సరికి సమాధానపరిచేందుకు ఆయన ఇలా అన్నాడట, ఆశువుగా --
తింత్రిణీదళ విశాలలోచనా,
మేరుమందర సమాన మధ్యమా
అర్కశుష్కఫల కోమలస్తనీ,
పెద్దిభొట్లు గృహిణీ విరాజతే
(చింతాకులలాంటి విశాలమైన కళ్లతోటి, మేరు మందర పర్వతాలలాంటి సన్నని నడుముతోటి, శుష్కించిపోయిన కోమలమైన వక్షస్థలంతోటి పెద్దిభొట్టు ఇల్లాలు ప్రకాశిస్తోంది)
ఈ పెద్దిభొట్టు నారాయణపండితుడు వివరించిన వంశావళిలో మల్లినాథుడి తమ్ముడు. అతడు మహోపాధ్యాయ బిరుదాంకితుడనీ, సర్వజ్ఞసింగభూపాలుడిచేత కనకాభిషేకం పొందేడనీ, నైషధాది కావ్యాలకు వ్యాఖ్య వ్రాసాడనీ ఉంది. ఇవన్నీ చేసింది పెద్దిభొట్టా? మరి మల్లినాథుడెవరు?
ఈ ప్రశ్న అలా ఉంటే, ప్రతాపరుద్రయశోభూషణానికి వ్యాఖ్యవ్రాసిన కుమారస్వామి కోలచల పెద్దయార్యుడిని (పెద్దిభొట్టు?) మల్లినాథుడి కొడుకన్నాడు.
త్రిస్కంధశాస్త్రజలధిం చులుకీకురుతే స్మ యః
తస్య శ్రీమల్లినాథస్య తనయోఽజని తాదృశః
కోలచల పెద్దయార్యః ప్రమాణపదవాక్యపారదృక్చా యః
వ్యాఖ్యాతనిఖిలశాస్త్రః ప్రబంధకర్తా చ సర్వవిద్యాసు
ప్రమాణపదవాక్యపారదృక్కని మల్లినాథుడి పేర ప్రసిద్ధిపొందిన బిరుదు ఈ శ్లోకాలలో పెద్దయార్యుడిపేరు మీదే ఉంది.
ఆంధ్రదేశంలో వీరిద్దరి గురించీ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నేను నా చిన్నతనంలో మా పెద్దవాళ్లదగ్గర విన్నది, వేటూరి వారు తమ వ్యాసంలో ప్రస్తావించిందీ ఇలా ఉంది -- మల్లినాథుడూ, పెద్దిభొట్టూ అన్నదమ్ములు. మల్లినాథుడు మందబుద్ధి, పెద్దిభొట్టు తెలివైనవాడు. వాళ్లున్న ఊరుకు ఒక సాధువు వచ్చాడు. అతని మహత్తు తెలిసిన మల్లినాథుడు ఆ సాధువును భక్తిగా సేవించేవాడు. ఒకరోజు మల్లినాథుడు గ్రామాంతరం వెళ్లగా, అతని మాటమీద పెద్దిభొట్టు సేవకు పూనుకొన్నాడు. సరిగ్గా అపుడే ఆ యోగికి చరమకాలం ఆసన్నమైంది. తన సారస్వతాన్నంతా అతనికి సేవ చేస్తున్న మల్లినాథుడికి ఉపదేశిద్దామనుకొన్నాడు. కానీ అక్కడ ఉన్నది పెద్దిభొట్టు. దీని ఫలం మీ అన్నకు ధారపోయమని ఆ యోగి ఉపదేశం పెద్దిభొట్టుకు చేసి దేహత్యాగం చేసాడు. ఆ గుర్వాజ్ఞ ప్రకారం పెద్దిభొట్టే తన రచనలన్నీ మల్లినాథుడిపేర తానే వ్రాసాడట. వేమన జీవితంలో ప్రసిద్ధిచెందిన కథను పోలిఉన్న ఈ కథ నారాయణపండితుడి శ్లోకాలతో సరిపోతూంది.
పెద్దిభొట్టు సర్వజ్ఞసింగభూపుడి ఆస్థానంలో ఉన్నాడనడానికి గుర్తుగా వేటూరివారీచాటువుని ఉదాహరించారు:
కిం వాససా చీకిరిబాకిరేణ
కిం దారుణా వంకరటింకరేణ
సర్వజ్ఞ భూపాలవిలోకనార్థం
వైదుష్య మేకం విదుషాం సహాయమ్.
వీరిద్దరిమీదా హాస్యకథలు కూడా కొన్ని ప్రచారంలో ఉన్నాయి. కన్నడంలో పెద్దభొట్టుచరితమని ఒక పుస్తకమే ఉందిట. ఆ పుస్తకం ప్రకారం పెద్దిభొట్టూ, మల్లినాథుడూ ఇద్దరూ ఒక్కరే. తెలుగు, కన్నడ ప్రాంతాలలో మల్లినాథుడుని పెద్దిభొట్టన్న ముద్దుపేరుతోనే పిలవడముంది. నేను విన్నకథలబట్టికూడా మల్లినాథుడూ పెద్దిభొట్టూ ఒక్కరే.
మల్లినాథుడి మనీష
మల్లినాథుడి పేరుమీదున్న రచనలివి.
వ్యాఖ్యలు-
కాళిదాసు రఘువంశం - సంజీవిని
కాళిదాసు కుమారసంభవం - సంజీవిని
కాళిదాసు మేఘదూతం - సంజీవిని
భారవి కిరాతార్జునీయం - ఘంటాపథ
మాఘుడి శిశుపాలవధ - సర్వంకష
శ్రీహర్షుడి నైషధీయచరిత - జీవాతు
భట్టి భట్టికావ్యం - సర్వపథీన
విద్యాధరుడి ఏకావళి - తరల
వరదరాజుని తార్కికరక్షాటీక - నిష్కంటక
తంత్రవార్తికం - సిద్ధాంజన
స్వరమనోజ్ఞమంజరి - పరిమళ
ప్రశస్తపాదభాష్యం - నిష్కంటక
అమరకోశం - అమరపదపారిజాత
మామూలు వ్యాఖ్యానాలు కావివి. ఒక్కో శ్లోకాన్నీ మలినాథుడి వ్యాఖ్యతో చదువుతున్నపుడు ఒక్కోసారి కావ్యకర్త ప్రతిభను మర్చిపోయి, మల్లినాథుడి విషయజ్ఞానానికి ముగ్ధులమవుతాం. వేదం, వేదాంతం, వ్యాకరణం, భాషాశాస్త్రం, పదజ్ఞానం, కోశజ్ఞానం, మీమాంస, ప్రాచీనసంస్కృతులు, న్యాయశాస్త్రం, తర్కం, రాజనీతిశాస్త్రం, తంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, శకునశాస్త్రం, అలంకారశాస్త్రం, పురాణాలు, ఇతిహాసాలు, సంగీతం, నాట్యం, శకునాలు - ఇలా భారతీయవాఙ్మయంలో ఉన్న ప్రతీశాస్త్రంలోని కొన్ని పదుల నిర్వచనాలను సందర్భానుగుణంగా మల్లినాథుడు తన వ్యాఖ్యలలో ఉదహరించాడు. ఒక ఊహకు సరైన అలంకారమిదనీ, ఒక ప్రయోగానికి సరైన వ్యాకరణసూత్రమిదనీ, ఒక వాక్యానికి వెనకాల ఉన్న ప్రమాణమిదనీ, సంప్రదాయాలు, సంస్కృతులూ ఇవనీ మల్లినాథుడు చూపుతుంటే కావ్యామృతాన్ని దోసిళ్లలో పోసినట్టు ఉంటుంది.ఈతని వివరణాపటిమ ఇంకొక వ్యాఖ్యాకారుడిలో కనపడదు. మల్లినాథుడు లేకపోయి ఉంటే, కవులింత దగ్గరయ్యేవారు కారు మనకు.
మల్లినాథుడు స్వంతరచనలు కూడా చేసాడు. వాటిలో మొదటిది వైశ్యవంశసుధాకరం. రెండవ ప్రౌఢదేవరాయలు విజయనగరాన్ని పరిపాలిస్తున్న రోజులలో కాంచీపురంలో ఆనాడు వైశ్యులకూ, వ్యాపారులకూ తలెత్తిన ఒక గొడవకు మల్లినాథుడిచ్చిన తీర్పు ఈ గ్రంథం. ఇది పొట్లిపోయి తాళపత్రరూపంలో అసంపూర్ణంగా లభించిందట. రెండవది రఘువీరచరితం. ఇది 17 సర్గల మహాకావ్యం. ఈ కావ్యం మల్లినాథుడి ప్రతిభాపాటవాలకు మచ్చుతునక. మహాకావ్యానికుండే లక్షణాలన్నింటితోనూ అలరారుతోంది. ఈ గ్రంథం మీద ఎంతో పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఉంది.
ఇప్పటి తరానికి తెలియదేమో కానీ, సాహిత్యం ఒక చదువుగా ఇళ్లలో ఉన్నంతకాలం కాళిదాసు, భారవి, మాఘుడు వీళ్లతో పాటుగా వినిపించిన పేరు మల్లినాథసూరిది. ఆయనపై నాది చిన్ననాటి ప్రేమ. కావ్యసరస్వతిని చేతులలోకి తీసుకుని చదువుకుంటున్నపుడు అర్థమైన శ్లోకాల క్రింద, అర్థం కాని శ్లోకాల క్రిందా కూడా మల్లినాథుడు నాకు కనిపిస్తాడు. నా చేతిని తన చేతిలోకి తీసుకుని భారతీదేవి ఒడిదాకా నన్ను తీసుకుని వెళ్లి అక్కడ కూర్చోబెడతాడు. పూర్వజన్మసుకృతంగా నాకబ్బిన కొద్దిపాటి సాహిత్యంపైని వాసనకి నాకు ఎంతగానో సహాయం చేసిన ఆప్తుడు మల్లినాథుడే. ఎన్ని జన్మలెత్తినా ఈ మహానుభావునికి నేను ఋణగ్రస్తుడినే.
రాచకొండ సర్వజ్ఞసింగభూపాలుడిచేత మహామహోపాధ్యాయ అని బిరుదుని పొంది, కనకాభిషేక సత్కారాన్ని అనుభవించి, తన అకుంఠిత దీక్షచేత మహాకావ్యకన్యను ప్రజల ఇంటి ముంగిళ్లలోకి తీసుకుని వచ్చి నర్తింపచేసిన తెలుగువాళ్ల పుణ్యాల పంట మల్లినాథుడు. ఈయన పేరుమీదే ఈనాటికీ మరాఠీ భాషలో వ్యాఖ్యానాన్ని "మల్లినాథి" అని పిలుస్తారట. తెలుగునేలమీద ఈయన గురించి ఎంతమందికి తెలుసు? ఆయన నిండునెలరాజు. శ్రమించి, భాషాకౌముదులని తన చివరి ఊపిరివరకూ విరజిమ్మి, వాగ్దేవి పాదాలను చేరుకున్నాడు. ఆయన గురించి తెలియని తెలుగువాడే దురదృష్టవంతుడు.
కుసుమస్తబకస్యేవ ద్వయీ వృత్తిర్మనస్వినః
మూర్ధ్ని వా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా
*
[First published on Telugu Quora four years ago]
No comments:
Post a Comment