ఈ దేశంలో భగవంతుడు కవితకి యెప్పుడో దాసోహమన్నాడు. కవిత్వపు సామాగ్రి ఏదైనా సరే, అది భగవంతుడికి అన్వయింపబడనిది, ఈ దేశపు వాఙ్మయంలో అసలు కనిపించదు. భగవత్తత్త్వాన్ని ప్రతిపాదించే భాషతో పాటుగా, లౌకికమైన భావాలలోనూ భగవంతుడు అంతే అందంగా ఇమిడిపోయాడు. ఆయన ఉదాత్తతని యేమాత్రమూ తగ్గించకుండా నింద చేసి ఆయనను తగ్గించి, అదీ 'అంతే అందంగా ఉందే' అని అనిపించుకోగలిగిన బుద్ధి భారతీయుడిది. సంస్కృతంలో భవగంతుడిని చమత్కారంలో ప్రతిబింబింపచేసే ఒక విస్తారమైన సాంప్రదాయమే కవికులంలో ఉంది. తెలుగులోకూడా అది అంతే అందంగా ఉంది.
తెలుగులో శైవకవిత్వం విలక్షణమైనది. చరిత్రలో 'దేశితనాన్ని' తెలుగువాడిలో మేలుకొలిపింది శివుడే. శివుడి ముందు భక్తితో సాగిలపడిన తెలుగువాడి నోటివెంట అమ్మభాష అలలుకట్టి వెలికి వచ్చింది. చెప్పాలంటే, మన భాషని యథాతథంగా మొదట రుచిచూసిన దేవుడు శివుడే. ఆ తీపిని సేవించి, కరిగిపోయి, ఈ నేలమీదకి దిగివచ్చాడు. ఇక్కడి ప్రతీ పరగణాలోనూ, కొండలోనూ, లోయలోనూ, చేనులోనూ తెలుగు పూత పూసుకుని విహరించాడు. ఆ దగ్గరితనంవల్లనో ఏమో, తెలుగుహృదయంలో కూర్చుని మొదటిసారిగా కావ్యాన్నీ, శతకాన్నీ పురాణాన్నీ, చరిత్రనీ రచించడానికి ఉసిగొల్పాడు. శివయుగంలో ఈ నేలమీద హొయలుపోయిన తెలుగే తెలుగు. ఆ తీపికి ఎల్లలు లేవు. ఆ ధారకి ఆనకట్ట లేదు. ఆ కవితకి సదృక్షత లేదు. సంగీతానికి అనువైనది ఆ తెలుగు. ఛందస్సులో ఇరుకుకుపోయే తెలుగు కాదది. చదివేటప్పుడు అందులోని సంగీతసంబంధమైన 'యింపు', అర్థాన్ని అతిశయించి ఉంటుంది.
తెలుగు చాటు సాంప్రదాయంలోనూ, శివుడిది ప్రత్యేకమైన స్థానం. భక్తుడి హృదయంలోని లోతుని తట్టి, కేవలం 'నువ్వింత వాడివి, అంతవాడివి' అని మాత్రమే అనిపించకుండా, కల్పనతో కవిత్వాన్ని ప్రవహింపచేసిన అమూల్యమైన పద్యాలు శివుడిమీద చాటుపద్య మణిమంజరి లో ఉన్నాయి. చాటువులైనా, ఈ తెలుగు కూడా వేరే చోటులలో దొరకని తెలుగు. శివుడి సుగంధాన్ని పూసుకుని, ఆ వాసనని మన మనసుకు పట్టించే తెలుగు.
వాటిలో కొన్ని -
1
భసితము కన్నులంబడినఁ బాములు బుస్సనఁ గంట మంట పె
ల్లెసగి విధుండు గంద నొకయింత గజాసురచర్మమూగినన్
గసరుచు నల్లపెద్దపులి గాండ్రన గిత్తయుఁ దత్తరిల్ల జేఁ
బొసగిన లేడి కుందువడ భూతభయంబున గౌరి లేవ న
వ్వెసగగ సంతరించికొనునీశ్వరుడిచ్చుత మీకభీష్టముల్.
ఇది ఒక ఆశీర్వచన పద్యం - శివ స్తుతి. భాషలో, వర్ణనలో ఎంత లేతైనదో అంత లోతైనది. అర్ధం తేలికే - శివుడు ఒళ్లంతా రాసుకున్న విభూది కళ్లలో పడిన పాములు బుస్సు బుస్సుమని ఇబ్బంది పడ్డాయి. ఈ చప్పుడుకి శివుడి మూడోకన్నైన అగ్నికి బెదురై, నిప్పులు రేగాడు. ఆ వేడిమికి జటాజూటం మీదున్న చంద్రుడికి ఒడలు కందిపోయింది. ఈ హడావిడిలో శివుడి శరీరానికున్న గజాసురుడి చర్మం ఊగులాడింది. ఆ కదలిక గమనించి, ఇన్నాళ్లూ శివుడు చనిపోయిన చర్మం కట్టుకున్నాడనుకున్నాను, ఈ ఏనుగేదో బతికి వచ్చినట్లుందే అనుకున్న అమ్మవారి వాహనమైన పెద్దపులి ఒక్క ఉదుటున గాండ్రించింది. ఆ అరుపుకి శివుడి వాహనమైన నంది తొట్రుపడింది. వెంటనే భయంతో శివుడి చేతిలో ఉన్న లేడి కంగారు పడింది. ఈ జంతువుల అల్లరికి అదిరి, కూర్చున్న అమ్మవారు లేచి నిలబడింది. ఇదంతా చూస్తున్న శివుడికి నవ్వు వచ్చింది. వెంటనే అందరికేసీ చూసి, 'ఆఁ, ఏం లేదులే, భయం లేదు' అని అందరినీ చక్కబెట్టాడు. అటువంటి శివుడు మీ కోరికలు నెరవేర్చుగాక.
అని.
కుటుంబమంటే ఏమిటి? అసలు ఇష్టాఇష్టాలు కలవని మనుషులు పదుల సంఖ్యలో ఒకే పంచన బతికి, దాన్ని ఒక వ్యవస్థగా ఎలా మార్చగలిగారు? ఏ జీవిత భాగస్వామ్యం, ఏదైతే ఇప్పుడు ఒక ఆడా-మగా ద్వయానికే పరిమితమైందో అది, ఒకప్పుడు ఈ నేల మీద చిన్న పిల్లవాడి దగ్గరనుండి, పండు ముదుసలి వరుకూ ప్రతీ ఇద్దరిమధ్యనా నానావర్ణభూయిష్ఠమై ఎలా కుదిరింది? ఇవన్నీ ఇప్పుడు ఎవరూ అడగని ప్రశ్నలు. మన దేశంలో పరాయి పాలన వల్ల కూలిపోయి శిల్పాలూ, కట్టడాలతో పాటు నిర్వికల్పసమాధిలోకి వెళ్లిపోయిన సద్వస్తువుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒకటి.
శివుడి కుటుంబం మీద చాటువులు బోలెడన్ని ఉన్నాయి. నాకు తెలిసి దీనికి ప్రధానమైన కారణం - ఆయన సర్వసంగపరిత్యాగి అయ్యుండి కూడా ప్రపంచంలో ఎవరికీ సాధ్యపడని వ్యతిరేకగుణాలున్న వారిని (జంతువులతో సహా) కలుపుకుని, తన దగ్గర కుటుంబంలా పెట్టుకుని పేరోలగముండటం. ఈ చమత్కారం కవితాత్మకమైన కారణమైతే, అటువంటి సభ్యులున్న కుటుంబం కూడా సనాతమై నిలచింది కాబట్టి, ఆనాటి కుటుంబాలకి అది ఒక ఆదర్శమవడం రెండవకారణం. అలాగే, ఉన్నతిని పొందటానికి ఇల్లూ వాకిలీ విడవక్కరలేదన్న విషయాన్ని, మనుషులతో పాటు ఇతరజీవులూ సమానమే అన్న విషయాన్నీ, శివుడు చెప్పకనే చెబుతున్నాడు. మన దేవతల్లో ఇటువంటి కుటుంబమున్న ఇంకో దేవుడు లేడు. వైయక్తిక స్వేచ్ఛనీ, కుటుంబ వాతావరణాన్నీ ఎలా సమపాళ్లలో ఉంచుకోవాలో శివుడే తాను విరాగి అయి ఉండీ ఒక పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండటం ద్వారా చెబుతున్నాడు.
ఈ పద్యం ఒక ఘట్టపు చిత్రణ.అది కలహపూరితమైనది. ఇది అస్తమానూ జరిగేది కాదు, అస్సలు జరగనిదీ కాదు. ఇందులో శివుడి కుటుంబంలోని ప్రతీ సభ్యుడూ తమ తమ సహజగుణాన్నే చూపించాయి. ఆ గుణం కూడా ఇతర సభ్యులకి లేదా తమకి (భయము) నష్టం కలిగించేదే. ఇక్కడ ఇతర సభ్యుల కోసం తమ స్వభావాన్ని అణచుకోవడం కనిపించదు. అంటే కుటుంబంలో కలహాలు వస్తాయి కానీ, ఆ వాతావరణం సహజంగా ఉండదు. కానీ జరుగుతుంది. జరిగినప్పుడు ఈ పద్యంలో లాగా కేవలం ఒక్కరిద్దరే కాదు, కుటుంబంలోని ప్రతి సభ్యుడూ ఆ పరిస్థితి బారిన పడి కష్టపడవచ్చు. అప్పుడు కుటుంబపెద్ద అయిన శివుడికి నవ్వు వచ్చింది - అదీ సహజంగా. ఆ నవ్వు పరిహాసం కాదు. తన కుటుంబంలోని సభ్యులని అర్ధం చేసుకోవడం వల్ల వచ్చిన నవ్వు. ఆ నవ్వుతో శివుడు కుటుంబంలో పెద్దరికాన్ని సూచిస్తున్నాడు. ఆ పెద్దరికం వయసు వల్లో, భర్తకాబట్టో వచ్చింది కాదు. ఇతర సభ్యులు తమ సహజగుణానికి లొంగిపోతే, శివుడు లొంగక, పరిస్థితిని పరికించగలిగాడు. వారివారి మనోభావాలని అర్ధం చేసుకోగలిగాడు. తత్సూచకంగానే నవ్వు వచ్చింది, కుటుంబంలో ఇదీ సాధారణమే అన్నట్లుగా. ఇదీ పెద్దరికాన్ని సూచించే లక్షణం. మన కుటుంబంలో ఈ పెద్దరికం అందరికీ ఉండాలి. వయస్సువల్లో, తమ తోటి కోడళ్లూ, కొడుకులకంటే ధనాధిక్యత కలిగి ఉండటం వల్లో ఈ పెద్దరికం రాదు. వచ్చినా అది పెద్దరికమవదు - అదే శివుడి నవ్వు కల్పనలోని ఉద్దేశ్యం. అదే ఈ పద్యానికి జీవస్థానం.
మరి ఆ పెద్దరికాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. అదే 'సంతరించికొను' అన్న పదం. సమస్యకి తగ్గ క్రియ. అందరినీ ఊరుకోబెట్టడం. ఇది చేసినవాడే పెద్ద. ఈ పెద్దరికం కుటుంబంలోని ప్రతీ వ్యక్తీ సందర్భాన్ని బట్టి ప్రదర్శించాల్సిరావచ్చు. గుణంగా అది వేరే వేరే పాళ్లలో అందరిదగ్గరా ఉండాల్సిన లక్షణం. అప్పుడు కలిసి ఉండమనీ, విడిపొమ్మనీ ఎవరూ ఏ కుటుంబ సభ్యునికీ చెప్పక్కర్లేదు.
2
నిఖిలభూధరదరీనిమ్నోన్నతస్థలీవిహరణాగతమైన వెనుకబెణుకుఁ
యమిరక్షణార్థమై యమహృత్కవాటంబుఁ బగులదన్నిననాఁటి పాతనొప్పి
బ్రహ్మాదిసకలనిర్జరకృతార్చనకాలమున నిల్వఁబట్టిన మొనయుగుదులు
నేకాంఘ్రిపై నిల్చి నృత్యమత్యంతంబు విరచించునాఁటి తిమ్మిరియుఁ దీర
తోమి గ్రుద్దెదఁ బిసికెద ధూళిఁదుడిచి
వ్రేళ్లు విరిచెదఁ జూపవే కాళ్లు తండ్రి!
నిగమనుతకీర్తి! యెలకుర్తి నగరవర్తి!
యీశ! మల్లేశలింగ! క్షమాశతాంగ!
ఒక భక్తుడు శివుడితో ఇలా అంటున్నాడు -
లోకరక్షణ కోసం సమస్తమైన పర్వతాలు, గుహలు, ఎత్తులు లోతులు తిరుగగా పుట్టిన బెణుకు, ముని అయిన మార్కండేయుని రక్షించడానికి యముని గుండెని తన్నినప్పుడు కలిగి ఇంకా సలుపుతున్న అప్పటి నొప్పి, బ్రహ్మాది దేవతలు నిన్ను నిలబెట్టి పూజ చేసేటప్పుడు నీకు కలిగే గుదులు, ఒకే పాదాన్ని ఆనించి అభినయిస్తూ నాట్యం చేసేటప్పుడు నీకు కలిగే తిమ్మిరి - ఇవన్నీ తీరే విధంగా తోమి, మర్దించి, పిసికి, ధూళి ని దులుపి, హాయి కలిగేలాగ నీ వేళ్ల మెటికలు విరుస్తాను. యెలకుర్తి పట్టణ మల్లేశస్వామీ! నీ పాదాలని నాకు చూపించు!
3
తారకాసురభుజాదర్పంబుదెగటార్చు ఘనుఁగన్నతండ్రి మా యనుగు వేల్పు
కుండలిజ్యావల్లి కొండవింటను గూర్చు విలుకాండ్రమేటి మా కులగురుండు
తలిరాకుబాకు గద్దరి వజీరుని క్రొవ్వు మట్టుపెట్టిన దిట్ట మాకుఁ బ్రాపు
హత్తి తెల్లనిగిత్త కత్తలాణమునెక్కి మహి మించునెఱకాడు మా ధనంబు
జాటజూటాగ్రవీథిని జహ్నుకన్య
మమతనిడుకొన్న వగకాడు మా బలంబు
పార్వతీసాధ్వి సామేనఁ బాదుకొల్పి
వెలయుపటుశీలి మా పాలి వేల్పుమొదవు.
తారకాసురుడి గర్వాన్ని ఎండగట్టిన ఘనుడైన కుమారస్వామిని కన్న వాడు మాకు ముఖ్యమైన వేలుపు. పాముని కొండవింటినారిగా చేసిన మేటివిలుకాడు మా కులగురువు. చిగురాకులని బాణాలుగా కలిగిన నేర్పరి మన్మథుడి కొవ్వు దించిన దిట్ట మా ఆశ్రయము. యేనుగులాంటి తెల్లని గిత్త రథంమీద యెక్కి అతిశయించే పరిపూర్ణుడు మా ధనము. జడల మీద గంగని మమతతో ఉంచుకొన్న విలాసవంతుడు మా బలము. పార్వతీదేవిని సగందేహంలో పాదుకొల్పి ప్రకాశించే బలవంతుడు మా కామధేనువు.
4
ఆలపోతులఱేని నాతని పగవానిఁ బెంపంగఁ జంపంగఁ బెంపు గలిగి
హాలాహలపుమందు హల్లకములవిందు గుడువంగ ముడువంగఁ గోర్కి గల్గి
ఎడమదిక్కువధూటి జడలమక్కువబోటిఁ బొలపింప వలపింపఁ పొందు గలిగి
పచ్చియేనికతోలు ప్రాఁతకంగటికాలు కట్టంగఁ బట్టంగఁ గణక గల్గి
ఎసగి లోకంబులీరేడు నేలువాని
మిగులఁ బొడవైన తెల్లని మేనువాని
మహితవృషరాజునెక్కిన మహిమవాని
మృడునిఁ గనుగొంటినంతట మేలుకొంటి.
ఆవుల రాజైన నందిని పోషించేటటువంటి, నందికి శత్రువైన అధర్మాన్ని చంపేటటువంటి అతిశయం కలిగీ; హాలాహలమనే మందుని కుడిచేటటువంటి, చెంగలువల అతిథి అయిన చంద్రుడిని ముడిచేటటువంటి కోర్కె కలిగీ; యెడమదిక్కున ఒక స్త్రీకి చిరునామా ఇచ్చేటటువంటి, జడలంటే ఇష్టపడే ఇంకొక స్త్రీని మోహింపచేసేటటువంటి కలయిక కలిగీ; పచ్చి ఏనుగు చర్మాన్ని కట్టుకునే, పాత మంచపు కోడుని పట్టుకునే ప్రయత్నం కలిగీ;నందిని అధిరోహించి, మహిమాన్వితుడై పదునాలుగు లోకాలని పరిపాలించే తెల్లని మేను కలిగిన పరమేశ్వరుని కనుగొన్నాను. తరువాత మేలుకొన్నాను.
5
శీతాద్రియామ్యదిక్సీమభూములుఁ గంటిఁ జెలువైన కేదారశిఖరిఁ గంటి
ఉగ్రుని నిజకాంత నుమఁ జెంత కనుగొంటి మధుమాధవుని దైత్యమథనుఁ గంటి
కంటి విఘ్నేశ్వరు గణనాథు కనుగొంటిఁ జండభైరవుని గోస్వామిఁ గంటి
ఉత్తమసంస్తుత్యునుత్తరార్కునిఁ గంటి గాలభైరవు ఛన్నఘంటఁ గంటి
కంటి వటవృక్షమాదిమగంగఁ గంటి
గంటిఁ కేదారకుండోదకములు గ్రోలి
మహితవృషరాజునెక్కిన మహిమవాని
మృడునిఁ గనుగొంటినంతట మేలుకొంటి.
మంచుకొండలలో చందనాలతో కూడిన భూములని చూశాను. రమ్యమైన కేదారశిఖరాన్ని చూశాను. ఉగ్రుడైన శివుని కాంత పార్వతీదేవిని శివుని దగ్గర ఉండగా చూశాను. అక్కడే కొలువైన విష్ణుమూర్తిని చూశాను. గణనాథుడైన విఘ్నేశ్వరుడినీ, భైరవుడినీ, నందినీ చూశాను. ఆదిత్యుడైన ఉత్తరార్కుడినీ, కాలభైరవుడి ఛన్నఘంటనీ చూశాను. వటవృక్షాన్నీ కాంచాను. గొప్పదైన నందివాహనాన్ని ఎక్కిన మహిమాన్వితుడైన మృడుడిని చూశాను. తరువాత మేలుకొన్నాను.
(ఈ రెండు పద్యాలూ 'మృడుని కనుగొంటి ' అనే కవితలోనివి. )
6
సర్వసర్వంసహాసముదయంబు రథంబు రథమధ్యముననున్న రాయి విల్లు
విల్లువెంబడి దిర్గు వెలుగులు చక్రాలు చక్రాలకును వైరి చారు నారి
నారి బట్టుక తిర్గునాగరకుడు గరి గరిమీద విహరించు ఘనుడు శరము
శరము నాభికనున్న శతవృద్ధు సారథి సారథి మాటలు సైంధవములు
గాగ నేగుదెంచి కణకతో బురములు
గెలిచినట్టి ఘనుడు గిరిజతోడ
గలసి యుండునట్టి కరుణాసముద్రుండు
నిష్టసిద్ధులొసగు నెలమి మనకు.
అన్ని వస్తువుల సమాహారమూ రథము కాగా (భూమి), ఆ రథం మధ్యలో ఉండే రాయి విల్లు కాగా (మేరుపర్వతం), ఆ విల్లు చుట్టూ తిరిగే చక్రాలు రథచక్రాలు కాగా, ( ఆ పర్వతం చుట్టూ ఉదయించి అస్తమించే సూర్యచంద్రులు), ఆ చక్రాలకు శత్రువైనది నారి కాగా (ఆదిశేషుడు), పక్షిమీద విహరించే ఘనుడు శరము కాగా (విష్ణుమూర్తి), ఆ శరము నాభిలో ఉన్న అతిపెద్ద ముసలివాడు సారథి కాగా (బ్రహ్మదేవుడు), ఆ సారథి మాటలు గుర్రాలు కాగా (వేదాలు); యేతెంచి ప్రయత్నంతో మూడు పురాలని గెలిచిన ఘనుడు , పార్వతీదేవితో కలిసి ఉండే కరుణాసముద్రుడైన శివుడు మన కోరికలని ప్రేమతో ఇచ్చుగాత.
6
మనము గారామునఁ బెనిచినయట్టి చకోరికాశిశువులాకొనక యుండ
మన గొజ్జగల తోటమహి నిందుకాంతంపుఁ బాదులలో నీళ్లు పాయకుండ
మన కేళికావన మధ్య దీర్ఘికలలోని తొగలొకయప్పుడు మొగుడకుండ
మన సరోజినిలోన మరిగిన జక్కవదోయి నీ చనుదోయి దొరయకుండ
నుండుఁగాని సదాశివుండొడ్డినాడు
మొలకచందురు గెలువుమీ పలుకుననుచు
నగజ చెలులాడు మాటలకలరు శివుడు
మనలఁ గరుణావిధేయుడై మనుచుగాఁత.
శివపార్వతులు సల్లాపాలాడుతున్నారు. తన మాట నెగ్గించుకునేందుకు శివుడు, 'నేను చెప్పినదే నిజం, కావాలంటే, నా శిరసుమీద ఉన్న చంద్రుడ్ని పందెం కాస్తున్నాను' అని అన్నాడు. అది విన్న పార్వతీదేవి చుట్టూ ఉన్న చెలికత్తెలు ఇలా అంటున్నారట -
"సఖీ, పార్వతీ! మనం గారాబంగా పెంచుకుంటున్న చకోరపక్షి పిల్లలు ఆకలితో అలమటించకుండా, మన చేమంతితోటలో ఉన్న ఇందుకాంతపు పాదులలో నీళ్ల కరువు రాకుండా, మనం విహరించే వనాలలోని బావులలో కలువపూలు ముడుచుకొని పోకుండా, మన తామరకొలను దగ్గర కలిసి విహరించే చక్రవాక పక్షుల జంట నీ చనుదోయికి సమానం కాకుండా ఉంటుందిలే, ఈ మాటని గెలువు, సదాశివుడు చంద్రుడ్ని ఒడ్డాడు"
ఈ మాటలు విని, సంతోషాన్ని పొందిన శివుడు మనలని కరుణతో రక్షించుగాక.
~~~
(సశేషం)
No comments:
Post a Comment