ఏదీ నా హృదయమ్ము? చిక్కుకొని రాదే! యాంధ్రభోజుండు ఘో
రోదారక్రమనైపుణీ సమధృతాస్యుద్భాసియౌ పాణి నే
దో దామోదర దత్తశాసన మిషాయోగాన సంధించి నా
పై దారల్ వలె వోసినట్టి తన కావ్యాబద్ధవర్ణాళిలోన్.
ఒక మామూలు కథ కావ్యంగా ఎలా మారుతుంది? ఒక కావ్యం విన్నప్పుడు మనసులో పుట్టే తీయనైన పొంగు, వేరే చోట యెందుకు కలగదు? కావ్యాలలోని భాష పైనుండి దిగివచ్చిందా? కాదే! అవే పదాలు, అవే అక్షరాలు. కానీ ఏ సాహిత్యప్రక్రియలోనూ లేని ఒక ఇంద్రజాలం కావ్యంలో ఉంది. మామూలు జీవితంలో యే పనిలోనో నిమగ్నమై, ఏదో సంబంధంలేని విషయం మనసుని ఆక్రమించినపుడు ఉన్నట్టుండి మేఘం కప్పిన గగనంలో తటిల్లత మెరిసినట్లు ఒక కావ్యపు కవిత మనసులోకి రాగానే ఆ క్షణం మనసు పొందే ఆనందం ఏ పోలికా వర్ణించలేనిది.
మనకి చాలా రకాల దానాలున్నాయి. అన్నదానమనీ, విద్యాదానమనీ, ధనదానమనీ ఇలా. ఏ దానపు నిడివి దానికి ఉంది. ఒక అన్నదానపు నిడివి ఒక పూట కావచ్చు. విద్యాదానపు నిడివి ఒక జీవితంలోని మజిలీ కావొచ్చు. కానీ ఒక కవి మనకి ఒక తీయని కవితని దానమిస్తే, ఆ కవితని పుచ్చుకున్ననాటి నుండీ, మన ఊపిరి ఆగేవరకూ దాని నిడివి ఉంటుంది. ఆ కవితని తల్చుకున్న ప్రతీసారీ తన్మయత్వంతో మన కళ్లు సగం మూతపడతాయి. పెదాల చివర్లు సుతారంగా సాగుతాయి. మనసు చిన్నపిల్లలా తటాలున గెంతుతుంది. ఊపిరి స్తంభిస్తుంది. ప్రాణం తన కదలికని కాసేపు అందంగానే కోల్పోతుంది. ఈ అనుభూతికంతటికీ 'రసానంద'మని పేరు. కావ్యం చదివే పాఠకుడికి ఈ రసానందాన్ని ఇచ్చేది గొప్పదైన కావ్యం.
తెలుగులో ఈ ఆనందాన్ని చదివిన ప్రతీసారీ మనకి ఇవ్వగలిగే అతికొద్ది కావ్యాలలో ఒకటి ఆముక్తమాల్యద. ఈ కావ్యాన్ని రచించింది విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు.
ఆనాటి భారతం సంపన్నభారతం. ఆనాటి విజయనగరం ముందు నేటి లండన్, రోమ్ నగరాలు దిగదుడుపు. ఆ నాటి ప్రజల భోగం ముందు నేటి అగ్రరాజ్యాల విలాసాలు దిగదుడుపు. అంత సంపద, అంత వైభవమున్నా, వారి దానశీలత ముందూ, త్యాగగుణం ముందూ నేటి హిమాలయస్వాములు దిగదుడుపు. ఆనాటి వారి కళల ముందూ, వృత్తుల ముందూ, నైపుణ్యాల ముందూ ఈ నాటి softskills expert లు దిగదుడుపు.
వారు మొద్దు రాళ్లని సుతిమెత్తని స్త్రీలుగా మార్చగలరు. మామూలు పదాలని మహాకావ్యాలుగా తీర్చగలరు. రత్నాలని కుప్పలుగా అంగళ్లలో పేర్చగలరు.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం దక్షిణభారతాన్నంతటినీ ఆక్రమించి, భాషల హద్దులని చెరిపేసింది. ఆ విస్తరణకీ, ఆ ఉన్నతికీ కారణం కృష్ణదేవరాయల పరాక్రమమే. తురుష్కులు, గజపతులు - ఇలా అనాటి ప్రతీ పాలకవర్గమూ అయితే రాయలచేతిలో ఓడిపోయి లేదా సంధి కుదుర్చుకొని సామంతరాజ్యమయింది.
అల్లసాని పెద్దన ఆతని పరాక్రమం మీది చెప్పిన ఈ చాటువు చూడండి -
శ్రీ లీలాత్మజ! కృష్ణరాయ! సమరోర్విన్ నీదు వైరిక్షమా
పాలుర్వీఁగి హయాధిరూఢులగుచుం బాఱన్ వనీ శాఖిశా
ఖాలగ్నాయతకేశపాశులయి యూఁగన్ గేకిసల్గొట్టి యు
య్యాలో జంపలొ యంచుఁ బాడుదురు భిల్లాంభోజపత్రేక్షణల్.
యుద్ధభూమిలో అలసిపోయి రాయల మీద భయంతో శత్రురాజ్యాల రాజులు గుర్రాలమీద పారిపోతూండగా ఆ అడవులలోని చెట్లకొమ్మలకు వారి పొడవాటి జుత్తులు బలంగా చిక్కుకొని గుర్రాల పైనుండి జారి చెట్లకి వేలాడతారట. వాళ్లలా ఊగడం చూసి అక్కడి బోయస్త్రీలు చప్పట్లు కొడుతూ 'ఉయ్యాలా, జంపాలా' అని పాడతారట!
అంతేనా, ఇది వేరే చాటువు -
కలనం దావకఖడ్గఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మం
డల భేదంబొనరించి యేఁగునెడఁ దన్మధ్యంబునన్ హార కుం
డల కేయూరకిరీటభూషితుని శ్రీనారాయణుంగాంచి లోఁ
గలగం బాఱుచు నేఁగు నీవ యను శంకం గృష్ణరాయాధిపా.
కృష్ణరాయుడి ఖడ్గంతో చంపబడిన శత్రురాజు పైలోకాలకి వెడుతూ సూర్యమండలాన్ని దాటుతున్నాడట. అక్కడ హారాలతోనూ, కుండల కేయూర, కిరీటాది అలంకారాలతోనూ తీరి కూర్చుని ఉన్న సూర్యనారాయణుడ్ని చూసి శ్రీకృష్ణరాయలేనేమో అనిపించి భయంతో పరుగులు పెడుతున్నాడట!
ఒక మాటలో చెప్పాలంటే, తేలిక తేలిక పదాల దగ్గరనుండీ మహాపండితుడికి మాత్రమే అర్థమయ్యే అలంకారపదభూయిష్ఠమైన పద్ధతివరకూ అందరూ కృష్ణరాయుడి పరాక్రమాన్ని ప్రతీ భాషలోనూ ప్రస్తుతించారు.
ఒక పేరు తెలీని సంస్కృతకవి చెప్పిన ఈ శ్లోకం చూడండి -
వీరాగ్రేసర, కృష్ణరాయ! భవతా కృత్తారణ ప్రాంగణే
ప్రౌఢాః కేచన పారసీకపతయః ప్రాప్తాః పురీమామరీమ్।
పీరుత్తేతి గురౌ, వలద్విషి సురత్తాణేతి, శచ్యాం పునర్
బిబ్బీతి, ప్రణతౌ సలామితి సురాన్ స్మేరాననాన్ కుర్వతే॥
కృష్ణరాయల చేతిలో మృతినొంది కొంతమంది పారసీకప్రభువులు స్వర్గానికి వెళ్లారట. అక్కడంతా వారి మతం కాని వ్యవహారం. బృహస్పతిని చూసి పీరు సాహెబనీ, ఇంద్రుడిని సుల్తాననీ, శచీదేవిని బీబీగారనీ సంబోధిస్తూ,నమస్కారానికి బదులు సలామని అంటూ అక్కడి వారందరికీ నవ్వు తెప్పిస్తున్నారట.
ఈ గొడవంతా నేను చెప్పడానికి కారణం - ఆ కాలంలో కృష్ణదేవరాయలు కేవలం రాజుగా కాదు, అపరభగవదవతారంగా బ్రతికాడు. అంత బలంతో, అంత ఉచ్చస్థితిలో ఉన్నవాడి వ్యక్తిత్వం మనం ఊహించవచ్చు. అటువంటి వాడు కవి అవుతాడా? రాజ్యాలని గడగడలాడించి, సొంత కోటకి తిరిగివచ్చి, ఒక పూవుని చూసి ఊహ చేయగలగడం కుదిరే పనేనా? కానీ రాయలు యెంత రాజో అంత సుకుమారుడు. ఎంత తలపొగరు ఉన్నవాడో అంత తడిమనసు ఉన్నవాడు. యెంత యుద్ధనీతి ఉన్నవాడో అంతటి కవితాకౌశలమున్నవాడు. అన్ని పరస్పరవ్యతిరిక్తాలైన గుణాలూ అమరిన ఒక విరళమైన మనిషి. కొన్ని వందల యేళ్లకు ఒకసారి మాత్రమే పుట్టే మనిషి. భోజుడి తరువాత భోజుడంతటివాడు.
తెలుగు విమర్శలో స్వారస్యాన్ని చూపించిన రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు రాయలమీద ఒక సభలో ప్రసంగం చేసారు. దాని పాఠం "రాయల వైదుష్యము" అనే పేరున ఒక వ్యాసంగా వచ్చింది. అందులో ఆయన మాటలను ఇక్కడ ఇస్తున్నాను:
శ్రీకృష్ణదేవరాయలవంటి వానిని తలచుకొన్నపుడు మనకు కడుపుమంట గాక మరేమి కలుగును? అతడేమి నెపోలియను వంటి పరదేశీయుడు కాడు, మనకు వానితో పనియేమి యని యూరకుండుటకు; వేయి చేతుల కార్తవీర్యార్జుని వలె విచిత్రపురుషుడు కాడు, తప్పు సృష్టికర్తపై వేయుటకు; పురాణపురుషుడు కాడు, కల్పితవ్యక్తి అని తృప్తిపడుటకు; మనదేశము వాడు, మన జాతివాడు; మనవంటి మనుష్యుడు. ఆతడు కడచని నన్నూరేండ్లైనను నిండినవో లేదో, అతనిని 'అచ్యుతాంశసంభవుడ"ని పెద్దనామాత్యుడు పొగడెను కానీ ప్రపంచమింకను దాసీపుత్రుడను మాటను పూర్తిగా మరచిపోలేదు. అట్టివాడు చేసిన పనులెన్ని! జయించిన యుద్ధములెన్ని! స్థాపించిన సామ్రాజ్యమెట్టిది! సంపాదించిన సంపత్తెంత! కట్టించిన కట్టడములెట్టివి!, వ్రాసిన, వ్రాయించిన గ్రంథములెన్ని! పోషించిన విద్యలెన్ని! ఇచ్చిన దానములెట్టివి!
ఈ వాక్యాలన్నీ అక్షరసత్యాలు. అటువంటి కారణజన్ముడు రాయలు. తమిళ, కన్నడ, సంస్కృతాది భాషలని తాను పోషిస్తూ, తుళు భాషలో పుట్టినవాడై ఉండి తెలుగుని చూసి, మురిసి, యే భాషలలోనూ లేనటువంటి కవిత్వాన్ని చెప్పినవాడు రాయలు. ఆతని రచన ఆముక్తమాల్యద.
కృతి వైశిష్ట్యం
ఆముక్తమాల్యద తెలుగులో ఉన్న ఐదు మహాకావ్యాలలో ఒకటి. ఆ స్థానం దానికి కలిగించిన ప్రత్యేకతలు రెండు. రెండంటే రెండే కాదు, ఆ రెండూ మిగిలిన ప్రత్యేకతలని పుట్టించాయి. మొదటి ప్రత్యేకత - ఈ కావ్యం సుళువుగానో లేదా కొంత శ్రమ పడటం వల్లో అర్థం కాదు.
నేనేదో గొప్పగా చెప్పానే కానీ, అర్థమవకపోవడం ఒక రచనకి యెప్పటికీ ప్రత్యేకత కాలేదు. ఇదేదో స్వంతపైత్యంతో తనకి మాత్రమే కనిపించే ఊహాలోకాన్ని చూస్తూ యేమి చూస్తున్నాడో సరిగ్గా చెప్పే సామర్థ్యమైనా లేక మతిభ్రమణంలో చెప్పిన కపిత కాదు. ఇది ఆ అర్థమవకపోవడం కాదు. తేలికగా అర్థమవదు అంటే ఇందులోని భాష కొన్నిచోట్ల కష్టమైనదని. కష్టమైన ప్రతీదీ మనం అసహ్యించుకోతగింది కాదే! ఒక్కోసారి జీవితంలో కష్టమైనదాన్ని లొంగదీసుకోవడంలో వచ్చే ఆనందం బాగుంటుంది.
పాయసం పంటికింద చాలా తేలిక. అదే ఒక జీడి అసలు తేలికగా కొరుకుడుపడదు. ముక్కలు చేయడమూ కష్టమే. మొత్తంగా నోటిలోకి పోనిచ్చి, ముందు దాని ఆకారాన్ని వశపరుచుకోవాలి. అన్ని వైపులా తడిచేయాలి. నాన్చాలి. మొత్తంగా పట్టాలి. అటూఇటూ తిప్పాలి. చప్పరించాలి. అపుడు అది కరిగి దాని రసం కొద్దికొద్దిగా అనుభూతికొస్తుంది. ఆ ఆనందం వేరు. ఆ రుచి వేరు. మనసుకి నచ్చిన అమ్మాయి ప్రేమని వెంటనే ఒప్పుకోదు. ఆమె చుట్టూ తిరగాలి. పాట్లు పడాలి. వేషాలు వేయాలి. అంత కష్టం పడ్డాక ఏదో ఒక రోజు ఆ అమ్మాయి అంగీకారంతో మనకేసి చూసి ప్రేమగా నవ్వితే, ఆ ఆనందం వేరు. కొన్ని విలువైన వస్తువులు కష్టం వెనుక దాక్కొని ఉంటాయి. వాటికోసం పడిన కష్టమూ ఆనందాన్నిస్తుంది. అటువంటి రచన ఇది. అటువంటి ఆనందాన్నిచ్చే రచన.
కృష్ణదేవరాయలకి కత్తిసాముతో పాటు పొలంగట్లు కూడా తెలుసు. గుర్రపుస్వారీతోపాటు చలికాలంలోని పేదల అలవాట్లు తెలుసు. రాజనీతితో పాటు బ్రహ్మోత్సవ ఆచారాలూ తెలుసు. యుద్ధరంగం కన్నా ప్రకృతి మరింత దగ్గరగా తెలుసు. పూలమ్మే ఆడవారూ, తెల్లవారి పొలంలో పనికొచ్చే ఆడవాళ్లూ, సంధ్యవార్చే బ్రాహ్మణులూ, బ్రహ్మరాక్షసులూ, గూఢచారులూ అందరూ తెలుసు. ఇందులోని పద్యాలన్నీ మరే భాషలోనూ దొరకని వర్ణనలు,సంస్కృతంతో సహా.
అంత కష్టపడి విప్పాక లోపల ఉన్నది డొల్ల అయితే వృథాప్రయాస కానీ, ఈ రచనలో పద్యమో, వచనమో యెంత కష్టంగా ఉంటే, అంత అందమైన భావాన్ని కలిగిఉన్నట్లు లెక్క. మచ్చుక్కి విష్ణుచిత్తుడు చేసిన దశావతార స్తుతిలో నరసింహావతారస్తుతి పద్యాన్ని చూడండి
—
మ.
అసురేంద్రాశయ కుండికాచ్ఛరుధిరవ్యాప్తస్వకచ్ఛాయఁ గాం
చి సముద్యత్ప్రతిసింహ మత్సరమిళచ్చేష్టన్ దదుద్గామ దీ
ర్ఘ సటాఝాటముఁ బెల్లగించుగతి నాంత్రశ్రేణిఁ గిన్కన్ వెరం
జు సితక్రూర భవన్నఖావళులు ప్రోచున్మర్త్యపంచాననా.
పై పద్యాన్ని ఒకసారి చదవండి. యెటునుండి విడగొట్టాలో తెలీని పరిస్థితి.
హిరణ్యకశిపుడి గుండెలు చీలుస్తున్నాడు స్వామి. ఆ హృదయభాగం ఒక కుండంలాగా ఉందట. కుండమంటే ఇక్కడ తెలుగు కుండ కాదు. పెద్దపెద్ద గుళ్లలో తీర్థ కుండాలు తెలుసుకదా. ఆ సంస్కృతం కుండమన్నమాట. అదీ మామూలుది కాదు, కుండిక - చిన్నకుండం. అందులో ఉన్న ద్రవం - ఆ రక్కసుడి రక్తం. అందులో స్వామి చూపు పడింది. అక్కడ స్వామి ప్రతిబింబం స్వామికే కనిపించింది. ఇంకో సింహమొచ్చింది అనుకున్నాడట. ఇదెవరు నన్ను మించిందా అనుకుంటూ దాన్ని బైటికి లాగుదామని అనుకుని వెంటనే దాని జూలుని పట్టుకుని బైటికి లాగాడట. వచ్చినవి హిరణ్యకశిపుడి ప్రేవులు!
నరసింహుడు హిరణ్యకశిపుడి ప్రేగులు బైటికి తీసింది వాస్తవమే. కానీ ఇంతటి అమోఘమైన కల్పన చేయగల దమ్మెవరికుంది? అంత ప్రతిభ ఎవరికుంది? ఇంత అందమైన ఊహకోసం ఈ పద్యాన్ని ముందు పెట్టుకుని ఏ వ్యాఖ్యానాన్నో నిఘంటువునో ఆశ్రయించినా ఆ శ్రమ గొడ్డుపోతుందా?
ఇపుడు ఈ కావ్యం రెండవ ప్రత్యేకత దగ్గరకి వస్తున్నాను. అది ఈ కవి భాషకి లొంగడు. భాషని లొంగదీసుకుంటాడు. అక్కడా ఈయనదే అధికారం. ఈయనదే పెత్తనం. ఆ విషయంలో రాయలు మహానిరంకుశుడు. మొండి. చేప అని వాడవలసి వస్తే, కావాలని 'మత్స్యం' అన్న పదాన్ని ఎన్నుకుని, దాన్ని తన పాండిత్యంతో 'మాత్స్యం' అని సాగదీసి, ఆ పదాన్ని వేస్తాడు. నిజానికి మత్స్యానికీ, మాత్స్యానికీ గణాలు ఒకటే. భావమూ ఒకటే. కానీ 'మామూలుగా వేస్తే నా గొప్ప ఏమిటి' అనుకునే రకం.
ఆ పద్యాన్ని అలా ఉంచండి.
మధురాపురి లో పుష్పలావికలున్నారు. వారికి రోజూ పోకిరీగాళ్లతో పాట్లు తప్పనివి. అలాగని ఈ అమ్మాయిలూ తక్కువ తిన్నవారు కారు. నిక్కమైన జాణలు. వారిద్దరి మధ్య ద్వ్యర్థి (పైకి ఒక అర్థం, లోపల ఒక అర్థం) సంభాషణలు, శృంగారపరమైనవి, ఈ కావ్యంలో ఉన్నాయి. అవి చదివి తీరాలి. అక్కడి జులాయివాళ్లు సంభాషణాచతురులు. మాటలతో ముగ్గులోకి దింపడంలో దిట్టలు. ముందు యెదురు చెప్పినా కాసేపటికి వారి మాటలకి కరిగిపోతారట ఆ అమ్మాయిలు. అదీ తమ మనసు ఇచ్చేంతగా. అపుడు వాళ్ల పరిస్థితి ఇదట -
సరసులనర్మ మింపుల నొసంగఁ గదంబపుదండఁ గట్టుచో
గరఁగుటఁ దెల్పుదృక్తరళకాంతులు నుత్తరమిచ్చునంతరాం
తరముల నవ్వులున్ గలువతండము మొల్లలు నంచు మిన్ను గ్రు
చ్చి రహిని రిత్తనూ లొసఁగి సిగ్గు వహింతురు పుష్పలావికల్.
సరసులైన ఆ మగవాళ్ల మాటలు వాళ్లకి నచ్చి, కడిమి పూల మాలని కడుతూ - ఆ మాటలు తమ మనసులని కరిగించాయని చెబుతున్నారా అనే విధంగా తమ కళ్లలో కాంతులు చిమ్ముతూ, ఆ మాటలకి బదులు చెబుతున్నారా అన్నట్లుగా తీయగా నవ్వుతున్నారట ఆ స్త్రీలు. ఇక్కడ కవిసమయం తెలియాలి. వారి కళ్లు కలువపూలలా ఉన్నాయి. అలాగే వాళ్ల నవ్వులు మొల్లలలా ఉన్నాయి. ఊహల్లో తేలుతూ ఆ అమ్మాయిలు తమ చూపులని కలువలుగానూ, నవ్వులని మొల్లలుగానూ భ్రమించి, వాటిని ఆకాశంలోనే దండగా అల్లినట్టు అభినయం చేసి, నిజమైన పూలని గుదిగుచ్చామని అనుకుని, చాలా ఉత్సాహంతో తమ ప్రియుడి చేతిలో పూలులేని ఒక మామూలు దారాన్ని పెడుతున్నారట. తరువాత తమ పొరపాటు తామే తెలుసుకుని సిగ్గుపడుతున్నారట!
విల్లిపుత్తూరు వర్ణనలో ఈ పద్యం చూడండి -
మలయపు గాలి రేలు వనమాలి విమాన పతాకఁ ఘల్లుమం
చులియఁ బసిండి మువ్వగమి నొక్కొక మాటు గదల్ప నుల్కి మి
న్నలము తదీయ హేమ వరణాంచలచంపకశాఖలందు బ
క్షులు రొదసేయఁ వేఁగెనని కూడుదురల్కలు తీరి దంపతుల్.
అది రాత్రివేళ. యెక్కడో మలయ పర్వతం మీదనుండి వీచిన గాలి విల్లిపుత్తూరు మన్నారుస్వామి ఆలయంలో గాలిగోపురాన్ని తాకింది. అక్కడి చిరుగంటలు ఆ గాలికి కదిలాయి. ఆ గంటల నుండి శబ్దం పుట్టింది. ఆ శబ్దానికి భయపడి ఆ కోవెల ప్రాకారంలోని అంచుల మీద ఉన్న సంపెంగ చెట్ల కొమ్మలలో నిదురిస్తున్న పక్షులు మేల్కొని కిలకిలమన్నాయి. ఆ కూతలకి తెల్లవారిందేమో అనుకుని అప్పటివరకూ ఒకరిమీద ఒకరు ప్రణయకోపంతో ఉన్న దంపతులు కలుసుకున్నారట!
ఈ పద్యం Butterfly Effect కు ఉదాహరణ.
ఇదే ఈ కావ్యం ప్రత్యేకత. యెంత భక్తి ఉంటుందో అంత శృంగారముంటుంది. యెంత ఆధ్యాత్మికత ఉంటుందో అంత లౌకికమూ ఉంటుంది. యోగంతో పాటు భోగమూ ఉంటుంది.
ఈ కావ్యంలో ఊహలు,వర్ణనలూ మనకి ఎక్కడా దొరకని విలువైన రత్నాలు. ప్రబంధప్రక్రియలో వర్ణనలకి పెద్దపీట. కానీ ఈ పుస్తకంలో వాటి పాళ్లు ఎక్కువగానే ఉంటాయి. అంతే కాదు, ఒక కథ చెప్పాలంటే కృష్ణదేవరాయలే చెప్పాలి. ఈ కావ్యపు కథ నేటి గొప్ప గొప్ప సినిమాల స్క్రీన్ ప్లేకి ఏ మాత్రమూ తీసిపోదు. ఒక కథలోనుండి ఇంకొక కథలోకి, అక్కడ నుండి వెనుకకీ, ముందుకీ, యే సన్నివేశం ముందు యే సన్నివేశముండాలో, ఏ సన్నివేశం తరువాత ఏ సన్నివేశముండాలో - ఈ లెక్కలన్నీ నిక్కచ్చిగా తెలిసిన చక్కనైన మహాకవి రాయలు. మాలదాసరి కథనీ, చూడికుడుత్తై కథనీ రాయలే చెబుతుండగా చదవాలి. ఋతువులని రాయలే వర్ణించాలి. ఉత్ప్రేక్షలనీ, రూపకాలనీ, రాయలే అల్లాలి. ఆ పద్యాలు మనం చదవాలి.
ఇందులోని మంచి పద్యాలని యెంచి రాయడమొక తలనొప్పి. నాలాంటి వాడికి ఈ పని మరీ కష్టం. ఇక్కడితో ఆ పనిని ఆపుచేస్తున్నాను.
కావ్యహృదయం - హృదయార్పణ
ఆముక్తమాల్యద కథని నేను చెప్పదలచుకోవడం లేదు. మీకు అంతర్జాలంలో అది తేలికగానే దొరుకుతుంది. కాబట్టి ఆ పని మానుకుని, ఈ కావ్యపు హృదయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను.
పైకి పాషాణంలా ఉన్న కావ్యాన్ని పట్టుకుని, యే పండితుడికో శ్రమ చేయగలిగేవాడికో మాత్రమే అర్థమవుతుందని చెప్పి గొప్పతనాన్ని అంటగట్టి ఈ కావ్యాన్ని మహాకావ్యమనలేము. దక్షిణభారతంలో అతిపెద్ద అధికారాన్ని అనుభవించినవాడి కృతి అని చెప్పి ఈ కావ్యాన్ని మహాకావ్యమనలేము. చదవడానికి కష్టంగా ఉన్నా అర్థం తెలిసాక ఊహలేవో కొత్తగా ఉన్నాయి కనుకా, వ్రాసిన కవి మహాప్రతిభావంతుడు అని తెలుస్తుంది కనుకా ఈ కావ్యాన్ని మహాకావ్యమని అనలేము. శైలిలోనూ, కథనంలోనూ విలక్షణత్వం ఉందనో; కావ్యగుణాలైన శయ్య, ఛందము, ధ్వని, రసము, శబ్దార్థాలంకారాలూ పుష్కలంగా ఉన్నాయనో గమనించి ఈ పుస్తకాన్ని కావ్యమనవచ్చునేమో కానీ మహాకావ్యమని అనలేము.
ఈ కావ్యం తెలుగుకావ్యాలలోనే గొప్పది కావడానికి కారణం వేరే ఉందని నా ఊహ. పై గుణాలన్నిటికీ ఒక లోతైన అంశం కలిసింది. ఆ కలయికే, ఆముక్తమాల్యద ముందూ, తరువాతా కూడా యెన్నో ప్రబంధాలు పుట్టినా, దాని స్థానాన్ని పదిలపరచింది.
ఈ కావ్యంలో కథలెవరివి?
బాగా అలంకరించుకుని ఉంపుడుకత్తె దగ్గరకి పోతూ, కేవలం ఒక శ్లోకం విని వైరాగ్యం పొందిన ఒక రాజ్యాధినేత. యెన్నో అవకాశాలు వచ్చినా, చుట్టూ వారు చెప్పినా, ధర్మానికి కట్టుబడి తమ్ముడి దగ్గరనుండి రాజ్యం లాక్కోని ఒక సోదరుడు. ముందు భక్తుడై, గెలుపులని చూసి, భోగలాలసుడై తరువాత కనువిప్పు పొంది వైరాగ్యాన్ని పొందిన ఒక మహారాజు. భగవంతుడి సేవలో ఉంటూ చదువురానివాడైనా భక్తి ఫలితంగా పండితులని మహావాదాలలో గెలిచి, ఒక కూతురిని సైతం కనుక్కున్న ఒక పెద్దాయన - ఇవి ఉపకథలు.
ప్రధానకథలు ఇద్దరివి. మొదటివాడు మాలదాసరి. ఆతని పని- ప్రతిరోజూ గుడికి వచ్చి విష్ణువు ముందర తన హృదయాన్ని పెట్టి, చేతిలోని కిన్నెరవీణని మీటుతూ మంగళకైశికీ రాగంలో పాడతాడు. పాడుతున్నపుడు కళ్లవెంట ధారాపాతంగా నీళ్లు కారుస్తాడు. నాట్యం చేస్తాడు. పాడినంతసేపు పాడి, స్వామికి నమస్కరించి, బయటికి వస్తాడు. స్వామికి అభిషేకం చేసిన నీళ్లని యెవరితోనో పోయించుకుని మహాప్రసాదంలా సేవిస్తాడు.
రెండవ కథ ఒక కన్నెపిల్లది. ఈమె మహాసౌందర్యరాశి. భగవంతుడ్ని ప్రేమిస్తుంది. పొద్దున్నే లేచి, స్నానాదులు చేసి కృష్ణపూజకి వెళుతూ యశోదనూ గోపిలకనూ అందరినీ పూజకి రమ్మని పిలుస్తుంది. భగవంతుడికి వేద్దామని అల్లిన పూదండలని సింగారంగా ముందు తాను అలంకరించుకుంటుంది. ఆలయానికి వెడుతుంది. ముగ్గులు పెడుతుంది. నైవేద్యాలు అర్పిస్తుంది. ఇంటికి తిరిగివస్తుంది. పాటలు పాడుతుంది. వీణ వాయిస్తుంది. యౌవన బాధలనీ పడుతుంది.
వీరిద్దరూ ఈ కథలో గెలుస్తారు. మాలదాసరి ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడి మీద మీద గెలిస్తే, గోద రంగనాథుడ్ని గెలుస్తుంది. తద్వారా జీవితంలోనే గెలుస్తారు. వీరే కాదు, ఉపకథలలో ఉన్నవారూ గెలుస్తారు. ఇది వీరందరి గెలుపు కథ.
ఈ గెలుపు కథలెందుకు చదవాలి అంటే, ప్రస్తుత ప్రపంచంలో గెలుపొక కుళ్లు. లక్ష్యం ముఖ్యం కానీ దానికి యెలా చేరుకున్నామో ముఖ్యం కాదనే ఒక తుచ్ఛమైన, వ్యక్తిత్వం లేని నిర్వచనం మనది. కపటం లేని హృదయం పడే ఆనందం నీకు తెలుసా? ఆ హృదయపుటెత్తులు నువ్వందుకోగలవా? అటువంటి వస్తువుని నువ్వు ఊహ చేయగలవా? గోదాదేవినీ, మాలదాసరినీ నిజంగా నీ బుద్ధితో చూసి పిచ్చివాళ్లని అనుకోకుండా ఉండగలవా? వారి గొప్పదనాన్ని గుర్తించగలవా? వ్యక్తిత్వాన్నీ, ఆ బలాన్నీ నిర్మించుకుని విలువలతో తలెత్తుకుని బ్రతకగలవా?
జీవితంలో గెలుపనే ఒక లక్ష్యాన్ని చూడక, బ్రతుకునే దివ్యంగా మార్చుకుని, అలా బ్రతకడంలో గొప్పతనాన్ని పొంది, దాని నుంచి జారిపోకుండా ఉండి, మిగిలిన వాళ్లెవరూ పొందలేని ఉన్నతులని పొందిన మనుషుల జీవితాలివి. విజయానికి ఉన్న అసలైన భారతీయ దృష్టిని బయటపెట్టే కథలివి.
స్వచ్ఛమైన హృదయం పొందే గెలుపు, ఆ విజయవైభవమే ఈ కావ్యం. మనందరికీ ఒక మార్గదర్శకం. అసలైన ఆనందపథాన్ని 'ఇదిగో' అంటూ చూపించే ఒక టార్చిలైటు ఆముక్తమాల్యద.
*
ఇంతకీ ఆముక్తమాల్యద అంటే అర్థం నేను చెప్పలేదు కదూ. 'ముక్త' అంటే విడువబడిన అని అర్థం. దానికి 'ఆ' అన్న ఉపసర్గ చేర్చతే తొడుగబడిన, అలంకరించుకోబడిన అన్న అర్థం వస్తుంది. అటువంటి, మాల్య - మాలను, ద - ఇచ్చునది. అంటే తాను అలంకరించుకున్న మాలను (భగవంతుడికి) ఇచ్చేది అని.
ఇది నిజానికి చూడికుడుత్తై చేసిన చేష్ట. విష్ణువుకోసం మాలనల్లి, దానిని ముందు తన మెడలో వేసుకుని, తరువాత భగవంతుడి మెడలో వేసేదట. కానీ ఈ అర్థాన్ని ఈ ప్రబంధంలో ఉన్న ప్రతీ పాత్రకూ అన్వయింపచేయవచ్చు. మత్స్యధ్వజుడూ, మాలదాసరీ, యమునాచార్యులూ, విష్ణుచిత్తుడూ - వీరంతా తాము అలంకరించుకున్న దానిని భగవంతుడికి అర్పించి తరించారు. భోగలాలసత్వాన్నైతే నేమి, సంకీర్తనాభక్తినైతే నేమి, పూలదండనైతే నేమి, పెంచుకున్న కూతురినైతే నేమి - తమ దగ్గర ఉన్నదాన్ని భగవదర్పణ చేసి జీవితంలో గెలిచారు. ఆ రకంగా లింగపరంగా సరిపోకపోయినా, అర్థం పరంగా ఈ పేరు ఈ ప్రబంధపాత్రలన్నింటికీ వర్తిస్తుంది.
ఈ కావ్యం చదివిన అందరికీ జీవితంలో విజయం చేకూరాలి. చేకూరుతుంది, నిస్సందేహంగా.
***
[This re-edited essay was first written on Telugu Quora two years ago.]
No comments:
Post a Comment