గత కొన్ని రోజులుగా నన్ను స్వామి వివేకానంద కవిత్వం వీడిపోని సాయంఫుల్ల మల్లీపరిమళంలా అల్లుకుని ఉంది. ఇదివరకు ఆయనపై వ్రాసిన అనేకాలైన కవితలు చదువుతూ ఉన్నపుడు తెలుగు కవులు, ముఖ్యంగా పద్యకవులు ఆయన్ను నెత్తినకెత్తుకున్న సంగతి నాకు గుర్తులేకపోలేదు. కడియాల సుబ్బన్నశాస్త్రిగారి వివేకానంద గీతావలి, సన్నిధానం సూర్యనారాయణశాస్త్రిగారి వివేకానందము నుండి, ముదిగొండ వీరభద్రమూర్తి గారి వందేమాతరం కావ్యంలో వివేకానందఖండం, ఎస్.టి.జ్ఞానానందకవి గారి వివేకానంద సింహగర్జన మొదలుగా తిలక్ పద్యాల వరకూ వివేకానందుడు తెలుగుపద్యాలలో పొడగట్టిన రీతి మధురాతిమధురం.
ఆయన స్వయం ప్రతిపత్తి కలిగిన కవి అన్న సంగతి కొత్తగా ఉంటుంది గానీ, ఆశ్చర్యజనకం కాదు. ఎందుకంటే, వివేకానందుడు కవి కాదు అని ఎవరికీ అనిపించదు. తనకు ఎదురైన ప్రతీ మానవునికీ తన రెండుచేతలా అంజలిపట్టిన భారతదేశపుటాత్మను 'ఇదిగో' అని దర్శింపజేసినవాడు, తన ప్రతీ పలుకులోనూ గంభీరతను నింపుకున్నవాడు, తన ప్రతీచూపుతోనూ ధైర్యాన్ని వెల్లువగట్టించినవాడు, తన ప్రతీ కదలికలోనూ నిష్ఠను పూయించినవాడు, నిలువెత్తు సిద్ధి అయిన ఆ స్వామి కవి కాకుండా పోతాడా అని అనిపించడమే సహజం.
కుర్మస్తారకచర్వణం
త్రిభువనముత్పాటయామో బలాత్
కింభో విజానాస్యస్మాన్
రామకృష్ణదాసా వయమ్
నక్షత్రాలను రాల్చి పారేస్తాం. ముల్లోకాలనూ పెకలించివేస్తాం. మేమెవరమో తెలుసా? రామకృష్ణదాసులం అంటూ ఉన్నతమనస్సు తాలూకు శక్తికేంద్రం గురుభక్తేనని ప్రతిపాదించిన ఈ వివేకానంద శ్లోకజ్వాల సెగ చిన్నతనం నుండి నన్ను తాకుతూనే ఉంది.
విద్య శాస్త్రము, కళ అని ద్విధా భాసిల్లుతూ ఉంటుంది. శాస్త్రం బుద్ధిప్రచోదకం కాగా, కళ హృదయప్రచోదకం. రెండింటి లక్ష్యమూ తత్త్వావిష్కారమే. శాస్త్రజ్ఞులలో, కళాకారులలో మహాత్ములు మనకు గోచరమవుతుంటారు. వారి వారి విద్వత్తుకు మనం ముగ్ధులమవుతూనే ఉంటాం.
కవి అనేవాడు శాస్త్రానికీ కళకూ కూడా సమాంతరంగా పనిచేస్తాడని అని నా ఊహ. కళాహస్తాన్ని అందుకొని, సౌందర్యమహత్తుల పథం గుండా పయనించే కవి అడుగు అడుగుకూ యోగసుగంధాన్ని తన మనసుకు పట్టిస్తూ ఉంటాడు. ప్రతీ వస్తువులోనూ శుద్ధత్వాన్ని వెతుకుతూ యోగలక్ష్యాలవైపుకు వెళుతూ ఉంటాడు. కనుకనే సాంద్రతలో భేదం ఉన్నా సమాధి అనే పదం యోగికీ కవికీ కూడా పెద్దలు అనువర్తింపజేశారనిపిస్తుంది.
కళోపాసన యోగం వైపుకు తీసుకుని వెళ్లడం మహనీయులైన కళాకారుల జీవితాలలో కనిపిస్తుంది. కానీ, ఒక యోగసిద్ధుడు కవి కావడం ఎప్పుడో గాని సంభవించని ఘటన. కఠినకర్కశాలైన సాధనలతో మనసును శుద్ధం చేసుకొని, ఎన్నో ఎత్తులను సాధించి, ఆ ఎత్తునుండి ఒక యోగి కవితను చెబితే ఆ కవితలో అనేక భూమికలు ఆవిష్కరింపబడతాయి. శంకరాచార్య, మధుసూదన సరస్వతి, చైతన్యమహాప్రభువు వంటి ఉన్నతశ్రేణికి చెందిక కవులలోని వారు స్వామి వివేకానంద.
వివేకానంద కవితలను చదువుతున్నపుడు లౌకికాలౌకికాలకు ముడిపెట్టే ఏకైకశక్తిని కలిగిఉన్న కవిత్వమనే వస్తువుకూ, అందులో ఇంతటి వాల్లభ్యాన్ని ప్రకటించిన ఆ పుంభావశారదామూర్తికీ నమస్కరించుకోకుండా ఉండడం అసాధ్యం. స్వామి కవితలలో చాలా మటుకు ఒకచోటకు తీసుకుని వచ్చిన ఓగేటి అచ్యుతరామశాస్త్రి గారు కూడా నన్ను ఋణగ్రస్తుడిని చేశారు.
బహుభాషాకోవిదుడైన వివేకానంద సంస్కృతం, ఇంగ్లీషు, బెంగాలీ, హిందీ భాషలలో కవిత్వాన్ని చెప్పారు. ఈ కవితలు అధికసంఖ్యాకాలైనవి కావు. కానీ ప్రతీ కవితా ఒక్కొక వజ్రఖని. తన కవిత్వంద్వారా ఆయన ఒక కాంతిపాతాన్ని ఆవిష్కరింపజేస్తారు. ఇది స్వామి టెక్నిక్. వారిది కొందరు కవులలా ఉహా లోకంకాదు. మంత్రకవాటాన్ని తెరిచో, దేవలోకపు తాళాలను బద్దలుకొట్టో, ఊర్ధ్వలోకాలకు బాటలు వేసో కవితనల్లుదామనుకోరాయన. యోగభూమికలను నేత్రపుటాలలో దాచుకున్న స్వామి చూపులకు ఈ జగత్తు ఒక కాంతికందం. ఉన్నదంతా ఆనందం. ఉన్నదంతా జ్ఞానం. 29 డిసెంబరు 1900 వ తారీఖున బేలూరు మఠంలో కూర్చుని మిస్ జోసెఫీన్ అనే భక్తురాలికి లేఖ వ్రాస్తూ స్వామి వ్రాసిన ఈ నాలుగు పంక్తుల కవిత చూడండి:
~ కాంతి ~
--------------
వెనకా ముందూ గమనింతును గదా,
అంతా సంతృప్తి.
నా లోలోతుల గాయాల్లోనూ
ఒక కాంత్యాత్మ.
ఈ పలుకుల వెనుక ఎంత సిద్ధి ఉండి ఉండాలి! ఇది ప్రజ్వలితహృదయదృక్కు. అవిద్యను నాశం చేసేటువంటి వెండితనాల కాంతిపాతం.
ఆ చిరుకవిత అలా ఉండగా, 6 జనవరి 1896 న న్యూయార్కు నుండి వ్రాసిన మరొక లేఖలో స్వామి రచించిన మరొక మనోహరమైన కవిత ఇది:
~ ఆద్య నీలలోహితానికి ~
--------------------------------
గడ్డకట్టిన ధరణీతలం నీ పల్యంకమై
శీతలీకరణ నీ ముసుగైంది కదా అని
నీ మార్గానుయాయులెవరూ లేక
నీ గగనాలు దుఃఖావృతాలైనాయి కదా అని
నీ ప్రేమ సాంతం విఫలమై
నీ సుగంధాలన్నీ గొడ్డుపోయాయని
మంచికి రోజులు పోయి
ధర్మంపై అధర్మం గెలుస్తోందని ---
నీ స్వభావాన్ని, నీ సహజవికాసాన్నీ కోలుపోవద్దు;
నీవు స్వాదిమల శుద్ధ నీలలోహితానివి.
అయాచితంగా, నిరవధికంగా
నీ తీపి తావులను వెదజల్లుతానంటావా,
కానివ్వు!
తరువాత నేను పరిచయం చేద్దామనుకుంటున్న స్వామి కవిత ఒక అనువాదం, సుప్రసిద్ధమైన భర్తృహరి సుభాషితానికి. విదితమైన కవిత కావడం చేత నేను భావానువాదానికి పూనుకోవడం లేదు. ఆంగ్లంలో ఇది ఏవిధంగా చేయి తిరిగిందో చూడండి -
~ వైరాగ్యమేవాఽభయమ్ ~
15 ఫిబ్రవరి 1895 తారీఖున న్యూయార్కు నగరం నుండి మిస్ హేల్ అనే ఆమెకు స్వామి వ్రాసి పంపిన కవిత ఇది:
~ స్వేచ్ఛా గీతం ~
----------------------
దెబ్బతిన్న కోడెనాగు పడగ విప్పుతుంది
రగిల్చిన నిప్పు ప్రజ్వలిస్తుంది
గుండె మండిన సింహపు గర్జనలకు ఎడారి గాలి మార్మోగుతుంది
... కలల నుండి మేల్కాంచి, బంధాల కట్లు తెంపుకుంటుంది,
తప్ప భయపడదు.
ఈ మాయ, ఈ ఛాయ నన్ను బెదిరించలేవు.
తెలుసుకో, అహం బ్రహ్మాఽస్మి!
~
ఇక్కడ స్వామి ఉద్యోతిస్తోంది ఆత్మజ్ఞానం తాలూకు ఫలం. కోడెనాగునూ, నిప్పునూ బ్రహ్మజ్ఞానితో పోలుస్తూ వాటి స్వభావం ఎంత సహజమైనదో మాయ ఇబ్బందికి తలొగ్గనితనం కూడా వేదాంతికి అంతే సహజమైనదని స్వామి చేసిన ప్రతిపాదన. మహావాక్యానికి కవితా టీక.
~
ఒకసారి క్షేత్రీ మహారాజు ఒక నర్తకి ప్రదర్శనకు వివేకానందుడిని ఆహ్వానించాడు. తాను సన్యాసి కనుక ఆ ప్రదర్శనకు రానని స్వామి నిరాకరించారట. కానీ ఆ నర్తకి సూరదాసు కీర్తనను ఆలాపించడం విని, భక్త్యావేశంతో ఆ ప్రదర్శనకు వెళ్ళారట. ఆ హిందీ కవితను ఆయన ఆంగ్లానువాదం చేశారు.
~ సూరదాసు పాట ~
------------------------------
ప్రభూ, నాలోని దుర్గుణాలను ఎంచకు
సమదృష్టి నీ మారుపేరు కదా స్వామీ
మన ఇరువురినీ ఒకే బ్రహ్మం కానీయి!
శుద్ధ యమునాజలాలలోని బిందువొకటి
రోడ్డు పక్కన మురికిగుంటలో బొట్టొకటి
గంగలో పడిన తత్క్షణం, రెండింటికీ ఒకే పవిత్రీకరణం
కనుకనో స్వామీ, నా దుర్గుణాలను లెక్కించకు!
నీవు సర్వసముడివి కదూ!
మన ఇద్దరినీ ఒకే బ్రహ్మం కానీయి!
ఒక ఇనుప ముక్క కోవెలలో మూర్తి
వేరొక ఇనుప ముక్క కసాయికొట్టంలో కత్తి
పరసువేదిని తాకిన వెంటనే రెండింటికీ ఒకే స్వర్ణవిభూతి
కాబట్టి పరమేశ్వరా, నా కుబుద్ధులను లెక్కసేయకు
సమదర్శనం నీ తత్త్వమే కదూ!
నిన్నూ నన్నూ ఒకే బ్రహ్మం కానీయి!
~~
రామకృష్ణ పరమహంస చేతి తాకు వెచ్చనకు హృదయకోశం విచ్చుకుని అందులో ఎర్రని పాదాలు మోపిన దేవత కాళి తలపు కు వచ్చినప్పుడల్లా వివేకానంద శిశు హృదయం తలిరాకులా వణికిపోతుంది. ఆ పచ్చదనాల కృపా కాంతి ఆయనలో ద్వంద్వభయాన్ని విచ్ఛిత్తి చేసినందువల్లే ఆయన ఒక ధ్యానయోగపు డైనమైట్ కాగలిగాడు. సంసారాన్ని ఈసడించిన ఆ సన్యాసికి భయంపైనే తిరుగుబాటు. ఆ ఉద్యమం ఎంత బలీయంగా చేశాడో అందుకు తన ఆంతరాల్లో ప్రసన్న ముఖకవళికలతో నిరంతరం సంచరించే తన దేవతపై తనకెంత ప్రేమో ఈ కవితలో వ్రాసారు వివేకానంద. ఆ గురు శిష్యులు అలౌకికలోకాలలో ఎల్లలు లేని సామ్రాజ్యాన్ని కట్టుకున్నారు. వారి దేవతావేశ శేవధికి అంతు లేదు.
~ కాళికాంబ ~
---------------------
తుడిచిపెట్టుకుపోయిన తారకలు
దాగురింతలాడుతున్న మేఘాలు
ఇరులు- దట్టంగా, స్వరయుతంగా.
గింగిరాలు కొడుతున్న గాలుల గర్జలు
కారాగారం నుంచి విడుదలై
దారులంబడి చెట్లను
కర్కశంగా కూకటివేళ్లతో పెకలిస్తూ
బయలుదేరిన లక్షలాది ప్రేతాత్మలు
కారునలుపు గగనాన్ని తాకుదామని
ఎగబాకజూస్తూ
పిక్కలు వణికించే వెరపు గొలుపుతూ
పెను పవనాల సుడులను
ఆబగా మింగుతున్న సంద్రం.
అప్పుడు,
పది దిక్కుల మూలల్లోంచి
వేవేల వర్ణాలతో
మృత్యుధూసరితఛాయతో
ఈవలికి
ఒక నిర్మలకాంతి పొడుచుకువస్తుంది.
మహమ్మారి దుఃఖాలను ఎగరగొడుతూ
ఉన్మత్తానంద నృత్యంలో మైమరచిన తల్లీ!
రామ్మా!
నీ పేరు భైరవం
నీ శ్వాస మరణం
నీ ఒక్కో పదచలనం
ఒక్కో లోకాంతకం
కాలస్వరూపిణీ!
లయకారిణీ!
రావమ్మా!
యాతనా ప్రేమను గెల్చుకుని
మృత్యుపరీరంభంలో
లయనర్తన గావించే
ధీరుడి వద్దకు
అమ్మ వస్తుంది.
~~
KALI THE MOTHER
The stars are blotted out,
The clouds are covering clouds,
It is darkness vibrant, sonant.
In the roaring, whirling wind
Are the souls of a million lunatics
Just loose from the prison-house,
Wrenching trees by the roots,
Sweeping all from the path.
The sea has joined the fray,
And swirls up mountain-waves,
To reach the pitchy sky.
The flash of lurid light
Reveals on every side
A thousand, thousand shades
Of Death begrimed and black —
Scattering plagues and sorrows,
Dancing mad with joy,
Come, Mother, come!
For Terror is Thy name,
Death is in Thy breath,
And every shaking step
Destroys a world for e'er.
Thou "Time", the All-Destroyer!
Come, O Mother, come!
Who dares misery love,
And hug the form of Death,
Dance in Destruction's dance,
To him the Mother comes.
*****
No comments:
Post a Comment