Saturday, 2 November 2024

జగద్ధితావతారం

  



ఈ రోజు నాడు నాకు గురువు కంటే కూడా ఒక శిష్యుడి గురించి మాట్లాడాలని ఉంది. ఎందుకంటే గురువు గురించి మాట్లాడేవాడు శిష్యుడే కనుక. పేదవాడిగా ఉందామనుకునే లగ్జరీ నేటి కాలంలో లేదు. దానితోపాటుగా అహంకారాన్ని పరిపూర్ణంగా త్యజించి ఒక సత్త్వవస్తువుకోసం తపించడానికి మనలను మనం నూరుశాతం అర్పించుకోగలిగే లగ్జరీ కూడా నేటి కాలంలో లేదు. ప్రతీమనిషీ కూడా లౌకికకాపట్యయంత్రంలో తలదూర్చి, అయిష్టంగానైనా అంతో ఇంతో నలగకతప్పదు. ఈ ప్రమాదం సరిగ్గా భర్తృహరి ముసలితనం విషయంలో చెప్పినట్లుగా పొంచి ఉన్న వ్యాఘ్రి కాదు. రుచి మరిగి, అవకాశం చిక్కిన వెంటనే ప్రతిరోజూ మనపై పడి దాడిచేస్తున్న వ్యాఘ్రి. దీనినణచాలంటే క్రొత్తపద్ధతులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

దీనితో పాటు ఉన్న మరొక ప్రమాదం, వ్యసనాలు మనకు మరింత దగ్గరగా జరిగాయి. మిథ్యాశృంగాలు మొలిపింపచేసి వాటితో మనలను మనమే పొడుచుకు చస్తూ ఉంటే సొమ్ము చేసికొనే వ్యాపారాలు అనేకంగా తయారయి, mobiles రూపేణా మన చేతులలోకి వచ్చి, మన కన్నుల ముందు నర్తిస్తున్నాయి. తప్పించుకుందామన్నా కుదరని పరిస్థితి.

మన ప్రాచీనులు విలువనిచ్చి, నిర్వచించడం ద్వారా శాస్త్రస్థాయి కలిపించిన పదం ఒకటుంది. అది "ప్రజ్ఞాపరాధము". విద్యాసముపార్జనవల్ల ఎంతో కష్టించి మనం తయారు చేసుకున్న సంస్కారబుద్ధికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించడం ఒక అపరాధం. ఇది చేస్తే నరకానికి పోతారనీ, ఉద్యోగాలు రావనీ, వివాహాలు కావనీ చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ
అసలు ఇటువంటి ఒక పదాన్ని నిర్వచించి, దాన్ని విద్యార్థుల మెదళ్లలోకి చొప్పించి వైయక్తికబలాన్నిచ్చిన మన విద్యామూలాన్ని తలుచుకుని ఆనాడు నేను పులకించిపోయాను.

గురుశిష్యబంధంలో జరిగేది తెలియని విషయాల వల్లింపు కాదు. అనుభూతిప్రసారం. సమాచారలబ్ధి నేటి కాలంలో ఎంత తేలిక? అది ప్రతీ ఒక్కరినీ గురువును చేసేస్తోంది.ఈ గురుత్వం గొప్పకే కానీ ఉన్నతికి పనికిరాదు. ఈ దేశంలో ప్రతీ ఆచార్యుడూ కూడా ఆపదవిని పొందడానికి మునుపు కొన్ని పదులఏళ్లపాటు శిష్యత్వం చేసినవాడు. శిష్యత్వం సాధన అయితే, గురుత్వం సిద్ధి. దేశికపదవీరోహణ ఎన్నో ఏళ్ల క్లేశఫలితం. తెలియని విషయాలు తెలిసినవాడు గురువు కాడు. శిష్యత్వం చేసి, అందులో పండినవాడు గురువు. ఆ శిష్యత్వంలో, ఆ అంతేవాసిత్వంలో తెలియని విషయాలు తెలియడం ఒక భాగం మాత్రమే.

శిష్యుడెవరు అని ప్రశ్న. శిష్యుడు వేరే మనిషితో త్రొక్కబడేవాడో, వేరే మనిషి చేత exploit చేయబడేవాడో, నచ్చకపోయినా అధికారం క్రింద నలిగేవాడో కాదు. శిష్యుడు ఒక కాంతిగ్రహీత. ఆ గ్రహణం కోసం పరితపించేవాడు. తాను ఒప్పుకుని, తనకు నచ్చి, ఆ కాంతిపాతం కోసం తానుగా తన శిరసును వంచే ఒక సహజవినమ్రుడు. అతడెపుడూ తాను చీకటిలో ఉన్నాననే ఎరుక కలిగి, తన మనోభవనం ముంగిట జ్ఞానసూర్యుడెప్పుడుదయిస్తాడా అని తలుపులు తెరిచే ఉంచుతాడు. దీనికే శుశ్రూష (శ్రోతుమిచ్ఛా - వినాలన్న కోరిక) అని పేరు. సూర్యుడిని చూసి చీకట్లు నిలువలేకపోయినట్లే, చీకటిని చూస్తూ సూర్యుడు ప్రకాశించకుండా ఉండలేడు. గురువును వెతుకుతూ వేలమైళ్లు ప్రయాణం చేసిన శిష్యులున్నట్లే, పరిపక్వుడైన శిష్యుడిని వెతుక్కుంటూ వచ్చిన గురువులూ ఉన్నారు.

అటువంటి ఒక శిష్యుడే ఒక తోటకాష్టకాన్ని వ్రాసాడు. ఒక ఆచార్యపంచాశత్తును వ్రాసాడు. ఒక గురుపాదుకాస్తోత్రాన్ని వ్రాసాడు. అలాంటివాడే కాంతిపుంజాన్ని గుర్తుపట్టగలడు. అటువంటి ఉత్కృష్టమైన శిష్యులలో ఒకడు మధురాజయోగి.

మధురాజయోగి తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన పాశుపతయోగి. పచ్చలూరే ఈ రచనను మనకు సంపాదించిపెట్టిన P.N. Pushp ఆయన్ను ఇలా వర్ణిస్తున్నాడు - మధురాజయోగి ఒక కంబళి, దండం, కమండలం, కపాలం తప్ప వేరే ఏ వస్తువులూ లేనివాడు. సంచారజీవనం చేస్తూ, ఏ ప్రాంతంతోనూ సంయోగసంపర్కాలు లేక యోగమే జీవనమైనవాడు. ఈ సంగతిని ఇదే స్తోత్రంలో ఉన్న -

దండ-కమండలు-కర్పర-కంథా-
మాత్ర-పరిచ్ఛద గాత్రకుటుంబః
ఖండన మండన తుల్యమతిస్సన్
వీరమతే రమతే మధురాజః

అనే సుందరశ్లోకం రూఢి చేస్తున్నది. డెబ్భైనాలుగేళ్ల వయసులో కాశ్మీరానికి వెళ్లి, అక్కడ అభినవగుప్తుడి దగ్గర శిష్యుడై నాలుగు సంవత్సరాలపాటు శైవాధ్యయనం చేసాడు. సంసారబంధాన్ని తునకలు చేసే ఖండనవిద్యలో ఆరితేరాడు. గద్యాలనూ పద్యాలనూ కూర్చినట్లు తెలుస్తోంది కానీ అవేవీ అందుబాటులో ఉన్న వివరం లేదు. ఈ కవితలోనే చివరన ఒక ప్రాకృతశ్లోకం కూడా ఉంది. అంటే ఇతడు బహుభాషావిశారదుడై ఉండాలి. పరిపక్వమైన కవితాశైలి మధురాజ కవిరాజుది.

తన గురువును చూస్తూ గురునాథపరామర్శ అనే ఈ వజ్రసదృశమైన కవితను వ్రాసాడు మధురజయోగి. పరామర్శ అంటే వివేచన, వితర్కం. ఈ కవితలో గురుత్వాన్ని వివేచన చేస్తున్న మధురాజయోగి శిష్యత్వాన్ని కూడా వివేచన చేసాడేమో అని నాకు అనిపించింది.

ఈ కవితలోని కవిత్వం ఏ మహాకవికీ తీసిపోదు. అంతే కాక, కాశ్మీరశైవానికి మూలప్రాణాలైన విమర్శ, అభిజ్ఞ ఇత్యాది అనేక సైద్ధాంతిక పదాలు ఈ కవితలో గోచరిస్తాయి. ఎక్కడి మధుర! ఎక్కడి కాశ్మీరం! ఈ దేశపుటాత్మ ఏది అని ఎవరైనా నన్ను అడిగితే, నాకు తోచే సమాధానం ఇది - ఎలక్ట్రానిక్ వ్యవస్థల సహాయసహకారాలూ లేని కాలంలో వయసు మళ్లిన ఒక వ్యక్తి ఈ దేశం ఒక కోణం నుండి మరొకకోణానికి ఒక బోధ కోసం, ఒక వెలుగుకోసం, ఆత్మోన్నతి కోసం ప్రయాణించిన తీరు మాత్రమే దేశపుటాత్మ.

మధురాజయోగికి శివుడూ గురువూ వేరు కాదు. ఈ విలక్షణమైన కవితలో ఉన్న ప్రతీ శ్లోకం గురించీ నాకు వ్యాఖ్య వ్రాయాలని ఉన్నా, ప్రస్తుతానికి కొన్ని శ్లోకాలను స్వేచ్ఛానువాదంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

1

క్షేమరాజు మొదలైన శిష్యవర్గం పరివేష్టింపగా
తాను చెబుతున్నది లిఖిస్తున్న వ్రాయసకాళ్లూ
రెండువైపులా శివరసం నిండిన కమండలాన్నీ, తాంబూలపేటినీ
పట్టుకుని ఉన్న దూతీస్త్రీల మధ్యలో ఆసీనుడై
ఆనందంతో తూలే కళ్లతో,
భస్మం చేత తిలకాన్ని నుదుటిపై దిద్దుకొని,
చెవులకు రుద్రాక్షలను జుంకాలుగా ధరించి,
పూలమాలను తన నిడుదైన జడలో తురుముకొని
పొడుగాటి గెడ్డంతో,
నారవలువను కట్టుకొని,
చందురుని వంటి మేని చాయతో,
వ్రేలాడుతున్న యజ్ఞోపవీతాన్ని ధరించి,
వీరయోగాసనం మీద కుర్చుని,
కుడిచేతిని తన మోకాలిమీదనుంచుకొని
పరమశివజ్ఞానముద్రితమైన రుద్రాక్షమాలధరించి,
ఎడమచేతి వ్రేలి గోళ్లతో వీణను మీటుతూ
పరమకరుణతో కాశ్మీరదేశానికి వేంచేసిన
సాక్షాత్తూ దక్షిణామూర్తిదేవుడైన అభినవగుప్తుడు
మనలను రక్షించుగాక.

ఆసీనః క్షేమరాజప్రభృతిభిరఖిలైః సేవితః శిష్యవర్గైః
పాదోపాంతే విషణ్ణైరవహిత హృదయై రుక్తముక్తం లిఖద్భిః।
ద్వాభ్యాం పార్శ్వస్థితాభ్యాం శివరస-సరకం పూర్ణతామ్బూలపేటీం
దూతీభ్యాం బిభ్రతీభ్యామపరకరలసన్మాతులుంగోత్పలాభ్యామ్॥

ఆనందాందోలితాక్షః స్ఫుటకృత తిలకో భస్మనా భాలమధ్యే
రుద్రాక్షోల్లాసికర్ణః కలితకచభరో మాలయా లమ్బకూర్చః
రక్తాంగో యక్షపంకోల్లసదసితగలో లమ్బముక్తోపవీతః
క్షౌమం వాసో వసానః శశికరధవలం వీరయోగాసనస్థః॥


జాన్వాసక్తైకహస్తః స్ఫుటపరమశివజ్ఞానముద్రాక్షసూత్రో
వామశ్రీపాణిపద్మస్ఫురితనఖముఖైర్వాదయన్ నాదవీణామ్।
శ్రీకంఠేశావతారః పరమకరుణయా ప్రాప్తకాశ్మీరదేశః
శ్రీమాన్నః పాతు సాక్షాదభినవవపుషా దక్షిణామూర్తిదేవః॥


ఈ శ్లోకాలను ఆధారం చేసుకునే ఆ పరమశివాచార్యుల చిత్తరువును తయారు చేశారు. :

2

అభినవగుప్తుడి సారస్వతాన్ని గ్రోలుతూ
ఎప్పుడూ మదించి మోదంలో ఉండే మాకు
దేవతలొకవేళ అమృతాన్నిచ్చినా
అది గంజితో సమానం.

అభినవగుప్త-సారస్వత-పరమరసాస్వాద-మోదమానానామ్
అమృతమపి దత్తమమరైర్ అరుచికృదస్మాకమారనాలమివ.

3

అభినవగుప్తుడి సారస్వతపరిమళాలను పీల్చి
సంక్రందనుడు తన నందనవనంలోని
హరిచందనామోదాన్ని నిందిస్తున్నాడు!

అభినవగురు-సారస్వత-పరిమల-బహులాధివాసితే జగతి.
సంక్రన్దనోఽపి నిన్దతి నన్దనహరిచన్దనామోదమ్.

4

అభినవగుప్తుడి సారస్వతమనే మార్తండుడు
ప్రకాశించడం వల్ల మేల్కొన్న మా హృదయపుండరీకాలలో
మోక్షలక్ష్మి నియతంగా నివసిస్తోంది!

అభినవగురు-సారస్వత-మార్తణ్డమరీచి-పరిచయోన్నిద్రే
హృత్పుణ్డరీక కుహరే నివసతి నియమేన మోక్షలక్ష్మీర్నః.

5

అభినవగుప్తనాథుడు వ్రాసింది
హృదయంలో వ్రాసినట్లు.
అన్యులు వ్రాసింది నీటిపై వ్రాసినట్లు.
హృదయకుహరంలో స్థిరీభూతమైన
దేవతకు అర్పించింది అగ్ని ముఖంలో అర్పించినదానితో సమానం.
అటుకాని ఇతరదేవతల నిహితమైనది బూడిదలో పోసిన పన్నీరు.

అభినవగుప్తనాథ లిఖితం లిఖితం హృదయే
తదితర శాస్త్రకారలిఖితం లిఖితం సలిలే.
స్వహృదయ దేవతాముఖహుతం హుతమగ్నిముఖే
తదితరదేవతాసు నిహితం నిహితం భసితే.

6
అభినవగుప్త సారస్వతమనే సహకారవల్లరి
సౌరభాలను క్రక్కుతూ, వసంతాన్నే కాదు,
అతీతమైన, అనాగతమైన సమస్తకాలాన్నీ రసమయం చేస్తున్నది.

అభినవసహకారమంజరీయం
మధుమధురం నిజసౌరభం వమన్తీ.
రసయతి నహి కేవలం వసంతం
సకలమతీతమనాగతం చ కాలమ్.

7

అభినవగుప్తుడి ముఖమనే చంద్రుడి వెలువడుతున్న
జ్ఞానమనే వెన్నెల మాకు శివభోగాన్నిచ్చుగాక.

అభినవగుప్త-ముఖేందోర్ అమృతకళోల్లాసి సున్దరాదుదితా
జ్ఞానేన్దుకౌముదీ నః పూర్ణం పుష్ణాతు శివభోగమ్.

8

భవవాసనలను పోగొట్టుకోడానికి
నేను నా హృదయంపై అంజనం వేసినపుడు
పదే పదే శివనిధి అయిన అభినవగుప్తదేశికుడే రూపుకట్టి కనిపిస్తున్నాడు.

అంజనేన హృదయే మమాంజితే
భంజనేన భవవాసనారుజమ్
దృశ్యతేఽభినవగుప్తదేశికః
సంచితః శివనిధిః పదేపదే.

9

ప్రతిపదవిశ్రాంతిమయి అయిన ఏ అభినవుడి అలౌకిక పద్ధతి
కామక్రోధాది శత్రువులతో పరిపాలింపబడుతున్నదైన
మనసుతోనే చిత్రంగా తెలియబడుతోందో, దానికి జయము.

మనసైవ గమ్యతే యా
పరిపన్థిన ఏవ పాలకా యస్యామ్
ప్రతిపదవిశ్రాన్తిమయీ
పద్ధతిరియమభినవా జయతి.

10

నా శంకలూ, కళంకాలూ తొలగిపోయి
పరమేశ్వరుడిపై సమున్నతమైన భక్తికలిగి
అభినవగుప్తుని వదనాంభోజం నుండి వెలువడిన
వాగ్వాహినీప్రవాహం లో మునుగుతూ తేలుతూ
ప్రతీ దిశలోనూ నేను విహరిస్తున్నాను.

దిశి దిశి విహరామ్యహం వీతశంకాకళంకస్సుఖం
భగవతి పరమేశ్వరేఽనుత్తరే భక్తిమాత్మని
స్ఫురదభినవగుప్తనాథాననామ్భోజ వాగ్వాహినీ
రసపరిమళ మజ్జనోన్మజ్జనానందలీలపరః.

11

అభినవగుప్తదేశిక కటాక్షపరంపరల రాపిడి చేత
మాయాపాశం విచ్ఛిత్తి అవగా, పాశాలన్నీ వీడిపోగా,
దృష్టి స్పష్టమై
స్వచ్ఛమైన ఆత్మవిమర్శదర్పణతలంలో విశ్వాన్ని విమర్శిస్తూ
స్వైరంగా మనందరం విహరిద్దాం!

12

దేశికుల వాక్కులనే ఉపదేశం చేత
దేహమూ, ప్రాణమూ, బుద్ధీ నేననే భ్రాంతి నన్ను వీడిపోయింది.
నేను అద్వయబోధవిమర్శమయుడ్ని;
నేటినుండీ నేను శివుడ్ని, శివుడ్ని, శివుడ్ని!

దేశికవాగుపదేశ వినశ్యద్ దేహమరున్మతి శూన్యవికల్పో
అద్వయబోధవిమర్శమయస్సన్ అద్య శివోఽస్మి శివోఽస్మి శివోఽస్మి.

*

[Last Edited: 16 Dec 2024]


1 comment: