నిరంతరరామకథామననంతో మాధుర్యపరమసీమలను నేలకు అవతరింపజేస్తున్న ఆచార్య, ఆచార్యాని శ్రీమతి రమాదేవి గారు "హృదయావి" కావ్యం పై వ్రాసి ఇచ్చిన చల్లని స్పందన ఇది. వారికి అనేకనమఃపూర్వక ధన్యవాదాలతో మీతో పంచుకుంటున్నాను.
సాహిత్యతత్వాన్ని ఆసాంతంగా ఆకళింపు చేసుకుని, శారదాదేవి కటాక్షానికి నోచుకున్న కాటూరి, దేవులపల్లి, విశ్వనాథ వంటి మహనీయకవులందరూ పధ్నాలుగు పదిహేను సంవత్సరాలకే సారస్వతాంశ పూర్ణంగా పెనవేసుకుని ఉన్న బాలకవిగా గుర్తుపట్టారు మల్లంపల్లి శరభయ్యగారిని. మల్లంపల్లి వారి వంశమంతా వీరశైవమత పరిమళాలు ఆంధ్రదేశమంతటా ప్రాకింపజేసి, జ్ఞానరోచిస్సులను నలుదిశలా చిందింపజేసిన ఉన్నతవ్యక్తిత్వాలకు ఆకరమైనటువంటిది. వీరశైవాంధ్రవాఙ్మయానికి వారు చేసిన సేవ అద్వితీయం. ఈ వంశంలోని పూర్వీకులు శివదీక్షాగురువులు.