Tuesday, 28 December 2021

బెల్లంకొండ రామరాయకవి


“పశ్యాపశ్యౌ న పశ్యతః” - తిరుపతి వేంకట కవుల అవధాన విశేషాల గురించి కొన్ని సంవత్సరాల క్రితం అంతర్జాలంలో చదువుతున్న నన్ను, వారికి నరసరావు పేటలో జరిగిన అవధానంలో సమస్యగా ఇవ్వబడిన ఈ ఎనిమిదక్షరాల చిన్న శ్లోకపంక్తి కట్టిపడేసింది. అందులోని “పశ్య” శబ్దంపై జరిగిన వాదోపవాదాలూ, వైయాకరణ ప్రతిపాదనలూ, వ్రాయబడిన వ్యాసాల గురించి చదివినా, ఎంచేతో ఈ సమస్య ఇచ్చిన వ్యక్తి గురించి తెలుసుకోవాలని నాకప్పుడు మనసులో అనిపించింది.

ఆ సమస్యను వ్రాసి ఇచ్చింది బెల్లంకొండ రామరాయకవి. ఎవరీయన? అంతకు ముందెప్పుడూ వినలేదే! అని అనుకుంటూనే మెలిమెల్లిగా ప్రయత్నించి, ఈయన వివరాలను కొద్దిగా సేకరించగలిగేను. ఈయనపై పరిశోధనలు చేసిన డా. కె ఎస్ ఆర్ దత్తా ఈయనపైన త్రివేణి జర్నల్ లో “A new star in the Advaitic Galaxy: Bellamkonda Rama raya kavi” అన్న వ్యాసం వ్రాసాడనీ, 1976 లోనే ఈయన జీవితంపైన పరిశోధనలు చేసి డాక్టరేట్లు అందుకున్నారనీ, ఈయన్ను అపరశంకరుడని పిలుస్తారనీ తెలిసి అచ్చెవువొందాను. వివరాలు కొద్దికొద్దిగా నాకు తెలుస్తున్న కొద్దీ, ఈ తెలుగునేల మీద శంకరభగవత్పాదులకూ, విద్యారణ్యులకూ, వాచస్పతి మిశ్రులకూ, మధుసూదన సరస్వతికీ, అప్పయదీక్షితులకూ సమఉజ్జీ జీవించేడని తెలిసి అప్రతిభుడ్నైపోయాను. అంతవరకూ తెలుసుకోనందుకు సిగ్గుపడ్డాను కూడా.

మామూలుగా కవిత్వం చదివితే, మధూహప్రపంచానికి వెళతాం. కానీ రామరాయకవి యొక్క ఒక్కో రచనలోని కవిత్వాన్నీ చదువుతున్నపుడు ఆ పదబంధాలలో, రచనాపాటవంలో నాలోపలికే నన్ను నేను నెట్టుకుంటూ వెళుతున్నట్లనిపించింది. ఆయన కొన్ని గ్రంథాలకు, ముఖ్యంగా వేదాంత గ్రంథాలకు స్వయంగా భాష్యరచన చేసారు. ఒక్కో గ్రంథాన్నీ నాకున్న మిడిమిడి జ్ఞానంతోనే, అదీ పైపైనే చదివినపుడు ఎవరో నన్ను గుబురుకొన్న సారస్వతపు తోటలోకి బలవంతంగా తోసినట్లనిపించింది. కళ్లుతిప్పుకోలేనితనమూ, తిప్పుకోకపోతే మొత్తాన్నీ జుర్రుకోలేనన్న బాధా ఒకేసారి నన్ను చుట్టుముట్టాయి.

ఈ వ్యక్తి బ్రతికింది సుమారు 39 సంవత్సరాలు మాత్రమే. 16వ ఏట ప్రారంభించి, దేహం విడిచిపెట్టేవరకూ రచించిన గ్రంథాల సంఖ్య 146. ఇదేదో పైకి కనపడుతున్న ఒక అంకె కాదు. ఈయన కృతులలో మహాకావ్యాలున్నాయి. స్తోత్రాలున్నాయి. ధర్మశాస్త్రాది శాస్త్రగ్రంథాలున్నాయి. వ్యాఖ్యానాలున్నాయి. విమర్శలున్నాయి. అన్నిటికన్నామించి, అత్యుత్తమశ్రేణికి చెందిన అద్వైతగ్రంథాలున్నాయి. ఆజీవితాంతమూ ఈయన తపస్సు చేసారు. తపిస్తూ గ్రంథరచన చేసారు. గ్రంథరచననే ఒక తపస్సుగా చేసారు. వేదాంతదేశికులమల్లెనే ఈయనా హయగ్రీవమంత్రసిద్ధుడు. స్వప్నంలో హయగ్రీయమంత్రాన్ని పొంది, కృష్ణానదీతీరంలో వేదాద్రి నృసింహక్షేత్రంలో రెండు సంవత్సరాలపాటు తపస్సు చేసి ఆ మంత్రసిద్ధి పొందారు. సిద్ధులై తిరిగివచ్చిన తరువాత గుర్తుగా పమిడిపాడులోని వారి ఇంటి ముందు శ్వేతాశ్వమొకటి హయహేషలు చేస్తూ పరుగులు పెట్టేదట.

హయగ్రీవుడంటే అపారమైన ప్రేమ ఈ కవికి. హయగ్రీవుడి అనుగ్రహంతో ఆయన చదువుకున్నదానికంటే ఎక్కువ జ్ఞానశక్తి లభించిందని చెప్పుకున్నారు. గమనిస్తే, గణితంలో రామానుజన్ నూ, పాండిత్యంలో రామారాయకవినీ ఒకే చూపుతో చూడవచ్చు. అన్ని ప్రయోగాలను ఈయన సాహిత్యంలో చేసారు.

మహనీయుడైన తన దైవాన్ని తెలుపుదనపు కుప్పగా, చాంద్రసంబంధమైన అమృతమయుడుగా భావనచేస్తూ “హయవదనమిందుస్థితమయే” (చంద్రస్థితుడైన హయవదనుడ్ని పొందుతున్నాను) అన్న మకుటంతో హయవదనశతకాన్ని వ్రాసారు. ఇది ఒక మంత్రరహస్యం. సంకర్షణమహర్షి దర్శించిన హయగ్రీవస్తోత్రమంత్రంలోనూ ఈ స్వామి పూరితచంద్రమండలగతుడు గా భావన చేయబడ్డాడు (వందే పూరితచంద్రమండలగతం శ్వేతారవిందాసనం). ఈ శతకంలోని మొదటి శ్లోకాన్ని చూడండి -

స్వతశ్శ్వేతం మందస్మితరుచిపరీవాహసుభగం
సముద్ద్యడ్డిండీరచ్ఛవి పరివృతం కేసరభరమ్।
స్రజాప్తం మల్లీనాం కటివిలసితక్షౌమ రుచిరం
తతశ్రీఖండాంబుం హయవదనమిందుస్థితమయే ॥

హయగ్రీవస్వామి ఎటువంటివాడు? స్వతస్సిద్ధంగా తెల్లనివాడాయన (స్వతశ్శ్వేతుడు). చిరునవ్వు కాంతి ప్రవాహం చేత సుందరుడు. ఉద్భవిస్తున్న నురుగువంటి తెలుపు కాంతులతో పరివృతుడు. గుర్రం నోటివెంబడి నురుగు పుడుతుందన్నది తెలిసిందే. ఆ నురుగును స్ఫురింపచేసాడు కవి. ఆయన కేసరభరుడు - తెల్లని జూలుతో నిండినవాడట. మల్లెల మాలలకు ఆప్తుడట. క్షౌమమంటే తెల్లబట్ట. ఆయన నడుముకు సైతం తెల్లబట్టనే కట్టుకున్నాడు. దానితో రుచిరుడై భాసిల్లుతున్నాడు. శ్రీఖండాంబువు అంటే చందనరసం. దాన్ని పూసుకుని ఉన్నాడట.

ఇది వర్ణన కాదు. దర్శనం. ఈ శతకమంతా ఇంతే. చదువుతున్నకొలదీ పులకలు పుడుతూనే ఉంటాయి. ఈ శతకంతో పాటుగా “హ” కారంతో ప్రారంభిస్తూ హయగ్రీయసహస్రనామావలి ని రచించారీయన. స్తుతికే కాదు, నవోహకల్పనలోనూ ఈయనది అందెవేసిన చేయి. ఉదాహరణకు, చంపూభాగవతంలో ఈకవి వ్యాఖ్య వ్రాసిన శ్లోకమిది -

కస్త్వం ఘోరవిలోచనోఽసి భుజగోత్తంసః కపాలీ జటీ
దేవ్యాశ్శాసనమంతరేణ భగవన్నంతఃపురః మాగమః।
ఇత్థం ద్వారి నివారితం పురహరం నిధ్యాయ దౌవారికై
ర్యన్మాతః విదధాసి మందహసితం దద్యాత్తదిష్టాని నః॥

పార్వతీకల్యాణసమయంలో పరమశివుడు తన ఘోరమైన రూపాన్ని విడిచిపెట్టి, అపరమన్మథాకారుడిగా తయారయి పెండ్లాడాడని మనకు తెలిసిన సంగతి. పెళ్లి తరువాత మళ్లీ ఆయన తన స్వస్వరూపాన్ని ధరించి అత్తారింట్లో భార్య ఉన్న అంతఃపురానికి వచ్చాడట. ఆయన్ను సుందరంగానే చూసి, ఆయన యొక్క స్వస్వరూపం తెలియని అక్కడి ద్వారపాలకులు ‘ఎవరయ్యా నువ్వు, ఘోరవిలోచనుడివి, పాములు పెట్టుకున్నావు, కపాలాలు ధరించేవు, జడలతో తపస్విలాగా ఉన్నావు? రాణి గారి ఆజ్ఞలేకుండా అంతఃపురంలోకి రావొద్దు!’ అని వారించారట. ఆ పురహరుడ్ని చూసి లోపల ఉన్నటువంటి హైమవతి మందహాసం చేసిందట! అ లేనవ్వు మనయొక్క ఇష్టాలను తీర్చుగాక అని.

రామరాయకవి కవిత్వం సుగుణమంజూష. శబ్దార్థాల సమోగుంఫనతో మహోన్నతశ్రేణికి చెందిన కవిత్వాన్ని వందకిపైగా పుస్తకాలలో పరచారేమో, ఆ వాఙ్మయాన్ని తల్చుకోగానే మనసొక మహాశ్వంలా దౌడు తీస్తుంది. అంతటి మహాతపస్వి అయినా, ఆయన కందర్ప దర్ప విలాసమని భాణప్రబంధాన్ని వ్రాసారు. భాణమంటే ఏకాంకిక. అందులో ఒక సుందరిని వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకం చూడండి -

శంపాకంపకరీ నభోమణిఘృణేస్సంతాపదాత్రీ విధో
ర్లేఖాయాశ్చ కళంకదా సురసతీనేత్రానిమేషప్రదా।
లక్ష్మ్యాస్సాగరవాసదాఽపి చ గిరోనద్యాత్మకత్వప్రదా
ప్రాణత్యాగకరీ సురూపవిభయాసత్యాశ్చరత్యాః పదమ్॥

ఆమె శంపను కంపింపచేసేదట (ఈమెను చూసి వడకిందని) . సూర్యుడికి సంతాపాన్నిచ్చేదట (తాళలేకపోయేడని). చంద్రరేఖకు కళంకాన్నిచేదట(స్త్రీముఖంతో పోలిక కదా. ఈమె ముఖంతో అది కుదరదని). అప్సరసలకు అనిమేషత్వాన్నిచేదట(ఈమెను కళ్లు మూయకుండా చూస్తారని). లక్ష్మికి సముద్రవాసాన్నిచ్చేదట (దూరంగా పంపేదని). మాటలను నదులుగా ప్రవహింపచేసేదట (ఈమెను చూస్తే కవిత్వమొస్తుందని). పై వస్తువులకు, అక్కడ చెప్పిన ధర్మాలు సహజసిద్ధమైనవి. అయినా అవి ఈమె అందంవల్ల కలిగేయని కవి చమత్కారం. ఇంకో శ్లోకం చూడండి -

కర్ణికారకృతకర్ణికా బ్రుడధమర్ణికావిజితకర్ణికా
చూర్ణికాతిపరమర్ణికా హసితవర్ణికా కలితవర్ణికా।
స్వర్ణికాయ్యనుతవర్ణికా మదనపూర్ణికాశముఖజర్ణికా
జూర్ణికాలలదపర్ణికా భువి కపూర్ణికాకుచగపర్ణికా॥

ఈ కవి పదాలను తయారుచేయడంలోనూ, తయారు చేసినవి గుప్పించడంలోనూ ఏమాత్రం జంకడు. పైది ‘ర్ణ’ అనుప్రాస. ఈ క్రింద శ్లోకాన్ని చూడండి -

రక్షఃకుక్షింమ్భరేత్వత్క్షపణమివ కియత్క్షుణ్డహర్యక్ష రూక్షా
క్షీణాక్షాన్తి ప్రతాపక్షపిత పురహిరణ్యాక్షదోరక్షమస్య।
తత్పక్షీయోక్షవక్షఃక్షితిధరవర విక్షోదనాక్షీణవజ్ర
క్షేపహ్రీకృన్నఖస్యక్షణ ఇవ శరనిఃక్షీణపాథోనిధేర్మే॥

పాషాణం, నిజమే. ఈ శ్లోకాన్నిక్కడ చూపడానికి కారణం ఈయన మాములు వాళ్లలా పదాలను అక్కడా ఇక్కడా చూసి, వాటిని ఏరుకొని గుదిగుచ్చి కవిత్వం చెప్పవలసిన అగత్యం పట్టినవాడు కాడు. అవసరమైతే అంతకు ముందు కూడా లేని పదాలను మన కృష్ణదేవరాయలలాగా కల్పించగలిగే పదకర్మాగారం. భాషమీద ఎంత అధికారి అంటే రామరాయకవి, సంస్కృతవ్యాకరణసిద్ధాంతకౌముదికి సప్రామాణీకమైన శరద్రాత్రి అని ఒక వ్యాఖ్యను లిఖించేటంత. అసలు ఈయన ఇచ్చినటువంటి పశ్యాపశ్యౌ న పశ్యతః అన్న సమస్యను తిరుపతి వేంకటకవులు వ్యాకరణపరంగా అశుద్ధమని వాదిస్తూ ‘పశ్య’శబ్దమీమాంసతో శలభాలభనము వంటి వ్యాసాలను వ్రాసారు. తరువాత ఆ సమస్యను -

యః పశ్యతి జగత్సర్వం యో న పశ్యతి పశ్యతః।
తావుభౌ పరమాత్మానం పశ్యాపశ్యౌ న పశ్యతః।

అని పూరించేరు. అది సరైన పూరణ కాదని రామరాయకవీంద్రులు, గుంజాగర్వభంజనమ్ - పంచాననపలాయనమ్ అన్న గ్రంథాలు వ్రాసి పద్దెమిది విధాలుగా ఆసమస్యను పూరించి చూపించారట! ఇంకా అనేక సమస్యలను కల్పించి, సమస్యారత్నాకరమనే గ్రంథాన్నీ వెలువరించేరు. ఈరెండూ ఇప్పుడు దొరకవు. శ్లోకాలను తిరగేసి వ్యాఖ్యానించడం సరదా ఈయనకు. ఒక పండితసభలో కాలిదాసు పేరుమీదున్న షడ్జామడ్జఖరాడ్జ శ్లోకానికి అక్షరాలను తిరగేసి వ్యాఖ్యచెప్పారట.

అద్వైతవేదాంతానికి ఈ మహర్షి చేసిన ఉపకారాన్ని చెప్పి తీరాలి. ఈయన విశిష్టాద్వైతి. వైష్ణవుడు. వైష్ణవుడైన చక్రపాణి రంగనాధుడికి నృసింహస్వామి అనుగ్రహంతోనే శివమంత్రం దొరికినట్లుగా, ఈయన జీవితంలో చిత్రంగా హయగ్రీవుడి అనుగ్రహం చేత వైష్ణవం బదులు అద్వైతం ప్రవేశించింది. ఆధునికకాలంలో ఈయనంత బలంగా అద్వైతాన్ని దర్శించిన మనిషి లేడు. ఉపనిషత్తుల వాక్యాలను సరళసంస్కృతంలో శ్లోకాలుగా వ్రాయడం, ఆదిశంకరులు, ఆయన శిష్యపరంపరా చూపనటువంటి సమకాలీన ప్రమాణాలనూ, ఉదాహరణలనూ నూతనంగా చెప్పడం, అద్వైతాన్ని వ్యతిరేకిస్తూ, దూషించిన అన్యమతాలకు ప్రమాణాలు చూపించి తన సిద్ధాంతాన్ని నిలబెడ్డటం, గొప్ప గొప్ప వ్యాఖ్యా గ్రంథాలనూ, విమర్శగ్రంథాలనూ వ్రాయడం, అద్వైతభావనాప్రతిపాదన చేయడం అనే నానాముఖాలతోటి ఈ ఋషి అద్వైతరచనావ్యాసంగం ప్రకాశించింది.

వేదాంతముక్తావళి అన్న గొప్ప గ్రంథంలో శార్దూలవిక్రీడిత ఛందస్సులో ఉపనిషత్తులను కూర్చారీయన. ప్రసిద్ధిచెందిన దశోపనిషత్తులకు కైవల్యోపనిషత్తునూ, శ్వేతాశ్వతరోపనిషత్తునూ జోడించి, 790 శ్లోకాలున్న ఈరచనను కేవలం నెలరోజులలో పూర్తిచేసారు! ఈ విషయం తెలియగానే నేను పొందిన సంభ్రమం వర్ణనాతీతం.

ఈశావాస్యమిదగ్ం సర్వమన్న మంత్రం ఎంత అందమైన శ్లోకంగా మారిందో చూడండి -

ఈశావాస్యమిదం సమస్తభువనం త్యక్త్వార్థగేహాదికం
బ్రహ్మణ్యేన ముముక్షుణానవరతం నిష్ఠా విధేయాఽఽత్మని।
అర్హత్వాయ చ తత్ర కర్మవిహితం కార్యం పురా నిష్ఫలం
విద్వానిత్థముపాచరన్ హి భజతే నిర్లేప అత్మాశ్వరమ్॥

IIT Bombay లో ప్రొఫెసర్ గా పని చేస్తూ, న్యూఢిల్లీలోని Indian Science Academy కి Fellowగా ఎంపికైన కె. రామసుబ్రమణియన్ వేదాంతశాస్త్రంపై యూట్యూబులో ఇచ్చే బోధనలలో భాగంగా శంకరుల శతశ్శ్లోకి తరువాత ఈ వేదాంతముక్తావళిని ఎన్నుకొన్నారు. ఆ పాఠాలను చూసినపుడు ఒక తెలుగువాడిగా, ఒక వేదాంతవిద్యార్థిగా ఎంతో ఆనందాన్ని పొందాను.

వేదాంత సంగ్రహః, వేదాంత నిశ్చయః, అద్వైతవిజయః, సిద్ధాంతసింధుః, వేదాంతముక్తావళీ, దేహ-దేహిభావ నిర్మూలనమ్, అద్వైతామృతమ్, వేదాంతతత్త్వామృతమ్, శారీరికచతుస్సూత్రీవిచారః అనేవి ఈయన సిద్ధాంతరచనలలోకి వస్తాయి. శాంకరాఽశంకరభాష్యవిమర్శః, భగవద్గీతాభాష్యార్కప్రకాశికా, కృష్ణోద్ధవసంవాదవ్యాఖ్య ఇత్యాదులలో ఈయన చేసిన అన్యమతఖండన కనిపిస్తుంది. ఈయనగ్రంథాలలో వివరణ ఎక్కడా పొల్లుపోదు.

మైసూరుకు చెందిన ఎస్.జగన్నాథ్ అనే సంస్కృతపండితుడు ఈయన్ను “అశ్వధాట్యాం మల్లః” అని పిలిచేడు. అశ్వధాటీవృత్తరచనలో దక్షిణభారతదేశంలో ఈయన్ను మించినవాడు లేడని ఆయన ఉద్దేశం! కృష్ణలీలాతరంగిణి అన్న కృతిలో రామరాయకవి వ్రాసిన కొన్ని అశ్వధాటి వృత్తాలను చూడండి -

-

వృందావనే సదరవిందాసనాది వర బృందారకస్తుతివచో-
మందారపుష్ప మకరందానుభూతి సుఖసందానితాశయగజమ్।
వృందారకేంద్ర మణిబృందాయితాత్మతనుకందాద్యుదంచితరుచి-
స్యందానుమోదిత సునందాదిగోపమరవిందాంబకం హృదిభజే॥

-

నారాయణం నటనపారాయణం మదనపారాయణం సుమనసాం
మారాయణం కలితధీరాయణం కుసుమవారాయణం సుమనసామ్।
సారాయణం సుగుణవారాయణం నయనపారాయణం సుమనసాం
ధీరాయణం ప్రకృతిమారాయణం విమలనారాయణం హృది భజే॥

-

పున్నాగ వేత్సి కిము మన్నాథమభ్రతనుభృన్నాయకీజన శుభం
సన్నాథవక్త్రమరిభిన్నాగబాహుమవనున్నాశ్రితాఘచరణమ్।
పున్నాగయానమలిజిన్నారదాలకమఖిన్నాశయం శుభదృశా-
ఽఽపన్నావనం చ తిలసన్నాసికం భవుకకృన్నామకం నరవరమ్॥

-

దోషాకరః క్వ బత శోషాశ్రయః శశకపోషాకృతిస్తవ పతే
దోషాపహం యువతిశోషాపహం స్వరసపోషాకృతి క్వ వదనమ్।
రోషాత్ పికవ్రతతిరేషా వినిందతి చ యోషా ఇమాస్తవ ముఖాత్
భాషా వినిస్సరతు యైషాం ప్రభూతమదదోషా కృతార్థయ జనమ్॥

-

హంసాయ దుష్టబకహింసాయ చంపకవతంసాయ యాదవకులో-
త్తంసాయ భక్తజనసంసారదుస్తిమిరహంసాయ పావనదృశే।
కంసారయే పరమహంసావలీవినుతహంసాయుతాకృతిధృతే
హంసాత్మనే శశివతంసాదిదృగ్జలజ హంసాయ మే నతిరియమ్॥

-

చదవగానే అర్థం తెలియకపోయినా అనుభూతి కలగడం గొప్ప కవితయొక్క లక్షణం. రామరాయల అశ్వధాటి అటువంటిది. ఈయన ఎంత పండితుడో అంతటి కవి. ఎంతటి కవో అంతటి వేదాంతి. ఇటువంటి ఒక మనిషిని ఈ నేల మళ్లీ ఎన్నాళ్లకు చూస్తుందో!

డిసెంబరు 27 (1875, మార్గశిర అమావాస్య) రామరాయకవీంద్రుల పుట్టినరోజు. వేదాంతముక్తావలిని కనుక్కొని, శంకరుల శతశ్శ్లోకి తరువాతి స్థానాన్ని ఆ గ్రంథానికి ఇచ్చిన రామసుబ్రమణియన్ తెలుగువాడు కాదు. దక్షిణభారతంలో అశ్వధాటిని అల్లేవాళ్లల్లో రామరాయను మల్లునిగా ఎన్నిన జగన్నాథ్ కూడా తెలుగువాడు కాదు. ప్రపంచమంతా ఈ మహాపురుషుడిని ఎప్పుడో నెత్తిమీదకెత్తుకుంది.అయినా, దురదృష్టమేమిటంటే ఈయన్ను ప్రపంచమింకా పూర్తిగా చదవలేదు. తెలుగువాళ్లు అసలే చదవలేదు. బ్రతికింది కొద్దికాలమే అయినా రామరాయకవి ప్రచండభానుడై అద్వైతాకాశంలో వెలుగులు ప్రసరింప చేస్తూనే ఉంటారు.

ముహూర్తం జ్వలితం తేజో న తు ధూమాయితం చిరమ్.

*

Further reading-

1. Vedānatamuktāvalī Lecture series by Prof. Ramasubramanian

2. A Biographical Sketch of Bellamkonda Ramaraya Kavi--An Unexplored Sanskrit Scholar and Yogi by CHSN Murty

3. A study of Life works of Bellamkonda Rama Raya Kavi: PhD Thesis

4. List of works composed by Rama Raya Kavi

5. బెల్లంకొండ రామరాయ కవీంద్రుల జీవితచరిత్ర

6. A Sanskrit Paper अश्वधाट्यां मल्लः बेल्लंकोण्डरामरायः

7. The Contribution Of RamaRaya Kavi to the Upanishads by Dr. DurgaprasadaRao Chilakamarthi

8. బెల్లంకొండ రామరాయకవి గారి పుస్తకాలు, దిగుమతి లింకులు

Essay originally published on Facebook.